Thursday, November 19, 2009

అప్రస్తుత ప్రసంగం

ఆంధ్రులకు ప్రత్యేకమైన సాహితీ ప్రక్రియ అవధానం. ఇది పూర్తిగా ధారణ మీద ఆధారపడి ఉంది. అందులొ అప్రస్తుత ప్రసంగం విలక్షణమైనది. అవధాని ఏకాగ్రతను భంగం చెయ్యడమే దాని లక్ష్యం. అలాంటి అప్రస్తుత ప్రసంగానికి
అవధానులిచ్చిన చమత్కారమైన సమాధానాలు కొన్ని చూడండి.

* ఓ అవధానిగారికి నెత్తి మీద జుట్టు పల్చగా ఉంటుంది. ఆయనకు దాన్ని మాటి మాటికీ దువ్వుకోవడం అలవాటు.
అది చూసిన అప్రస్తుత ప్రసంగం వారు ఆ అవధానిని ఆట పట్టిస్తూ ' ఆ వున్న నాలుగు పుంజీల వెంట్రుకలు మాటి మాటికీ దువ్వాలేమిటి ? ' అని ఆక్షేపించాడు.
దానికా అవధాని గారు " నీకేం తెలుస్తుంది నాయనా నా బాధ ! నలభై ఎకరాలున్న వాడు ఎలా ఖర్చు పెట్టుకున్నా ఫర్వాలేదు. నాలుగు ఎకరాలే ఉన్నవాడు కొంచెం వెనుకా ముందూ ఆలోచించి జాగ్రత్తగా ఆ ఉన్న వాటిని కాపాడుకోవాలి. నా పరిస్థితీ అంతే ! " అన్నారు.

* " అయ్యా ! నాకో శుభలేఖ వచ్చింది. కీర్తిశేషులిద్దరు పెళ్ళి చేసుకుంటున్నారు. నన్ను రమ్మని ఆహ్వానించారు. వెళ్ళమంటారా ? " అని అడిగాడొక పృచ్చకుడు ఒక అవధానంలో .
దానికి సమాధానంగా అవధానిగారు " తప్పకుండా వెళ్ళండి" అని ఆగారు. అందరూ ఆశ్చర్య పోయారు. ఏమిటీయన
కీర్తిశేషుల పెళ్ళీ అంటే వెళ్ళమంటాడు. స్వర్గానికి వెళ్ళమనా అని అందరూ అనుకుంటుండగా ' అమ్మాయి పేరు కీర్తి. అబ్బాయి పేరు శేషు. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటుంటే వెళ్ళడానికి మీకభ్యంతరం ఏమిటి ? "
అనగానే అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

( ప్రముఖ అవధాని డా. గరికపాటి నరసింహారావు గారు చెప్పిన సంగతులివి )

Vol. No. 01 Pub. No. 114

No comments:

Post a Comment