Thursday, November 25, 2010

విషాదంలోనూ వినోదమే !


విషాదంలోనుంచి వినోదం సృష్టించడంలో ప్రపంచ ఖ్యాతి గడించిన కళాకారుడు చార్లీ చాప్లిన్. ఆ ఒరవడిని అంది పుచ్చుకున్న తెలుగు నటుడు రేలంగి వెంకట్రామయ్య. తెలుగు చిత్రరంగంలో హాస్యనటులకు సుస్థిర స్థానం కల్పించిన నటుడు రేలంగి. ఆయన తెరమీద నవ్వినా, ఏడ్చినా ప్రేక్షకులకు వచ్చేవి కన్నీళ్లు కాదు.....నవ్వులే ! తెర మీద కనిపించినపుడే కాదు నిజజీవితంలో కూడా ఆయన ఎక్కడ కనిపించినా జనం నవ్వేవారు.


ఆయన
కారు దిగితే నవ్వు....
నడిస్తే నవ్వు......
ఆగితే నవ్వు.....
మాట్లాడబోతే నవ్వు.....
మాట్లాడకపోతే నవ్వు......
ఏం చేసినా నవ్వే ! ఏం చెయ్యకపోయినా నవ్వే !
................అలా సాగింది ఆయన నవ్వుల ప్రవాహం

1955 లో హైదరాబాద్ లో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్ లో ప్రముఖ నాటుడు స్థానం నరసింహారావు గారి  చేతుల మీదుగా రేలంగి వెంకట్రామయ్య గారికి ఘన సన్మానం జరిగింది. ఆ సన్మానానికి రేలంగికి నోట మాట రాలేదు. గొంతు పూడుకుపోయింది. కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీళ్లు. ఆది చూసి ప్రేక్షకుల నవ్వులు.
అప్పుడు చూడండి రేలంగి గారి పరిస్థితి. ఎలాగో గుండె దిటువు చేసుకుని నేను నిజంగానే ఏడుస్తున్నానని ప్రకటించారు. ఆయన పరిస్థితి అర్థమైన కొంతసేపటికి ప్రేక్షకుల నవ్వులు ఆగాయి.
స్థానం వారు " ఎందుకు బాబూ నీకీ కన్నీళ్లు ? " అని అడిగారు.
గద్గద స్వరంతో రేలంగి గారు " గతంలో నాటకాల్లో వేషం వెయ్యాలని కోరికతో మీదగ్గరకొచ్చి అడిగాను. నువ్వు నాటకాలేం వేస్తావు పొమ్మన్నారు. ఈరోజు మీ చేతుల మీదుగా సన్మానం అందుకోవడం నిజంగా ఆ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఈ ఆనంద భాష్పాలు " అన్నారు. సభంతా గంభీర వాతావరణం నిండిపోయింది.
వినోదంలో ఎంత ఆనందాన్ని పంచగలడో విషాదంలో అంత అనుభూతిని పంచగల సమర్థుడు రేలంగి వెంకట్రామయ్య. హరికథకుడిగా, హార్మోనియం వాయిద్యకారుడిగా, రంగస్థల నటుడిగా ప్రారంభమైన రేలంగి 1935 లో శ్రీ కృష్ణ తులాభారం చిత్రంతో మలుపు తిరిగింది. హాస్యనటుడిగానే కాక గాయకుడిగా కూడా కొన్ని పాటలు పాడారు.

తెలుగు చిత్రాల్లో హాస్యానికి రాచబాట వేసిన రేలంగి వర్థంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ................



Vol. No. 02 Pub. No.

Thursday, November 11, 2010

జారిపోయిన జంట కవిత్వం

తెలుగు సాహితీ సంపద పెరుగుదలకు ఎందఱో సాహితీవేత్తలు, కవులు తమ వంతు కృషి చేశారు. వారిలో కొంతమంది జంట కవులు కూడా వున్నారు. వారిలో కొప్పరపు కవులు, తిరుపతివెంకట కవులు.... ఇలా ఎన్నో జంటలు విడివిడిగానే కాక జంటకవులుగా ప్రసిద్ధులు.


ఒకసారి ప్రముఖ కవులు దీపాల పిచ్చయ్యశాస్త్రి గారు, గుర్రం జాషువా గారు కలసి జంటగా కవిత్వం చెప్పాలని సంకల్పించారు. ఇతర జంట కవుల్లాగే తమ పేర్లు కలసివచ్చేలాగా తమ జంటకు ఒక పేరు పెట్టుకోవాలని ఆలోచించారు. ఎంత ఆలోచించినా వీరికి తమ పేర్లలోనుంచి సరిపోయే పేరు దొరకలేదు. ఏ రకంగా చూసినా పిచ్చి జాషువా అనో , జాషువా పిచ్చి అనో, దీపాల గుర్రం అనో ...... ఇలా ఏదో పెట్టుకోవాల్సి వస్తోంది. ఎంత కసరత్తు చేసినా తమ పేర్లతో కుదిరే కుదురైన అందమైన పేరు దోరక్క చివరికి జంటగా కవిత్వాన్ని చెప్పే ఆలోచనే విరమించుకున్నారట. దాంతో మరో కవుల జంట తెలుగు సాహిత్యం చేజారిపోయింది.  


Vol. No. 02 Pub. No. 054

Wednesday, November 10, 2010

అయిదుగురు ముఖ్యమంత్రులు - జవాబులు

 కనుక్కోండి చూద్దాం..... 31 - జవాబులు 

ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పడానికి పోటీ పడ్డ అందరికీ ధన్యవాదాలు. ఆ. సౌమ్య గారు కొంచెం ఆలోచిస్తే చెప్పగలిగేవారేనేమో ! Wit Real గారు చాలావరకూ సరిగానే చెప్పారు గానీ సంస్థ పేరు విషయంలో చాలా ఛాయస్ తీసుకున్నారు. వీరుభోట్ల వెంకట గణేష్ గారు అన్నీ సరిగానే చెప్పడమే కాకుండా మంచి వివరణ ఇచ్చారు. కొత్తపాళీ గారు సంస్థని సరిగానే ఊహించినా ఎందుకో పేర్లు విషయంలో కొంచెం ఆలోచించినట్లున్నారు. మలక్పేట రౌడి గారు అన్నీ సరిగానే చెప్పారు. అజ్ఞాత గారు చెప్పిన జానకి రామచంద్రన్ గారు ఒకప్పుడు నటి అయినా ఎక్కువ చిత్రాలు చెయ్యలేదు. AVM చిత్రాల్లో చేసిన దాఖలాలు లేవు. మిత్రులేవరిదగ్గరైనా దీనికి సంబంధించిన సమాచారం వుంటే తెలియజెయ్యగలరు.


దక్షిణ భారత దేశంలోని ఒక ప్రముఖ చిత్ర నిర్మాణసంస్థలో 
వివిధ విభాగాలలో అయిదుగురు ముఖ్యమంత్రులు పనిచేశారు.

అ.) ఆ సంస్థ పేరేమిటి ?          

జవాబు : AVM ప్రొడక్షన్స్    


ఆ.) ఆ అయిదుగురు ముఖ్యమంత్రులు ఎవరు?  
జవాబు : 1 . నందమూరి తారక రామారావు  - సంఘం, రాము లాంటి చిత్రాల్లో నటించారు.
            2 . ' ఓర్ ఇరవు ' అనే చిత్రానికి సి. ఎన్. అణ్నాదురై రచయిత 
            3 .  ' పరాశక్తి ' చిత్రానికి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి రచయిత
            4 . తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు ఎమ్జీఆర్
            5 . జయలలిత చాలా చిత్రాల్లో నటించారు. 

Vol. No. 02 Pub. No. 53a

Tuesday, November 9, 2010

అయిదుగురు ముఖ్యమంత్రులు


 కనుక్కోండి చూద్దాం..... 31 


దక్షిణ భారత దేశంలోని ఒక ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలో వివిధ విభాగాలలో అయిదుగురు ముఖ్యమంత్రులు పనిచేశారు.

అ.. ఆ సంస్థ పేరేమిటి ?

ఆ. ఆ అయిదుగురు ముఖ్యమంత్రులు ఎవరు ?




Vol. No. 02 Pub. No. 053

Monday, November 8, 2010

సి. యస్. ఆర్. హస్త సాముద్రికం

 తెలుగు చిత్ర రంగంలో కొన్ని పాత్రల గురించి ప్రస్తావన వస్తే కొంతమంది నటులు ప్రత్యేకంగా గుర్తుకువస్తారు. భారతంలోని శకుని పాత్ర పేరు చెబితే మొదటగా గుర్తుకు వచ్చేది చిలకలపూడి సీతారామాంజనేయులు. సి. యస్. ఆర్. గా ప్రసిద్ధుడైన ఈయన రంగస్థలం నుండి చిత్రరంగానికోచ్చిన వారే ! 1930 దశకంలో కథానాయకుడిగా వెలిగిన ఈయన 1950 దశకంలో క్యారెక్టర్ నటుడిగా మారారు. దేవదాసులో పార్వతిని పెళ్ళాడిన జమిందారు పాత్రలో ఆయన నటన ఎవరూ మర్చిపోలేరు. ఆ చిత్ర నిర్మాణ సమయంలో జరిగిన ఓ సంఘటన ఆయన మాటల చమత్కారానికి నిదర్శనం.

దేవదాసు షూటింగ్ విరామ సమయంలో సెట్ బయిట కూర్చున్న సావిత్రితో సి. యస్. ఆర్.
" అమ్మాయీ ! ఏదీ నీ చెయ్యి చూపించు " అన్నారు.

సావిత్రి  తన చెయ్యి చూపించి ఆయన ఏం చెబుతారా అని కుతూహలంగా చూస్తోంది . కాసేపు తదేకంగా ఆ చెయ్యిని పరిశీలించిన సి. యస్. ఆర్.
" నీకు మూడు ముఖ్యమైన విషయాలు చెబుతాను. అవి
ఒకటి నిన్నెవరూ సరిగా అర్థం చేసుకోరు.
రెండు నీ ప్రతిభకు తగ్గ వేషం దొరకడానికి ఇంకా కొంత కాలం పట్టవచ్చు
మూడు నీకు అప్పుడప్పుడూ స్టమక్ ట్రబుల్ వస్తూంటుంది " అన్నారు.

సావిత్రి ఆశ్చర్యపోయి " ఇంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు ? " అని అడిగింది.

దానికి సి. యస్. ఆర్. నవ్వుతూ " ఇందులో ఆశ్చర్యపోవడానికేముంది. ఎవరి చెయ్యి చూసినా ఈ మూడు విషయాలు మాత్రం సులువుగా చెప్పెయ్యొచ్చు . ఇవి అందరికీ అన్వయించే విషయాలే ! " అన్నారు. 

Vol. No. 02 Pub. No. 052

Saturday, November 6, 2010

భమిడిపాటి వారి ' దీపావళి '

నిన్న దీపావళి. ఈ దీపావళి పండుగ చిన్నతనంలోని చిలిపి జ్ఞాపకాలను వెలికి తెచ్చింది. అవన్నీ ఒక మాలగా గుదిగుచ్చి అందిద్దామని ప్రయత్నిస్తుండగా గతంలో చదివిన హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు గారి ' దీపావళి ' వ్యాసం గుర్తుకొచ్చింది. నా అనుభవాలని గుర్తు చేసే ఆ వ్యాసంలోని కొంత బాగం ఇక్కడ అందిస్తున్నాను. గిలిగింతలు పెట్టే ఆ భాగాన్ని అందుకుని ఆస్వాదించండి.








దీపావళిలో ‘ దీపం ‘ వేసి చూడకుండానే కొందరు మాట్టాడతారు. వెనక ఒక రాక్షసుడు చచ్చిపోయాడు గనుక వాడి నిమిత్తం మనం పిండివంటల్తో భోంచెయ్యాలనీ, దీపావళి నాటికి వాన్లు వెనకట్టడం జరుగుతుంది గనుక లోగడ పుట్టిపెరిగిన క్రిమి కీటకాదులు ( నలకలడయోరభేధ: ) సమూలంగా నశించడానికి దేశం అంతా తలంట్లుపోసుగుని బాణాసంచా కాల్చాలనీ, అల్లుళ్ళని పిలవడానికి ఆదే సందర్భంగనుక వాళ్ళ ముఖతేజం ఎక్కువ చేసే నిమిత్తం మతాబాలు కాల్పించాలనీ, మొదలైన పూర్వగాథలకి తడుముకోనూ లేదు. 

దీపావళి కాల్పులికి దరిద్రుడూ, ధనికుడూ వివక్షత లేదు, గానీ పిన్నా పెద్ద వివక్షతా, ఖర్చూ బేఖర్చూ వివక్షతా, కసీ బేకసీ వివక్షతా ఉన్నాయి. పిన్నలకి ఏదో ఇంత తగలేయ్యాలనీ, పెద్దలకి ఖర్చులేకుండా ఉంటే సరి ఇంకా తగలెయ్యమనీ ! దరిద్రుడైనా సరే కసి ఉంటే తల తాకట్టేట్టయినా సరే నరకాసురుణ్ణి దహనం చేస్తాడు. ఇంతవరకింకా దీపావళిలో దీపంసంగతి అప్రధానం అయిందే కానీ, ఆరిపోలేదు. 

ప్రధాన విషయం చప్పుడు ! ఎంత గొప్పచప్పుడు చేస్తే అంతా గొప్ప దీపావళి యోధుడు. దరిద్రుడు కాగితపు టపాకాయను పేల్చడం, ( సంచీ లామడిచి, ఒకవైపు చిల్లు చేసి, గాలి పోరించి, అది పొంగిన తరవాత నేల మీద పెట్టి ఒకటిచ్చుగుంటే ఠప్పుమనేవి ), ఖాళీ డబ్బాలు వాయించడం, డబ్బాలోరాళ్లేసి వేళ్లాడ గట్టి రెండు మూడు రకాల కర్రల్తో బాదడం - తరవాత తాటాకు టపాకాయలు ! ఇవేనా లేకుండా ఎవరూ ? ఇవి క్రమేపీ చౌకఅవడం కద్దు. మేఘదర్శనం అయేసరికి ఇవి కాళ్ళుపారజాచేస్తాయి. మరీ నాసిరకం పేలకపోయినా నాలిక గీసుకోవచ్చని కొందరు కొనడం. ఇవి పెల్తే ఒట్టి పేలుడే ! కానీ ఎడా పెడా ఎడా పెడా వాయించినట్టు పేలే సీమటపాకాయలు. ఎల్లానూ సీమ సీమే ! కొందరికి కసి ఆగక రెండుమూడు సీమటపాకాయల గుత్తులు కిరసనాయలు డబ్బాలోపడేసి అవి చెడామడా క్షోభపడిపోతోంటే ' వెయ్ వెయ్ ' అని కేకలేస్తూ డబ్బాని చావగొట్టడం ! 
గోడటపాకాయలని కూడా వస్తుండేవి  అరుగులమీద పరధ్యానంగా కూచున్న వాళ్ళు ఉలిక్కిపడేటట్లు ఒక్ఖటి గోడనిబాదేసి, దీపావళివీరుడు పరక్షోభగురించి నవ్వుకుంటూ పోతుండేవాడు. అవే నేల్నెట్టి జబ్బనేప్పెట్టేలాగా కొట్టేవాళ్లు కొందరు.వీట్లని మించిపోయినవి ఔట్లు. ఔట్లు పేల్చేవాళ్లు మహాధ్వనికారుల్లో జమ.ఒక దీపావళి రౌతు ఒక ముసలాయనతో చెప్పకుండా ఔటు పేల్చేసరికి ఆయనగుండే ఆగిపోయింది. అది ఆగిపోవడంవల్ల తెలిసింది గాని లేకపోతే ఆయనకి గుండె ఉన్నసంగతి తేలకపోయేదిగదా అన్నాడు ఆ రౌతు. 
వెలుగు గురించిన ఆరాధనలో మతాబాలు సార్థకం అయినా, అవి కాల్చడం అనేదాన్లో పౌరషం లేదు పొమ్మన్నారు. ఎందుకంటే - ప్రతి సందర్భంలోనూ ప్రతీవాళ్లూ మతాబా కాల్చగలరు గనుక ! కాల్చడంలో ఒకచోటనుంచి మరోచోటుదాకా వెళ్ళి ఇతరుల్ని బాధపెట్టే బాపతైన తూటాల వంటి వాట్లకి ఘరానాఎక్కువ. ఎడంచేత్తో అంటించిన తూటా పట్టుగుని ఇటూ అటూ రవ్వలు చిమ్ముతూ, ఒకవేళ చీదినా, అరిచెయ్యి దానిమ్మకాయ పగిలినట్టు పగిలినా, కిక్కురుమనకుండా చివరదాకా నిల్చేవాళ్లూ, 'బాబోయ్ ' అని తోకముడిచేవాళ్లూ ఉండేవాళ్ళు. కానీ, ఎంత ఎత్తుకి వేడితే అంత గొప్పవాడు అనేది దీపావళిలోనూ నిజమే. దీపావళి భటుడి అసలు అస్త్రం జువ్వ.అతడు జువ్వల రంగడు. జువ్వవదలడం కొత్తగా నేర్చుగునేవాళ్ళు తాటాకు చూర్లకీ చుట్టుపక్కజనానికీ భయకారణంగా ఉండేవాళ్లు. ఆరి తేరిన వాళ్ళు అల్లాంటిపన్లు చెయ్యక, ఊరవతలకిపోయి పాతిగముఫ్ఫై గజాల్లో ఎదరేదరగా నుంచుని, జువ్వలు నేలబారుగా వదిలి, పోటీ చేసుగునేవాళ్లు. దెబ్బలు తగిలినవాళ్ళని తక్కిన వాళ్ళు ఇంటికి మోసుకెళ్ళేవాళ్లు. అవీ ఇనీ కొనడంకంటే మనమే కట్టుగుంటే సొమ్ముకిమించిన సరుకొస్తుంది అనేగడుసుదనంతో వ్యవహరించి, యథాశక్తిగా కాళ్ళూ, వేళ్లూ, చేతులూ, చర్మమూ, వొళ్లూ, ఇల్లూ, ప్రాణమూ ధారపోసిన దీపావళి మత భక్తులుంటుంటారు - సంస్థ స్థాపించిన వాళ్ళ ఉద్దేశం ఈభక్తి కాదేమో అనితోస్తుంది. ఏమిటో, చెప్పలేం ! కొంత పిరికి తనం, కొంత దారిద్ర్యం, కొంత ఇతరులకి బాధ గలిగి దెబ్బలాట కోస్తారనే భయం - ఇవన్నీ ఉండడంవల్ల, నేను ఏ మతాబా అగ్గిపుల్లేనా కాల్చి ఉంటాను, గాని ఒకటోరకమైన మతాబాయేనా కాల్చినట్టు జ్ఞాపకంలేదు.
ఇదో రకం : 
" బాణాసంచా అంటే చెవి కోసుగుంటారు. సూర్యాస్తమయాలు చూసి ఆనందించలేరు కొందరుజనం " అంటాడు ఒక కవి.

 


Vol. No. 02 Pub. No. 051

Thursday, November 4, 2010

దిబ్బు దిబ్బు దీపావళి ...........

దిబ్బు దిబ్బు దీపావళి
మళ్ళీ వచ్చే నాగులచవితి
..............


గోగు మొక్కల దివిటీలు
దుష్టశక్తులను తరిమే కమిచీలు
పిల్లలకు అవి రక్షణ కవచాలు 
ఏవీ ఎక్కడా ఆ దివిటీలు ....
ఇక అవి గతకాలపు జ్ఞాపకాలు



మతాబులు.... కాకర పువ్వోత్తులు......
చిచ్చుబుడ్లు..... పటాసులు........
చిన్ని చిన్ని బుడతల కళ్ళల్లో మెరిసే కాంతులు
చెడును పారద్రోలి మంచిని తెచ్చిన నవ్యక్రాంతులు


 కుళ్ళు, కుత్సితాలును పారద్రోలే రోజు
అన్యాయం, అక్రమాలను రూపుమాపే రోజు
స్వార్థం, అధర్మాలను అంతం చేసే రోజు
 దోపిడీలను, దౌర్జన్యాలను అరికట్టే రోజు
మనకి అసలైన దీపావళి ఆ రోజు 





చైతన్య దివిటీలు వెలిగిద్దాం
అజ్ఞానపు చీకట్లు తొలగిద్దాం
దుష్టశక్తులను తరిమికొడదాం !

అందుకే దిబ్బు దిబ్బు దీపావళి ........





Vol. No. 02 Pub. No. 050

Wednesday, November 3, 2010

నరకాసుర సంహారం చేద్దాం !


భూమాత పుత్రుడు నరకాసురుడు
బ్రహ్మ వరం ప్రజలపాలిట శాపమయింది
అహంకారం హద్దులు దాటింది
దుర్మార్గం దుష్టత్వం విజృంభించింది
అన్యాయం అరాచకం ప్రబలింది


ధర్మ సంస్థాపకుడు శ్రీకృష్ణుడు
దుర్మార్గుడైన నరకాసురుడ్ని
సత్యభామా సహితుడై సంహరించాడు
దుర్మార్గానికి స్వ పర భేధం లేదని నిరూపించాడు

అరాచకాలు అంతమైన రోజు
అకృత్యాలకు భరత వాక్యం పలికిన రోజు
నరకాసురవధ జరిగిన రోజు
 ఆరోజే నరక చతుర్దశి

 తెల్లవారు ఝామునే మేలుకోవడం
తలారా స్నానాలు చెయ్యడం
మిఠాయి తినడం.. బాణాసంచా కాల్చడం
చెడుపై విజయాన్ని సంబరంగా జరుపుకోవడం

మరి ఈనాడు మన చుట్టూ నరకాసురులెందరో
ఆ నరకాసురులను చంపే కృష్ణుడెక్కడున్నాడో ...
నిజానికి మనలోని మాత్సర్యం, అహంకారాలే నరకాసురులు
వాటిని అంతం చెయ్యగలిగితే మనం కూడా సత్యభామా శ్రీకృష్ణులం 

Vol. No. 02 Pub. No. 049

Tuesday, November 2, 2010

శంకరశాస్త్రి....శారద.... ? - జవాబులు

  కనుక్కోండి చూద్దాం - 3 0 - జవాబులు 

ఈ ప్రశ్నలకు స్పందించిన మిత్రులకు ధన్యవాదాలు. మాధురి గారు మొదటి ప్రశ్నకు సరైన సమాధానమిచ్చారు. లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ గారు, కేకే గారు ఇచ్చిన సమాధానాలు అప్పట్లో కొన్ని ఆలోచనలు మాత్రమే ! పూర్తిగా నిర్ణయించినవి కావు. ఇక జవాబులు చూడండి.

 తెలుగు చిత్ర రంగంలో ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రంలో రెండు ప్రధానమైన పాత్రలు శంకరశాస్త్రి, ఆయన కూతురు శారద.
ఈ పాత్రలను పోషించిన సోమయాజులు గారు, రాజ్యలక్ష్మి చాలా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ పాత్రలకు ముందుగా నిర్ణయించింది వారిని కాదు.

మరి ముందుగా అనుకున్న ......
* శంకరశాస్త్రి ఎవరు ?
జవాబు : కృష్ణంరాజు గారు. అయితే అంతటి ఉదాత్తమైన పాత్ర ఔచిత్యానికి తన రెబెల్ హీరో ఇమేజ్ అడ్డు వస్తుందేమోననే సందేహం వ్యక్తపరచడంతో.... చాలా ఆలస్యంగా అప్పుడే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ప్రముఖ రంగస్థల నటుడు జే. వి. సోమయాజులు గారిని ఎంపిక చెయ్యడం జరిగింది.  

* శారద ఎవరు ?
జవాబు : తొలుత ఈ పాత్రకు అప్పడప్పుడే హీరోయిన్ గా నిలదొక్కుకుంటున్న జ్యోతిని అడిగారు. అయితే ఆ పాత్ర ప్రాధాన్యం తక్కువ అనే ఉద్దేశ్యంతో ఆమె ఒప్పుకోలేదు. దాంతో ఆ పాత్ర కూడా అప్పట్లో పరిశ్రమలో కొత్తగా అడుగుపెట్టిన రాజ్యలక్ష్మిని వరించింది. 

Vol. No. 02 Pub. No. 046a

Monday, November 1, 2010

కర్తవ్యం

కీర్తిశేషులు భోగరాజు పట్టాభిసీతారామయ్య గారు, కృష్ణాపత్రిక సంపాదకులు ముట్నూరి కృష్ణారావు గారు చాలా సన్నిహితులు. ఇద్దరి మధ్యా అంతులేని ఆత్మీయత ఉండేది.  విలువలు పాటించే ఆ రోజుల్లో కర్తవ్యానికి స్నేహం అడ్డు రాకూడదని నమ్మిన వారు.

ఓసారి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఎన్నికలు జరుగుతున్నాయి. సుభాష్ చంద్రబోస్ కు పోటీగా గాంధీగారి అభ్యర్థిగా పట్టాభిగారు నిలబడ్డారు. ఆ సందర్భంలో ముట్నూరి కృష్ణారావు గారు తన పత్రికలో పట్టభిగారిని ఘాటుగా విమర్శిస్తూ సంపాదకీయం రాసారు. ఈ విషయం తెలిసి తనకు అత్యంత ఆత్మీయుడు, తన గురించి సంపూర్ణంగా తెలుసున్న మిత్రుడు కృష్ణారావు గారు అలా రాసినందుకు పట్టభిగారు చాలా బాధపడ్డారు.

వారిద్దరికీ ఆత్మీయులైన కొందరు ఈ విషయాన్ని ముట్నూరి వారి దగ్గర చెప్పారు. అప్పుడాయన  తన తల మీద వున్న తలపాగాను తీసి బల్ల మీద పెట్టారు.
" ఇప్పుడు పట్టాభిని ఎవరైనా పల్లెత్తు మాటన్నా చీల్చి చెండాడేస్తాను " అన్నారు ముట్నూరివారు.

తలపాగా వృత్తి చిహ్నం. వృత్తి ధర్మం ఆయన చేత పట్టాభిగారిపై విమర్శలు చేయించింది.
స్నేహం వ్యక్తిగతం. ఆ స్నేహం ఆయన చేత మిత్రునికి రక్షణ కల్పించింది.

కర్తవ్యం వేరు......... వ్యక్తిగతం వేరు.........

................ అవీ అప్పటి పత్రికారంగ విలువలు.

Vol. No. 02 Pub. No. 048

Sunday, October 31, 2010

రెండో రాముడు

గతంలో రంగస్థల నాటకాలు సుదీర్ఘంగా సాగేవి. అందుకని రాముడు, కృష్ణుడు వంటి ముఖ్య పాత్రలను ఇద్దరు ముగ్గురు నటులు ధరించేవారు. ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు..... ఇలా ఆ పాత్రని ఫలానా నటుడు ధరిస్తాడని అని కరపత్రాల్లో ముద్రించేవారు.

అలాగ కాదుగానీ  మనకి వెండి తెర రాముడు అంటే గుర్తుకొచ్చేది నందమూరి తారక రాముడే ! ఆయన్ని తప్ప ఊహించుకోలేకుండా వున్న పరిస్థితుల్లో ఆయనే తన స్వంత చిత్రం ' సీతారామకల్యాణం ' లో మరో రాముణ్ణి ప్రవేశపెట్టారు. ఆ రాముడే హరనాథ్.

హరనాథ్ తండ్రి నటుడు అవ్వాలని మద్రాస్ చేరి సహకార దర్శకుడిగా మారారు. హరనాథ్ కి కూడా సినిమాల మీద, నటన మీద ఆసక్తి వున్నా తండ్రి తన అనుభవంతో విధించిన ఆంక్షల కారణంగా బి.ఏ. పూర్తి చేసేవరకూ ఆవైపు తొంగి చూడలేదు. ఇంటర్ మద్రాస్ లో చదివేటపుడు బాపు రమణలు ఆయన సహాధ్యాయులు. కాకినాడలో బి.ఏ, చదివేటపుడు ప్రముఖ నిర్మాతలు వి. బి. రాజేంద్రప్రసాద్, ఏడిద నాగేశ్వరరావు లు సహాధ్యాయులు.

తండ్రి వల్లో, మిత్రుల వల్లో హరనాథ్ కు సినిమాలలో అవకాశం రాలేదు.  బి.ఏ. పూర్తిచేసి మిలిటరీలో చేరే ఉద్దేశ్యంతో మద్రాస్ కొచ్చిన హరనాథ్ ఒకరోజు కోడంబాక్కం బస్సు స్టాప్ లో నిలబడి వుండగా అప్పట్లో ప్రముఖ కళాదర్శకుడైన సూరన్న చూసి తన కారు ఆపి ' సినిమాలో వేషం వేస్తావా ? ' అని అడిగాడు. తన చిరకాల కోరిక తీరే అవకాశం తనని వెదుక్కుంటూ వచ్చినందుకు షాక్ తిన్న ఆయన్ని నవశక్తి గంగాధరరావు గారికి పరిచయం చేశారు సూరన్న. అతని రూపం, హావభావాలు నచ్చి గుత్తా రామినీడు దర్శకత్వంలో తాను నిర్మించబోయే చిత్రంలో అవకాశం ఇచ్చారు గంగాధరరావు గారు.    

అలా హైదరాబాద్ సారధి స్టూడియోస్ లో చిత్రీకరించబడ్డ మొదటి చిత్రం ' మా ఇంటి మహాలక్ష్మి ' తో 1959 లో చిత్రరంగ గృహప్రవేశం చేసిన హరనాథ్ 60 వ దశకంలో తెలుగు చిత్ర సీమలో ప్రముఖ హీరోల సరసన చేరాడు. బడ్జెట్ చిత్రాల హీరో గా, పురాణ పాత్రలకు సరిపోయే ఆకారంతో, చూడ చక్కని రూపంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాడు. జమున, హరనాథ్ జంట అప్పటి ప్రేక్షకుల కన్నుల పంట.  ' భీష్మ ' ( 1967 ) చిత్రంలో కృష్ణుడిగా,  ' శ్రీరామకథ '   ( 1969 ) లో మరోసారి రాముడిగా నటించారు. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో సుమారు 130 చిత్రాల్లో నటించిన హరనాథ్ చివరి చిత్రం ' నాగు ' .  దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తొలిసారి హీరోగా నటించిన ' పగడాల పడవ ' చిత్రంలో హరనాథ్ ఓ ప్రముఖ పాత్ర పోషించారు. ఆ చిత్రం విడుదల కాలేదు.

ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి అన్ని లక్షణాలు వున్న వ్యక్తి కొన్ని అవలక్షణాల బారిన పడితే తన పతనం తానే కోరి తెచ్చుకున్నట్లవుతుందని చెప్పడానికి హరనాథ్ జీవితమే ఒక ఉదాహరణ.

ఈరోజు ( నవంబర్ 1 )  హరనాథ్ వర్థంతి. ఆయనలోని నటుడిని స్మరించుకుంటూ ..............



Vol. No. 02 Pub. No. 047

Saturday, October 30, 2010

శంకరశాస్త్రి.... శారద... ?

  కనుక్కోండి చూద్దాం - 3

తెలుగు చిత్ర రంగంలో ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ చిత్రంలో రెండు ప్రధానమైన పాత్రలు శంకరశాస్త్రి, ఆయన కూతురు శారద.
ఈ పాత్రలను పోషించిన సోమయాజులు గారు, రాజ్యలక్ష్మి చాలా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆ పాత్రలకు ముందుగా నిర్ణయించింది వారిని కాదు.

మరి ముందుగా అనుకున్న ......
* శంకరశాస్త్రి ఎవరు ?
* శారద ఎవరు ?

Vol. No. 02 Pub. No. 046

Friday, October 29, 2010

క్రీడోత్సవాలకు మరో కొత్త ఆట

 మొన్ననే కామన్ వెల్త్ క్రీడలు ముగిసాయి. మళ్ళీ ఆసియా క్రీడలు, ఒలింపిక్ క్రీడలు ఇంకా ఏవేవో వస్తాయి. వీటన్నిటికంటే ఇంగ్లీష్ వాళ్ళు మనకంటించిన క్రికెట్ ఎలాగూ వుంది. ఈ క్రీడా పోటీల నిర్వాహకులకి ఈసారి ఓ విజ్ఞప్తి చెయ్యాలని వుంది. వాళ్ళ క్రీడల జాబితాలో మరో కొత్త క్రీడను కలుపుకోమని చెప్పాలి. అందరం సామూహికంగా విజ్ఞప్తులు చెయ్యాలి. అవసరమైతే ఆందోళనలు చెయ్యాలి. ధర్నాలు, నిరాహారదీక్షలు, ర్యాలీలు.... ఇలా ఒకటేమిటి అనుకున్నది సాధించడానికి ఏమైనా చెయ్యాలి. ఎలాగైనా సాధించాలి.

ఇంతకీ అదేం క్రీడ అంటారా ? అక్కడికే వస్తున్నా ! కొంచెం ప్రాణాంతకమైనా మంచి ఉత్సుకత, సస్పెన్సు వగైరా పుష్కలంగా వుంటాయి. అసలు అవేమీ లేకపోతే ఆటలో థ్రిల్ ఉంటుందా ? కిక్ ఉంటుందా ? ఆమాటకొస్తే ఫుట్ బాల్, హాకీ.....చివరకి క్రికెట్ లో కూడా మనకు ఉత్కంఠగా వుంటుంది. ఆటగాళ్లకు ప్రాణసంకటంగానే వుంటుంది.... పాపం. వాళ్ళలోని క్రీడాస్పూర్తికి మనం పోటీలు పడి స్టేడియం అదిరిపోయేలాగా చప్పట్లు కొడతాం. బూరాలు ఊదుతాం. డప్పులు కొడతాం. డాన్సులు చేస్తాం. ఇవన్నీ టీవీల ముందు వుండి కూడా  చేస్తాం. మన చేష్టలతో వాళ్ళు ఉత్సాహంతో రెచ్చిపోయి ఇంకా బాగా ఆడతారని సంబరపడిపోతాం. ఇంతలో వాళ్ళు అవుట్ అయిపోయి పెవిలియన్ దారి పడుతుంటే మన ఒక్కసారిగా ఉత్సాహం చల్లబడిపోతుంది. ఇంతకీ వాళ్ళు మన ఉత్సాహానికి రెచ్చిపోయి ఆడాల్సింది పోయి వెన్ను చూపుతారెందుకు అని ఒకసారి సావధానంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. మనకంత సావదానం, సావకాశం ఎక్కడుంటాయండీ ? అందుకే అంత దూరం ఆలోచించం. మనమిచ్చే డబ్బులకు ఆశపడి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటారా చెప్పండి. మన గోలకు అవతల జట్టు వాళ్లకు ఎంత ఒళ్ళు మండుతుందీ అన్నది మనకంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు కనుకనే అబౌట్ టర్న్.

అసలు ఇంగ్లీషువాడు మనం తోటల్లోనూ, పొలంగట్ల మీద, రోడ్లమీద ఆడుకునే కర్రా బిళ్ళా ఆట చూసే క్రికెట్ కనిపెట్టాడని నాకో అనుమానం. మీక్కూడా అదే అనుమానం ఉందా ? ఉంటుంది మరి. ఆ ఆట అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది కదా ! అలాగే మనం తోటల్లోను... అదే పార్కుల్లో, పొలంగట్ల మీద... అదేనండీ పేవ్ మెంట్ల మీదా ( అవేక్కడున్నాయని నన్నడక్కండి ), ఇంకా రోడ్ల మీదా ఆడుకునే ఈ ఆట కూడా అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలని నా ఆశ. ప్రభుత్వం ప్రోత్సాహమిస్తే పిల్లలు, పెద్దలు, మగవారు, ఆడవారు, మాన్యులు, సామాన్యులు..... ఇలా ఒకరేమిటి అందరూ తమ ప్రతిభ నిరూపించుకునే అవకాశం వస్తుంది. మిగిలిన ఆటల్లో క్రీడాకారులు కఠోర సాధనతో జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుంటుంటే ఈ ఆటలో ప్రజలందరూ క్రీడాకారులే ! అందరూ అంతర్జాతీయ స్థాయికి అవిరళంగా కృషి చేస్తున్నవారే ! మరి వాళ్ళనెందుకు ప్రోత్సహించకూడదూ ? ఇది నా మదిన దొలుస్తున్న ప్రశ్న.

ప్రతీ ఆటలోనూ రెండు జట్లుంటాయి. ప్రత్యేకమైన ప్రత్యర్థులుంటారు. వారి మధ్యనే పోటీ వుంటుంది. ఎదుటి జట్టుని మాత్రమే ఎదుర్కోవాలి తప్ప కనీసం రిఫేరీ మీదకైనా వెళ్ళకూడదు. అంటే వాటిలో స్వేచ్చ చాలా తక్కువ. మన ఆటలో స్వేచ్చ చాలా ఎక్కువ. దీనికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. జట్లు ఉండవు. ఎవరైనా ఎవరికైనా ప్రత్యర్థే ! ఎవరు ఎవరినైనా ఎంచుకోవచ్చు. అసలు ఎంచుకోకపోవచ్చు కూడా ! ఈ ఆటకు స్టేడియంలు అక్కరలేదు. క్రీడా శిక్షణా శిబిరాలక్కర్లేదు. కోచ్ లు అక్కర్లేదు. అన్నిటికంటే క్రీడాకారులకు పెద్ద పెద్ద పారితోషికాలక్కర్లేదు. చూసారా ఈ దేశానికి ఎంత డబ్బు ఆదానో ! రోడ్ వుంటే చాలు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండేదైతే మరీ మంచిది. బాల్, బాట్ లాటివి ఏవీ అక్కర్లేదు. ఒక చిన్న సాధనం మాత్రం అవసరం. అసలు ఈ ఆటకు అదే కీలకం. ఆటగాడికి శిక్షణ, నైపుణ్యం వగైరా లనవసరం. ఇప్పటికైనా అర్థం అయిందా ? అవలేదా ! వస్తున్నా .....వస్తున్నా ! అక్కడికే వస్తున్నా !

ఈ మధ్య మనం రోడ్ మీద నడుస్తున్నా, ద్వి/ త్రి/చతుశ్చక్ర వాహనం మీద వెళ్తున్నా తప్పనిసరిగా ఉండవలసిన వాటిలో మరో వస్తువు చేరింది. ఆ వస్తువే మనల్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చే ఆటలో నిపుణుల్ని చేస్తోంది. నడుస్తూ, డ్రైవ్ చేస్తూ తమలోకంలో తాము వున్నట్లు, పరిసరాలతో పనిలేనట్లు తమలో తామే మాట్లాడుకుంటూ వెళ్ళే లోకాతీతులు మీకందరికీ దర్శనమిచ్చే వుంటారు. అదిగో వాళ్ళే ఈ క్రీడాకారులు. ఫుట్ బాల్, బాట్ లాంటి వాటిలాగ వాళ్ళ చేతుల్లో ఉండే క్రీడా సాధనమేమిటో ఎవరైనా ఊహించగలరా ?

అదేనండీ సెల్ ఫోన్. దాంతో రోడ్ మీద మన క్రీడాకారులు చేసే విన్యాసాలు చూసి తీరాలి. మిగిలిన ఆటలు చూడాలంటే పెద్ద మొత్తాలు ఖర్చుపెట్టి టికెట్స్ కొనాలి. అక్కడ తోపులాటల్లో ఇరుక్కోవాలి. అవేమీ లేకుండా ఫ్రీగా దొరుకుతున్న వినోదం. ఒకరు సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెడుతుంటారు. మనం ఎదురు వెళ్ళామనుకోండి. మనల్ని చూసి ప్రక్కకు తప్పుకుంటారనుకుంటాం కదా ! ఊహు( ! తప్పుకోరు. మనకడ్డుగానే మనం ఎటు తిరిగితే అటు తిరుగుతారు. మన కాళ్ళల్లో కాళ్ళు పెట్టి మనల్ని పడగొట్టాలని చూస్తారు. మనం ఎన్ని తిట్టినా వాళ్ళ ధోరణిలో వాళ్ళుంటారు తప్ప మనల్ని పట్టించుకోరు. చూసారా వాళ్ళకెంత ఏకాగ్రతో ! మనల్ని పడగొట్టాలనే గానీ మరే ధ్యేయం లేనట్లు ఎంత సీరియస్ గా ఆడుతుంటారో ! ఆ ఆటలో సాధారణంగా మనమే ఓడిపోతామనుకోండి. ఎందుకంటే మనం ఆ ఆటలో నిష్ణాతులం కాదు కదా !

పోలో ఆట గుర్రపు స్వారీ చేస్తూ కూడా ఆడుతారు. అలాగే కొంతమంది సెల్ క్రీడాకారులు బైక్ లు డ్రైవ్ చేస్తూ ఆడే ఈ ఆట బహు ముచ్చటగా వుంటుంది. మనం బైక్ మీద వేడుతున్నామనుకోండి. మన ముందు వెడుతున్న ఓ బైక్ హటాత్తుగా స్లో అవుతుంది. కొద్ది క్షణాల్లోనే ఆ రౌతు ( బైక్ స్వారీ చేస్తున్న వ్యక్తి ) తల ఓ ప్రక్కకి ఒరిగిపోతుంది. వెనుకనున్న మనం పాపం అతని మెడకి ఏమైందోనని ఖంగారు పడతాం. హటాత్తుగా బైక్ వేగం పెరుగుతుంది. మనకి మళ్ళీ ఖంగారు. ఆ బైక్ అటూ ఇటూ ఊగుతుంది. ఓ ప్రక్కకి ఒరుగుతుంది. ఇదంతా ఆటలోని భాగమని తెలియని మనకి ఖంగారు మరింత పెరుగుతుంది. మన బైక్ వేగం పెంచి అతని ప్రక్కకి వెడతాం. ఏవో మాటలు వినబడతాయి. పరిశీలనగా చూస్తే ఒరిగిపోయిన మెడ క్రింద నలిగిపోతూ కనిపిస్తుంది సెల్ ఫోన్. పద్మవ్యూహంలో అభిమన్యుడు ఎలా జోరబడ్డాడో మనకి ప్రత్యక్షంగా తెలియదు గానీ ట్రాఫిక్ పద్మ వ్యూహంలో అతను సాక్షాత్తూ అభిమన్యుడి లాగే కనబడతాడు. ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం క్రీడాకారులకి అర్జున అవార్డులిచ్చినట్లు గానే ఈ సెల్ క్రీడాకారులకి అభిమన్య అవార్డులిచ్చి ప్రోత్సహించాలి. వీరు అలా సెల్ మాట్లాడుతూ రోడ్ మీద ఆట ఆడే తీరు బహు రమ్యం గా వుంటుంది. సడెన్ గా స్పీడ్ పెరుగుతుంది. మళ్ళీ స్లో అవుతుంటుంది. తన మానాన తాను పోతున్న వాహనం మీదకో, నడిచి వెడుతున్న మనిషి మీదకో వేడుతుంటుంది. ఖంగారు పడి తప్పుకోవడం వాళ్ళ వంతు. లేకపోతే ఔటే ! ఇదంతా చూస్తున్న రోడ్ మీద ప్రేక్షకులకి ఎంత ఉత్కంఠ ! అంతర్జాతీయ ఫుట్ బాల్ పోటీల్లో కూడా అంతటి ఉత్కంఠ వుండదేమో !

ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మాత్రం వీళ్ళు తమ ఆటకు బ్రేక్ తీసుకుంటారు. అక్కడ వాళ్ళ శత్రువులు ( పోలీసులు )  వుంటారు కదా ! ఆది కూడా ఒక కారణం. అసలు ఈ దేశంలో క్రీడా స్పూర్తి లేదు. క్రీడాకారులకు స్వేచ్చ లేదు. లేకపోతే హాయిగా రోడ్ మీద ఆటను ప్రాక్టీసు చేస్తున్న వాళ్ళ మీద కేసులా ? వాళ్ళు రేపొద్దున్న అంతర్జాతీయంగా రికార్డులు సృష్టిస్తే మాత్రం సన్మానాలు చేస్తారు. ఏమిటో ఈ న్యాయం ? చట్టాలు మార్చమని కూడా ఆందోళన చెయ్యాలి.

అసలు ప్రత్యర్థులను ఓడించడంలో వీళ్ళను మించిన వాళ్ళు ఇంకెవరూ వుండరేమో ! అప్పటివరకూ రోడ్ కి ఓ ప్రక్కగా వెడ్తున్న వీళ్ళకు ఫోన్ రావడం పాపం ... రోడ్ మధ్యలోకి వచ్చి వెనుక వచ్చే ప్రత్యర్థుల్ని చిత్తు చెయ్యడానికి వీళ్ళు చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్ళు వెళ్ళరు. వీళ్ళని వెళ్ళనివ్వరు. హార్న్ కొట్టినా వినిపించుకోరు. అడ్డు తప్పుకోరు. చివరికి వాళ్ళ బైక్ కి మన బైక్ తగిలి ఆక్సిడెంట్ అవుతుందేమోననే భయంతో మనం సడెన్ బ్రేక్ వేసి.. దాంతో బైక్ స్కిడ్ అయి క్రింద పడి దెబ్బలు తిని ఈ ఆటలో ఓడిపోయి అయోమయంగా చూస్తుంటే విజయగర్వంతో ఆగకుండా ముందుకు సాగిపోయే ఈ నిర్వికార క్రీడాకారులకు ఏ అవార్డు ఇచ్చి సత్కరించాలో అర్థం కాదు. ఈ విషయం నిర్ధారించడానికి ఓ కమిటీ వెయ్యాలి. వాళ్ళతో పోటీ పడలేని వాళ్ళు అంటే సెల్ ఫోన్ లేని వాళ్ళని, వున్నా డ్రైవ్ చేస్తూ, రోడ్ మీద నడుస్తూ సెల్ ఫోన్ లు మాట్లాడడం చేతకాని వాళ్ళని, ఆ క్రీడాకారుల్ని ఓడించే సామర్థ్యం లేనివాళ్ళని ఆ భగవంతుడే కాపాడాలి. యుద్ధంలోను, క్రీడల్లోనూ గెలుపోటములు దైవాధీనాలు. కానీ ఈ ఆటలో మాత్రం గెలుపు ఖచ్చితంగా సెల్ ఫోన్ డ్రైవర్లదే !

నీతి : దుష్టులను దూరంగా ఉంచవలెను. డ్రైవింగ్ లో సెల్ ఫోన్ మాట్లాడే వాళ్లకు మనమే వీలైనంత దూరంగా ఉండవలెను. ఇది నా స్వానుభవం.

 Vol. No. 02 Pub. No. 045

Thursday, October 28, 2010

పోటాపోటీ


తెలుగు చిత్ర రంగంలో ఇప్పుడు నడుస్తున్న కొత్త ట్రెండ్ టైటిల్స్ కోసం పోటాపోటీ. గతంలో కూడా ఈ పోటీ వున్నా ప్రజలకు అంతగా తెలిసేది కాదు. వాళ్ళల్లో వాళ్ళే పరిష్కరించుకునేవారు. ఇప్పుడు చీమ చిటుక్కుమంటే ప్రజలకు చేరిపోతోంది. చిన్న విషయం కూడా పెద్ద రాద్దాంతమవుతోంది. ఇది కూడా ప్రసార మాధ్యమాలు సాధించిన ప్రగతి పుణ్యమే !

అసలు ఈ పోటీ తత్త్వం తెలుగు చిత్ర రంగం ఆవిర్భవించిన తొలినాళ్ళలోనే ఆరంభమైంది. అయితే ఇప్పటి పోటీ పేర్లకోసమైతే అప్పటి పోటీ కథలకోసం !

  1933 లోనే ఈ పోటీ తత్వానికి అంకురార్పణ జరిగింది. ' రామదాసు ' పేరుతో రెండు చిత్రాలోచ్చాయి. ఒక చిత్రాన్ని బొంబాయి కి చెందిన ఇంపీరియల్ కంపెనీ నిర్మించగా మరో చిత్రాన్ని కలకత్తాకు చెందిన ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించింది. రెండవ చిత్రంలో సి. యస్. ఆర్, ఘంటసాల రాధాకృష్ణమూర్తి, రామతిలకం నటించారు. సి. పుల్లయ్య దర్శకత్వం వహించారు.

మరో విశేషమేమిటంటే అదే సంవత్సరం ' సావిత్రి ' పేరుతో రెండు చిత్రాలు వచ్చాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించిన చిత్రానికి సి. పుల్లయ్య గారే దర్శకత్వం వహించగా రామతిలకం, వేమూరి గగ్గయ్య, నిడుముక్కల సుబ్బారావు నటించారు.  

రెండో చిత్రం బి. వి. రామానందం దర్శకత్వంలో కృష్ణా ఫిలిం కంపెనీ నిర్మించింది. ఈయన విశ్వనట చక్రవర్తి ఎస్వీరంగారావుగారికి మేనమామ. ఇందులో సురభి కమలాబాయి, మునిపల్లె రాజు నటించారు. ఈ రెండింటిలో మొదటి చిత్రమే విజయం సాధించి ఒకే డేరా హాలులో సంవత్సరంపాటు ఆడిందని చెబుతారు. కథలలోనే కాదు పేర్లలో కూడా మార్పు లేకపోవడం ఈ చిత్రాల విశేషం.

1936 లో మళ్ళీ రెండు సినిమాలు పోటీ పడి రికార్డులలో నిలిచిపోయాయి. రెండింటి ఇతివృత్తం ఒకటే ! మొదటిది ' ద్రౌపదీ మానసంరక్షణ ' . లక్ష్మి ఫిల్మ్స్ పతాకంపైన నిర్మించిన ఈ చిత్రానికి ఎస్. జగన్నాథ్ దర్శకుడు. ఇందులో ప్రముఖ రంగస్థల నటుడు బళ్ళారి రాఘవ దుర్యోధనుడిగా నటించగా సురభి కమలాబాయి ద్రౌపదిగా నటించారు.

రెండవ చిత్రం ' ద్రౌపదీ వస్త్రాపహరణం '.  సరస్వతీ టాకీస్ పతాకంపైన నిర్మించిన ఈ చిత్రానికి హెచ్. వి. బాబు దర్శకుడు. ఇందులో కృష్ణుడిగా సి. యస్. ఆర్. ఆంజనేయులు, ద్రౌపదిగా కన్నాంబ, దుర్యోధనునిగా యడవిల్లి సూర్యనారాయణ నటించారు. ఈ చిత్రమే విజయం సాధించింది.


మళ్ళీ ఈ పోటీ చిత్రాల సందడి 1950 వ సంవత్సరంలో కనిపించింది. ' శ్రీలక్ష్మమ్మ కథ ' పేరుతో ప్రతిభా పతాకంపైన ఘంటసాల బలరామయ్య గారు స్వీయ దర్శకత్వంలో నాగేశ్వరరావు, అంజలీదేవిలతో ఒక చిత్రం నిర్మించారు.

' లక్ష్మమ్మ కథ ' పేరుతో శోభనాచల స్టూడియో వారు గోపీచంద్ దర్శకత్వంలో  సి. హెచ్. నారాయణరావు, కృష్ణవేణిలతో మరో చిత్రం నిర్మించారు. ఘంటసాల గారిని సంగీత దర్శకుణ్ణి చేసిన చిత్రం కూడా ఇదే ! రెండు చిత్రాలలోనూ ఈ చిత్రమే విజయం సాధించింది. 

ఇవీ తెలుగు చిత్ర రంగ తొలినాళ్లలోని పోటీ చిత్రాల వివరాలు.

Vol. No. 02 Pub. No. 045

Tuesday, October 26, 2010

నవలక్ష్ములు

అష్టలక్ష్ముల గురించి అందరికీ తెలుసు. మరి తొమ్మిదవ లక్ష్మి ఎవరు ? తెలుసుకోవాలనుందా ? అయితే .......

నటరత్న నందమూరి తారకరామారావు గారి వారసుడు బాలకృష్ణ నటుడిగా ఈ తరం ప్రేక్షకులకు తెలుసు. కానీ గత తరం ప్రేక్షకులకు హాస్యనటుడు బాలకృష్ణ గుర్తుండే వుంటారు. ' పాతాళ భైరవి ' అంజిగాడు అంటే చాలామంది సులువుగా గుర్తు పట్టేస్తారు. ఈ బాలకృష్ణ ఎన్టీరామారావు గారికి అభిమాన నటుడు కూడా !

బాలకృష్ణది చాలా జాలిగుండె. సెట్లో వున్నపుడు ఎవరైనా దిగులుగా కనిపిస్తే దగ్గరకు వెళ్ళి పలుకరించి ఓదార్చేవాడు. ఓసారి ఓ జూనియర్ ఆర్టిస్ట్ సెట్ బయిట దిగులుగా కూర్చుని వుండడం చూసి ........

" ఏంటి బాబాయ్ ! దిగాలుగా కూర్చున్నావు ? " అని అడిగారు.

దానికా నటుడు
" ఏం చెప్పమంటావ్ బాబాయ్ ? మాకు ఇప్పటికి ఎనిమిదిమంది ఆడపిల్లలు. ఇప్పుడు మళ్ళీ నా భార్య గర్భవతి. అదే నా దిగులు " అన్నాడు.

" ఓహో ! మళ్ళీ ఆడపిల్ల పుడితే ఇంకా ఖర్చు పెరుగుతుందనా నీ దిగులు ? " అని అడిగారు బాలకృష్ణ.

దానికా నటుడు
" ఖర్చు గురించి నాకు దిగులు లేదు. ఏదో తెర మీద కనిపించాలనే దురదతో ఈ ఫీల్డ్ లోకి వచ్చి ఈ ఎక్స్ ట్రా వేషాల బారిన పడ్డాను గానీ మీ దయవల్ల మా వూళ్ళో కావలసినంత ఆస్తి వుంది " అన్నాడు.

" మరింక దేనికయ్యా నీ దిగులు ? " అనడిగాడు బాలకృష్ణ

" ఇప్పటివరకూ నా ఎనిమిదిమంది కూతుళ్ళకూ ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, భాగ్యలక్ష్మి...... ఇలా అష్టలక్ష్ముల పేర్లు పెట్టేసాను. మళ్ళీ ఆడపిల్ల పుడితే ఏం పేరు పెట్టాలా అనేదే నా దిగులు " అని తన దిగులుకి కారణం తేల్చాడా నటుడు.

దానికి బాలకృష్ణ కొంచెం అలోచించి
" ఏముంది ? ఈసారి జ్యోతిలక్ష్మి అని పెట్టేయ్యి. సరిపోతుంది " అనేసి అక్కడనుంచి తప్పుకున్నాడు.

తోటరాముడు, నేపాళ మాంత్రికుడు, డింగరి లతో 'అంజి ' గాడిని ఈ పాటలో చూడండి....



  
Vol. No. 02 Pub. No. 044

Saturday, October 23, 2010

కళా దర్శకత్వం

 కనుక్కోండి చూద్దాం - 29 

ఈ  ఫోటోలో ఉన్నవారు తెలుగు వారు గర్వించదగిన వ్యక్తి.  బహుముఖ ప్రజ్ఞాశాలి. రచయిత, చిత్రకారులు, గాయకులు. తెలుగు చలన చిత్రరంగం తొలినాళ్ళలో రెండు చిత్రాలకు కళా దర్శకత్వం వహించారు.


* ఆయన పేరేమిటి ?

* ఆయన కళా దర్శకత్వం వహించిన చిత్రాల పేర్లు ఏమిటి ?  





Vol. No. 02 Pub. No. 043

Friday, October 22, 2010

మీసం చేసిన మోసం

 రంగస్థలం మీద నటునికి ముందుగా కావాల్సింది ధారణ శక్తి . ఎంత పెద్ద డైలాగ్ నైనా, ఎన్ని పేజీలున్నా తడుముకోకుండా సహజరీతిలో చెప్పాల్సివుంటుంది. జ్ఞాపకశక్తి అంతగా లేని నటుడు రంగస్థలం మీద రాణించడం కష్టమే !
సినిమాలో అయితే ఆ అవసరం తక్కువ. గతంలోనైతే ముందుగా పక్కాగా స్క్రిప్ట్ తయారయ్యేది, దాన్ని షూటింగ్ కి వెళ్లక ముందే నటీనటులకు పంపడం జరిగేది. వాళ్ళు బాగా చదువుకుని, హావభావాలు సాధన చేసి మరీ షూటింగ్ కి వచ్చేవారు. అందువలన దర్శకుడు ఇచ్చే సూచనలను బాగా అర్థం చేసుకుని నటించడానికి వీలయ్యేది. సెట్ మీద అప్పడికప్పుడు డైలాగ్ లు రాసుకుని, అసలు డైలాగ్ షీట్ అవసరం లేకుండా సీన్ చెబితే చాలు నటీనటులు ఎవరికి తోచిన డైలాగ్ లు వారే చెప్పుకునే స్థాయికి ఎదిగిన ఈరోజుల్లో ఈ సంగతి చాలామందికి తెలియక పోవచ్చు....తెలిసినా తెలియనట్లు నటించొచ్చు, లేదా అంత శ్రమ పడడం శుద్ధ దండగ అని కొట్టి పడేయ్యవచ్చు. 

ఎంత పెద్ద పేరున్న నటుడైనా ఎప్పుడైనా తడబడతాడేమో గానీ ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా ఒక్క అక్షరం పొల్లు పోకుండా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడా అన్నట్లు నటించే నటుడు సాక్షి రంగారావు. ఆయన సంభాషణా ప్రవాహానికి ఒక ఉదాహరణ ' నటనలో జీవించిన సాక్షి ' అనే టపాలో గతంలో వివరించాను.

అయితే ఎంత గొప్పవారికైనా, ఎంత జాగ్రత్త తీసుకున్నా ఒక్కోసారి తప్పటడుగు పడే సందర్భం వస్తుంది. అంతటి ధారణాశక్తి కలిగిన సాక్షి రంగారావు గారికి కూడా అలాంటి పరిస్థితి ఒకసారి ఎదురయింది. అయితే దాన్నుంచి ఆయన ఎలా బయిట పడ్డారో చూద్దాం.......

ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనపుడు బాధితుల సహాయం కోసం చలనచిత్ర నటులు సాంస్కృతిక ప్రదర్శనలివ్వడం ద్వారా ధన సేకరణ చెయ్యడం ఆనవాయితీ. అలా ఓసారి కరువు బాధితుల సహాయం కోసం సూపర్ స్టార్ కృష్ణ తెనాలిలో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రముఖ నటీనటులు పాల్గొన్నారు. అందులో భాగంగా కృష్ణ, చంద్రమోహన్, సత్యనారాయణ, రావికొండలరావు, రాధాకుమారి, సాక్షి రంగారావు పాల్గొన్న ' వింత మనుషులు ' అనే హాస్యనాటిక ప్రదర్శించారు.

సాక్షి రంగారావు చేతిలో గొడుగుతో స్టేజి మీదకు ప్రవేశించే ఘట్టం. ఆయన హుషారుగా వచ్చేసాడు. కానీ ఆయన  మీసం పెట్టుకోవడం మరచిపోయాడు. ఆది గమనించిన రావికొండలరావు గారు ఊరుకోకుండా సాక్షి చెవిలో ' మీసం పెట్టుకోలేదేం ? ' అని అడిగారు. దాంతో సాక్షిగారు తెల్లబోయారు. గుటకలు మింగారు. ఆ తప్పు ఎలా జరిగిందో అర్థం కాక అయోమయంలో పడిపోయారు.

అంతే ! ఆ దెబ్బకి చెప్పాల్సిన డైలాగ్ మరిచిపోయారు. తోటి నటీనటులందరి వంకా వెర్రిచూపులు చూస్తూ నిలబడిపోయారు. ఆయన మొహంలో రకరకాల భావాలు ఒకేసారి కనిపించాయి. డైలాగ్ గుర్తు తెచ్చుకోవడానికి రకరకాల వింత చేష్టలు చేశారు. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు మాత్రం ఆది కూడా నటనలో భాగమే అనుకుని ఆనందపడిపోయారు. పగలబడి నవ్వారు. చివరికి గండం గట్టెక్కిందనుకోండి. సాక్షి రంగారావు గారిని మీసం చేసిన మోసం కథ ఆది.   

Vol. No. 02 Pub. No. 042

Thursday, October 21, 2010

పరామర్శ

సంజీవదేవ్ ప్రముఖ చిత్రకారుడు. ఒకసారి ఆయనింట్లో దొంగలు పడ్డారు. నగలూ, నట్రా పోయాయి. ఈ విషయం ఆయన మిత్రుడైన రచయిత చలం గారికి తెలిసింది. సంజీవదేవ్ గారిని పరామర్శిస్తూ ఆయన ఓ ఉత్తరం రాసారు.

' దొంగలు పడ్డారని తెలిసింది. చారుదత్తుడిలాగ మీరు ఆ దొంగలు వేసిన కన్నం దగ్గర కూర్చుని వారి హస్త లాఘవాన్ని మెచ్చుకోవడం లేదు కదా ! 

  ఏమేం పోయాయి ? నగా నట్రా అయితే ఫర్వాలేదు. కానీ మీ దగ్గరున్న పుస్తకాలు, ఉత్తరాలు, చిత్రాలు భద్రంగా వున్నాయి కదా ! ఎందుకంటే అవి అన్నిటికంటే విలువైనవి కదా !  '

........... ఇలా సాగింది ఆ పరామర్శ.

నిజమే కదా ! నగలూ, నగదూ అయితే మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ విజ్ఞాన బాంఢాగారాలైన పుస్తకాలు వగైరా పోతే మళ్ళీ సంపాదించుకోవడం సులువు కాదు కదా ! అయినా వాటికంటే నగలూ, నట్రా విలువైనవి అంటారా ?

Vol. No. 02 Pub. No. 041

Tuesday, October 19, 2010

కీర్తి కండూతి



అనంతమైన కీర్తి సంపాదించాలని, తమ పేరు దశదిశలా మార్మోగిపోవాలని, ఆ కీర్తి ఆ చంద్ర తారార్కం నిలిచివుండాలని ఎవరికుండదు చెప్పండి ? అందుకే అందరూ ఆ కీర్తి కోసం తహతహలాడిపోతారు.

కొందరు ఈ విషయాన్ని నేరుగా వప్పుకోరు. ' అబ్బే ! నాకలాంటి కొరికలేమీ లేవండీ ! ఏదో నా జీవనం సాఫీగా గడిస్తే చాలు. మా పిల్లలు చక్కగా స్థిర పడితే అంతకంటే కావాల్సిందేముంటుంది. శేష జీవితాన్ని కృష్ణా, రామా అంటూ గడిపేస్తాను ' అంటూంటారు. వాళ్ళనే మీ గొప్పతనానికి మెచ్చి మీకు సన్మానం చెయ్యాలనుకుంటున్నాం అని చెప్పండి. ' అబ్బే ! సన్మానం చేయించుకునేంత గొప్పతనం నాలో ఏముంది చెప్పండి. ఏదో నా విధి నేను నిర్వర్తించాను. అంతే కదా ! ' అంటూనే పక్కవాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో నాకు సన్మానం చేస్తారట. వద్దన్నా వినడం లేదు అని చెబుతారు. ' పోనీలే ఆయన మొహమాట పడుతున్నాడు. ఈసారికి మరొకరిని వెదుక్కుందాంలే అని మనం అనుకునేలోగా పరోక్షంగా అంగీకారం తెలియజేసేస్తారు. సన్మానమంటే ఎవరికి చేదు చెప్పండి.

ఇంకా కొంతమంది వుంటారు. వాళ్ళకి ఇలాంటి సన్మానాలు, ప్రచారాలు చేయించుకోవాలని కోరిక బలంగా వుంటుంది. కానీ ఎవరిని, ఎలా అడగాలో తెలీదు. తెలిసినా అడిగితే వాళ్ళు ఏమనుకుంటారోనని సంకోచం. ఎవరి వల్లనైనా తమకు ప్రచారం వస్తుందని అనిపిస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతూ వుంటారు, ఎప్పటికైనా గుర్తించి తమకు సన్మానమో, మరోటో చేసి ప్రచారం కల్పిస్తారనే ఆశతో

మరికొంతమంది వుంటారు. తమకు ప్రచారం కావాలనుకోండి. మీడియా వాళ్ళను పిలిచి ఏదో ఒక విషయం మీద మాట్లాడేస్తుంటారు. ఈ మధ్య మీడియాలో వచ్చిన పోటీ ధోరణి వీళ్ళకు మరింత ఆలంబన. ఒకవేళ వాళ్ళు రారేమోననిపిస్తే ఏ స్టార్ హోటల్ లోనో విందు కార్యక్రమం, ఇతర ఆకర్షణలు ఏర్పాటు చేసి రప్పిస్తారు. మరి తిన్న విశ్వాసం చూపించాలి కదా అందుకే మర్నాడు మీడియాలో ఈయన మాటలు వచ్చేస్తాయి. అవి మామూలుగా వుంటే జనం ఒకసారి చూస్తారు. వివాదాస్పదంగా వుంటే ఇంక చెప్పనక్కర్లేదు. మరో కొన్ని రోజులు మీడియాకు విందు. ఈయనకు పసందు. దీనివలన కలిసొచ్చేది ఏమిటయ్యా అంటే పైకి కారణాలేమి చెప్పినా ఈయనకు అదో తృప్తి

వీళ్లలోనే మరో రకం. మీడియాను పోగెయ్యలేకపోయినా చుట్టూ పదిమందిని పోగేసి అక్కడ లేని వాళ్ళ గురించో, ప్రపంచ రాజకీయాల గురించో, చరిత్రలో లేని చారిత్రాత్మక విషయాల గురించో..... ఏదో విషయం గురించి మాట్లాడేస్తూ వుంటారు . ఆ విన్న వాళ్ళంతా ' అబ్బో మీకెన్ని విషయాలు తెలుసండీ ! ' అంటూ ఆశ్చర్యపోతుంటే... అబ్బో ..... ఆ సంతృప్తే వేరు

కీర్తి కండూతికి ఎన్నో అవతారాలు. అందులో మరో అవతారం అంటే మరో రకం వున్నారు. వీళ్ళు తమను తాము గొప్పవాళ్ళుగా వూహించేసుకుని చుట్టూ వున్నవాళ్లు ఆథములని వాళ్ళను వుద్ధరించడానికే తాము అవతరించామని చెప్పుకుంటూ సంతృప్తి చెందుతూ వుంటారు. వంగి వంగి దణ్ణాలు పెట్టే వాళ్ళకు వందలు వందలు సమర్పించుకుంటారు.  వళ్లు వంచి పనిచేసే వాళ్ళను తమకు దణ్ణం పెట్టలేదనే కారణంతోనో, మరో కారణంతోనో దూరం చేసుకుంటారు. తమకు బాజా వాయించేవాళ్ళకు పంచభక్ష్య పరమాన్నాలు..... కష్టసుఖాలన్నిటిలో తోడునీడగా నిలిచే కుటుంబసభ్యులకు పచ్చడి మెతుకులు. బయిట అందరూ నా గొప్పతనానికి అడుగడుగునా మెచ్చుకుంటున్నారు, ఇంట్లో మాత్రం వీసమెత్తు విలువలేదు.....ఇదీ వారి ఫిర్యాదు. బయిట వాళ్లయితే తమ స్వార్థం కోసం తప్పనిసరై మెచ్చుకుంటారని,  ఇంట్లో వాళ్ళకు అడుగడుగునా మెచ్చుకునే అవసరం లేదని, వాళ్ళకు వీరి పట్ల బాధ్యత వుంటుందే కానీ స్వార్థం కాదనీ  అర్థం కాదు. అర్థం అయినా అది ఒప్పుకునేందుకు అహం అడ్డొస్తుంది. ఎందుకంటే పొగడ్తలనే భ్రమలో బతికేస్తుంటారు కదా !

 ఈ కీర్తి కండూతి మహా చెడ్డది. దీనిలో పీకలదాకా మునిగిపోయిన వాళ్ళు స్వజనాన్ని దూరం చేసుకుంటారు. ఉన్నదంతా ఊడ్చుకుపోయాక పరజనం దూరం అయిపోతారు. నిజానికి అందరిలోనూ ఈ కీర్తి కండూతి అంతో ఇంతో అంతర్లీనంగా వుంటుంది. కాకపోతే కొంతమంది బయిట పడతారు. కొంతమంది గుంభనంగా వుంటారు. ఎవరైనా తమ స్వార్థంకోసమో, నిస్వార్థంగానో  మనల్ని పొగడ్తలతో ముంచెత్తినపుడు వివేకం వుపయోగిస్తే సమస్య వుండదు. 

ఏమైనా ఈ కీర్తి కండూతిని తగిన మోతాదులో వాడాలి.  శృతి మించితే వికటించి కళ్ళు మూసుకుపోతాయి.... చెవులు వినిపించవు.... బుద్ధి పనిచేయదు.... విచక్షణ నశిస్తుంది. ఆలోపతీ మందుల కంటే సైడ్ ఎఫ్ఫెక్ట్స్ చాలా వుంటాయి. అన్నీ ఉడిగాక... సర్వం హరించుకు పోయాక జ్ణానోదయం అయినా ప్రయోజనం లేదు. బెల్లంకోసం వచ్చిన ఈగలు అది ఖాళీ అవగానే ఎగిరిపోతాయి. తమని సదా అంటిపెట్టుకుని మంచిచెడ్డల్లో అండగా నిలిచే తన మనుష్యులు దూరం అవుతారు. చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. మనుష్యుల నైజమే అంత అనుకోండి. తమకందుబాటులో వున్నదాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అంతరిక్షంలో వున్నవాటికోసం అర్రులు చాస్తారు. 

మనలోని గొప్పతనం వల్లో, మన ప్రవర్తన వల్లో, మన మంచితనం వల్లో కీర్తి దానంతట అది రావడం ఎంత మంచిదో..... కీర్తిని బలవంతంగా తెచ్చుకోవాలనుకోవడం, కొనుక్కోవాలనుకోవడం అంత చెడ్డది. 

కీర్తి హానికరం కాదు. కీర్తి కండూతి మాత్రం అత్యంత ప్రమాదకరమైనది. కీర్తికోసం కాక ఒక ప్రయోజనం కోసం కృషి చేస్తే...  వస్తే దానంతట ఆదే వస్తుంది. లేకపోతే ఆత్మ సంతృప్తైనా మిగులుతుంది. కేవలం కీర్తికోసం మాత్రమే కృషి చేస్తే చివరకు అది అపకీర్తినే మిగులుస్తుంది. 

మనవి : ఈ వ్యాసంతో బాటు మానవ జీవితాల్లో కనిపించే ఇలాంటి విషయాల గురించి నా అనుభవంలో నాకు కలిగిన భావాలకి అక్షర రూపం తేవాలనే వుద్దేశ్యంతో రాయడం ప్రారంభించాను. మనసులో మెదిలినపుడు కొన్ని విషయాలని రాసి పెట్టుకున్నాను.  అయితే వాటికి మెరుగులు దిద్ది పూర్తి చేసి ప్రచురించడం ప్రారంభిద్దామనుకునే లోగా మా ఇంటర్నెట్ కనెక్షన్ లో గత నెల 24 వ తేదీ నుంచి సమస్య వచ్చింది. బి‌.ఎస్‌.ఎన్‌.ఎల్. వారితో ఒక రకంగా యుద్ధం చేశాక, జి‌ఎం వరకూ వెళ్ళాక విజయదశమికి ముందురోజు అంటే సుమారు 20 రోజుల తర్వాత  పూర్తి పరిష్కారం దొరికి మామూలుగా పనిచేస్తోంది. 

ఈలోపు అనుకోకుండా ఇదే కీర్తి అనే విషయం మీద ప్రముఖ రచయిత శ్రీయుతులు గొల్లపూడి మారుతీరావు గారు అంతర్జాల పత్రిక కౌముది లో అక్టోబర్ 11 వతేదీన ఓ ఆడియో సహిత వ్యాసం ప్రచురించారు. అద్భుతమైన ఉదాహరణలతో వున్న ఆ మహానుభావుడి వ్యాసం ఇక్కడ చదవండి. గొల్లపూడి గారికి, కౌముది వారికి కృతజ్ణతలతో......   

Vol. No. 02 Pub. No. 040