Showing posts with label సామాన్యుడి సణుగుడు. Show all posts
Showing posts with label సామాన్యుడి సణుగుడు. Show all posts

Friday, October 29, 2010

క్రీడోత్సవాలకు మరో కొత్త ఆట

 మొన్ననే కామన్ వెల్త్ క్రీడలు ముగిసాయి. మళ్ళీ ఆసియా క్రీడలు, ఒలింపిక్ క్రీడలు ఇంకా ఏవేవో వస్తాయి. వీటన్నిటికంటే ఇంగ్లీష్ వాళ్ళు మనకంటించిన క్రికెట్ ఎలాగూ వుంది. ఈ క్రీడా పోటీల నిర్వాహకులకి ఈసారి ఓ విజ్ఞప్తి చెయ్యాలని వుంది. వాళ్ళ క్రీడల జాబితాలో మరో కొత్త క్రీడను కలుపుకోమని చెప్పాలి. అందరం సామూహికంగా విజ్ఞప్తులు చెయ్యాలి. అవసరమైతే ఆందోళనలు చెయ్యాలి. ధర్నాలు, నిరాహారదీక్షలు, ర్యాలీలు.... ఇలా ఒకటేమిటి అనుకున్నది సాధించడానికి ఏమైనా చెయ్యాలి. ఎలాగైనా సాధించాలి.

ఇంతకీ అదేం క్రీడ అంటారా ? అక్కడికే వస్తున్నా ! కొంచెం ప్రాణాంతకమైనా మంచి ఉత్సుకత, సస్పెన్సు వగైరా పుష్కలంగా వుంటాయి. అసలు అవేమీ లేకపోతే ఆటలో థ్రిల్ ఉంటుందా ? కిక్ ఉంటుందా ? ఆమాటకొస్తే ఫుట్ బాల్, హాకీ.....చివరకి క్రికెట్ లో కూడా మనకు ఉత్కంఠగా వుంటుంది. ఆటగాళ్లకు ప్రాణసంకటంగానే వుంటుంది.... పాపం. వాళ్ళలోని క్రీడాస్పూర్తికి మనం పోటీలు పడి స్టేడియం అదిరిపోయేలాగా చప్పట్లు కొడతాం. బూరాలు ఊదుతాం. డప్పులు కొడతాం. డాన్సులు చేస్తాం. ఇవన్నీ టీవీల ముందు వుండి కూడా  చేస్తాం. మన చేష్టలతో వాళ్ళు ఉత్సాహంతో రెచ్చిపోయి ఇంకా బాగా ఆడతారని సంబరపడిపోతాం. ఇంతలో వాళ్ళు అవుట్ అయిపోయి పెవిలియన్ దారి పడుతుంటే మన ఒక్కసారిగా ఉత్సాహం చల్లబడిపోతుంది. ఇంతకీ వాళ్ళు మన ఉత్సాహానికి రెచ్చిపోయి ఆడాల్సింది పోయి వెన్ను చూపుతారెందుకు అని ఒకసారి సావధానంగా ఆలోచిస్తే అర్థమవుతుంది. మనకంత సావదానం, సావకాశం ఎక్కడుంటాయండీ ? అందుకే అంత దూరం ఆలోచించం. మనమిచ్చే డబ్బులకు ఆశపడి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటారా చెప్పండి. మన గోలకు అవతల జట్టు వాళ్లకు ఎంత ఒళ్ళు మండుతుందీ అన్నది మనకంటే వాళ్ళకే ఎక్కువ తెలుసు కనుకనే అబౌట్ టర్న్.

అసలు ఇంగ్లీషువాడు మనం తోటల్లోనూ, పొలంగట్ల మీద, రోడ్లమీద ఆడుకునే కర్రా బిళ్ళా ఆట చూసే క్రికెట్ కనిపెట్టాడని నాకో అనుమానం. మీక్కూడా అదే అనుమానం ఉందా ? ఉంటుంది మరి. ఆ ఆట అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది కదా ! అలాగే మనం తోటల్లోను... అదే పార్కుల్లో, పొలంగట్ల మీద... అదేనండీ పేవ్ మెంట్ల మీదా ( అవేక్కడున్నాయని నన్నడక్కండి ), ఇంకా రోడ్ల మీదా ఆడుకునే ఈ ఆట కూడా అంతర్జాతీయ స్థాయికి వెళ్లాలని నా ఆశ. ప్రభుత్వం ప్రోత్సాహమిస్తే పిల్లలు, పెద్దలు, మగవారు, ఆడవారు, మాన్యులు, సామాన్యులు..... ఇలా ఒకరేమిటి అందరూ తమ ప్రతిభ నిరూపించుకునే అవకాశం వస్తుంది. మిగిలిన ఆటల్లో క్రీడాకారులు కఠోర సాధనతో జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటుంటుంటే ఈ ఆటలో ప్రజలందరూ క్రీడాకారులే ! అందరూ అంతర్జాతీయ స్థాయికి అవిరళంగా కృషి చేస్తున్నవారే ! మరి వాళ్ళనెందుకు ప్రోత్సహించకూడదూ ? ఇది నా మదిన దొలుస్తున్న ప్రశ్న.

ప్రతీ ఆటలోనూ రెండు జట్లుంటాయి. ప్రత్యేకమైన ప్రత్యర్థులుంటారు. వారి మధ్యనే పోటీ వుంటుంది. ఎదుటి జట్టుని మాత్రమే ఎదుర్కోవాలి తప్ప కనీసం రిఫేరీ మీదకైనా వెళ్ళకూడదు. అంటే వాటిలో స్వేచ్చ చాలా తక్కువ. మన ఆటలో స్వేచ్చ చాలా ఎక్కువ. దీనికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. జట్లు ఉండవు. ఎవరైనా ఎవరికైనా ప్రత్యర్థే ! ఎవరు ఎవరినైనా ఎంచుకోవచ్చు. అసలు ఎంచుకోకపోవచ్చు కూడా ! ఈ ఆటకు స్టేడియంలు అక్కరలేదు. క్రీడా శిక్షణా శిబిరాలక్కర్లేదు. కోచ్ లు అక్కర్లేదు. అన్నిటికంటే క్రీడాకారులకు పెద్ద పెద్ద పారితోషికాలక్కర్లేదు. చూసారా ఈ దేశానికి ఎంత డబ్బు ఆదానో ! రోడ్ వుంటే చాలు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండేదైతే మరీ మంచిది. బాల్, బాట్ లాటివి ఏవీ అక్కర్లేదు. ఒక చిన్న సాధనం మాత్రం అవసరం. అసలు ఈ ఆటకు అదే కీలకం. ఆటగాడికి శిక్షణ, నైపుణ్యం వగైరా లనవసరం. ఇప్పటికైనా అర్థం అయిందా ? అవలేదా ! వస్తున్నా .....వస్తున్నా ! అక్కడికే వస్తున్నా !

ఈ మధ్య మనం రోడ్ మీద నడుస్తున్నా, ద్వి/ త్రి/చతుశ్చక్ర వాహనం మీద వెళ్తున్నా తప్పనిసరిగా ఉండవలసిన వాటిలో మరో వస్తువు చేరింది. ఆ వస్తువే మనల్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చే ఆటలో నిపుణుల్ని చేస్తోంది. నడుస్తూ, డ్రైవ్ చేస్తూ తమలోకంలో తాము వున్నట్లు, పరిసరాలతో పనిలేనట్లు తమలో తామే మాట్లాడుకుంటూ వెళ్ళే లోకాతీతులు మీకందరికీ దర్శనమిచ్చే వుంటారు. అదిగో వాళ్ళే ఈ క్రీడాకారులు. ఫుట్ బాల్, బాట్ లాంటి వాటిలాగ వాళ్ళ చేతుల్లో ఉండే క్రీడా సాధనమేమిటో ఎవరైనా ఊహించగలరా ?

అదేనండీ సెల్ ఫోన్. దాంతో రోడ్ మీద మన క్రీడాకారులు చేసే విన్యాసాలు చూసి తీరాలి. మిగిలిన ఆటలు చూడాలంటే పెద్ద మొత్తాలు ఖర్చుపెట్టి టికెట్స్ కొనాలి. అక్కడ తోపులాటల్లో ఇరుక్కోవాలి. అవేమీ లేకుండా ఫ్రీగా దొరుకుతున్న వినోదం. ఒకరు సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెడుతుంటారు. మనం ఎదురు వెళ్ళామనుకోండి. మనల్ని చూసి ప్రక్కకు తప్పుకుంటారనుకుంటాం కదా ! ఊహు( ! తప్పుకోరు. మనకడ్డుగానే మనం ఎటు తిరిగితే అటు తిరుగుతారు. మన కాళ్ళల్లో కాళ్ళు పెట్టి మనల్ని పడగొట్టాలని చూస్తారు. మనం ఎన్ని తిట్టినా వాళ్ళ ధోరణిలో వాళ్ళుంటారు తప్ప మనల్ని పట్టించుకోరు. చూసారా వాళ్ళకెంత ఏకాగ్రతో ! మనల్ని పడగొట్టాలనే గానీ మరే ధ్యేయం లేనట్లు ఎంత సీరియస్ గా ఆడుతుంటారో ! ఆ ఆటలో సాధారణంగా మనమే ఓడిపోతామనుకోండి. ఎందుకంటే మనం ఆ ఆటలో నిష్ణాతులం కాదు కదా !

పోలో ఆట గుర్రపు స్వారీ చేస్తూ కూడా ఆడుతారు. అలాగే కొంతమంది సెల్ క్రీడాకారులు బైక్ లు డ్రైవ్ చేస్తూ ఆడే ఈ ఆట బహు ముచ్చటగా వుంటుంది. మనం బైక్ మీద వేడుతున్నామనుకోండి. మన ముందు వెడుతున్న ఓ బైక్ హటాత్తుగా స్లో అవుతుంది. కొద్ది క్షణాల్లోనే ఆ రౌతు ( బైక్ స్వారీ చేస్తున్న వ్యక్తి ) తల ఓ ప్రక్కకి ఒరిగిపోతుంది. వెనుకనున్న మనం పాపం అతని మెడకి ఏమైందోనని ఖంగారు పడతాం. హటాత్తుగా బైక్ వేగం పెరుగుతుంది. మనకి మళ్ళీ ఖంగారు. ఆ బైక్ అటూ ఇటూ ఊగుతుంది. ఓ ప్రక్కకి ఒరుగుతుంది. ఇదంతా ఆటలోని భాగమని తెలియని మనకి ఖంగారు మరింత పెరుగుతుంది. మన బైక్ వేగం పెంచి అతని ప్రక్కకి వెడతాం. ఏవో మాటలు వినబడతాయి. పరిశీలనగా చూస్తే ఒరిగిపోయిన మెడ క్రింద నలిగిపోతూ కనిపిస్తుంది సెల్ ఫోన్. పద్మవ్యూహంలో అభిమన్యుడు ఎలా జోరబడ్డాడో మనకి ప్రత్యక్షంగా తెలియదు గానీ ట్రాఫిక్ పద్మ వ్యూహంలో అతను సాక్షాత్తూ అభిమన్యుడి లాగే కనబడతాడు. ప్రతి సంవత్సరం భారత ప్రభుత్వం క్రీడాకారులకి అర్జున అవార్డులిచ్చినట్లు గానే ఈ సెల్ క్రీడాకారులకి అభిమన్య అవార్డులిచ్చి ప్రోత్సహించాలి. వీరు అలా సెల్ మాట్లాడుతూ రోడ్ మీద ఆట ఆడే తీరు బహు రమ్యం గా వుంటుంది. సడెన్ గా స్పీడ్ పెరుగుతుంది. మళ్ళీ స్లో అవుతుంటుంది. తన మానాన తాను పోతున్న వాహనం మీదకో, నడిచి వెడుతున్న మనిషి మీదకో వేడుతుంటుంది. ఖంగారు పడి తప్పుకోవడం వాళ్ళ వంతు. లేకపోతే ఔటే ! ఇదంతా చూస్తున్న రోడ్ మీద ప్రేక్షకులకి ఎంత ఉత్కంఠ ! అంతర్జాతీయ ఫుట్ బాల్ పోటీల్లో కూడా అంతటి ఉత్కంఠ వుండదేమో !

ఇక ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మాత్రం వీళ్ళు తమ ఆటకు బ్రేక్ తీసుకుంటారు. అక్కడ వాళ్ళ శత్రువులు ( పోలీసులు )  వుంటారు కదా ! ఆది కూడా ఒక కారణం. అసలు ఈ దేశంలో క్రీడా స్పూర్తి లేదు. క్రీడాకారులకు స్వేచ్చ లేదు. లేకపోతే హాయిగా రోడ్ మీద ఆటను ప్రాక్టీసు చేస్తున్న వాళ్ళ మీద కేసులా ? వాళ్ళు రేపొద్దున్న అంతర్జాతీయంగా రికార్డులు సృష్టిస్తే మాత్రం సన్మానాలు చేస్తారు. ఏమిటో ఈ న్యాయం ? చట్టాలు మార్చమని కూడా ఆందోళన చెయ్యాలి.

అసలు ప్రత్యర్థులను ఓడించడంలో వీళ్ళను మించిన వాళ్ళు ఇంకెవరూ వుండరేమో ! అప్పటివరకూ రోడ్ కి ఓ ప్రక్కగా వెడ్తున్న వీళ్ళకు ఫోన్ రావడం పాపం ... రోడ్ మధ్యలోకి వచ్చి వెనుక వచ్చే ప్రత్యర్థుల్ని చిత్తు చెయ్యడానికి వీళ్ళు చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కావు. వాళ్ళు వెళ్ళరు. వీళ్ళని వెళ్ళనివ్వరు. హార్న్ కొట్టినా వినిపించుకోరు. అడ్డు తప్పుకోరు. చివరికి వాళ్ళ బైక్ కి మన బైక్ తగిలి ఆక్సిడెంట్ అవుతుందేమోననే భయంతో మనం సడెన్ బ్రేక్ వేసి.. దాంతో బైక్ స్కిడ్ అయి క్రింద పడి దెబ్బలు తిని ఈ ఆటలో ఓడిపోయి అయోమయంగా చూస్తుంటే విజయగర్వంతో ఆగకుండా ముందుకు సాగిపోయే ఈ నిర్వికార క్రీడాకారులకు ఏ అవార్డు ఇచ్చి సత్కరించాలో అర్థం కాదు. ఈ విషయం నిర్ధారించడానికి ఓ కమిటీ వెయ్యాలి. వాళ్ళతో పోటీ పడలేని వాళ్ళు అంటే సెల్ ఫోన్ లేని వాళ్ళని, వున్నా డ్రైవ్ చేస్తూ, రోడ్ మీద నడుస్తూ సెల్ ఫోన్ లు మాట్లాడడం చేతకాని వాళ్ళని, ఆ క్రీడాకారుల్ని ఓడించే సామర్థ్యం లేనివాళ్ళని ఆ భగవంతుడే కాపాడాలి. యుద్ధంలోను, క్రీడల్లోనూ గెలుపోటములు దైవాధీనాలు. కానీ ఈ ఆటలో మాత్రం గెలుపు ఖచ్చితంగా సెల్ ఫోన్ డ్రైవర్లదే !

నీతి : దుష్టులను దూరంగా ఉంచవలెను. డ్రైవింగ్ లో సెల్ ఫోన్ మాట్లాడే వాళ్లకు మనమే వీలైనంత దూరంగా ఉండవలెను. ఇది నా స్వానుభవం.

 Vol. No. 02 Pub. No. 045

Tuesday, October 19, 2010

కీర్తి కండూతి



అనంతమైన కీర్తి సంపాదించాలని, తమ పేరు దశదిశలా మార్మోగిపోవాలని, ఆ కీర్తి ఆ చంద్ర తారార్కం నిలిచివుండాలని ఎవరికుండదు చెప్పండి ? అందుకే అందరూ ఆ కీర్తి కోసం తహతహలాడిపోతారు.

కొందరు ఈ విషయాన్ని నేరుగా వప్పుకోరు. ' అబ్బే ! నాకలాంటి కొరికలేమీ లేవండీ ! ఏదో నా జీవనం సాఫీగా గడిస్తే చాలు. మా పిల్లలు చక్కగా స్థిర పడితే అంతకంటే కావాల్సిందేముంటుంది. శేష జీవితాన్ని కృష్ణా, రామా అంటూ గడిపేస్తాను ' అంటూంటారు. వాళ్ళనే మీ గొప్పతనానికి మెచ్చి మీకు సన్మానం చెయ్యాలనుకుంటున్నాం అని చెప్పండి. ' అబ్బే ! సన్మానం చేయించుకునేంత గొప్పతనం నాలో ఏముంది చెప్పండి. ఏదో నా విధి నేను నిర్వర్తించాను. అంతే కదా ! ' అంటూనే పక్కవాళ్ళతో, ఇంట్లో వాళ్ళతో నాకు సన్మానం చేస్తారట. వద్దన్నా వినడం లేదు అని చెబుతారు. ' పోనీలే ఆయన మొహమాట పడుతున్నాడు. ఈసారికి మరొకరిని వెదుక్కుందాంలే అని మనం అనుకునేలోగా పరోక్షంగా అంగీకారం తెలియజేసేస్తారు. సన్మానమంటే ఎవరికి చేదు చెప్పండి.

ఇంకా కొంతమంది వుంటారు. వాళ్ళకి ఇలాంటి సన్మానాలు, ప్రచారాలు చేయించుకోవాలని కోరిక బలంగా వుంటుంది. కానీ ఎవరిని, ఎలా అడగాలో తెలీదు. తెలిసినా అడిగితే వాళ్ళు ఏమనుకుంటారోనని సంకోచం. ఎవరి వల్లనైనా తమకు ప్రచారం వస్తుందని అనిపిస్తే వాళ్ళ చుట్టూ తిరుగుతూ వుంటారు, ఎప్పటికైనా గుర్తించి తమకు సన్మానమో, మరోటో చేసి ప్రచారం కల్పిస్తారనే ఆశతో

మరికొంతమంది వుంటారు. తమకు ప్రచారం కావాలనుకోండి. మీడియా వాళ్ళను పిలిచి ఏదో ఒక విషయం మీద మాట్లాడేస్తుంటారు. ఈ మధ్య మీడియాలో వచ్చిన పోటీ ధోరణి వీళ్ళకు మరింత ఆలంబన. ఒకవేళ వాళ్ళు రారేమోననిపిస్తే ఏ స్టార్ హోటల్ లోనో విందు కార్యక్రమం, ఇతర ఆకర్షణలు ఏర్పాటు చేసి రప్పిస్తారు. మరి తిన్న విశ్వాసం చూపించాలి కదా అందుకే మర్నాడు మీడియాలో ఈయన మాటలు వచ్చేస్తాయి. అవి మామూలుగా వుంటే జనం ఒకసారి చూస్తారు. వివాదాస్పదంగా వుంటే ఇంక చెప్పనక్కర్లేదు. మరో కొన్ని రోజులు మీడియాకు విందు. ఈయనకు పసందు. దీనివలన కలిసొచ్చేది ఏమిటయ్యా అంటే పైకి కారణాలేమి చెప్పినా ఈయనకు అదో తృప్తి

వీళ్లలోనే మరో రకం. మీడియాను పోగెయ్యలేకపోయినా చుట్టూ పదిమందిని పోగేసి అక్కడ లేని వాళ్ళ గురించో, ప్రపంచ రాజకీయాల గురించో, చరిత్రలో లేని చారిత్రాత్మక విషయాల గురించో..... ఏదో విషయం గురించి మాట్లాడేస్తూ వుంటారు . ఆ విన్న వాళ్ళంతా ' అబ్బో మీకెన్ని విషయాలు తెలుసండీ ! ' అంటూ ఆశ్చర్యపోతుంటే... అబ్బో ..... ఆ సంతృప్తే వేరు

కీర్తి కండూతికి ఎన్నో అవతారాలు. అందులో మరో అవతారం అంటే మరో రకం వున్నారు. వీళ్ళు తమను తాము గొప్పవాళ్ళుగా వూహించేసుకుని చుట్టూ వున్నవాళ్లు ఆథములని వాళ్ళను వుద్ధరించడానికే తాము అవతరించామని చెప్పుకుంటూ సంతృప్తి చెందుతూ వుంటారు. వంగి వంగి దణ్ణాలు పెట్టే వాళ్ళకు వందలు వందలు సమర్పించుకుంటారు.  వళ్లు వంచి పనిచేసే వాళ్ళను తమకు దణ్ణం పెట్టలేదనే కారణంతోనో, మరో కారణంతోనో దూరం చేసుకుంటారు. తమకు బాజా వాయించేవాళ్ళకు పంచభక్ష్య పరమాన్నాలు..... కష్టసుఖాలన్నిటిలో తోడునీడగా నిలిచే కుటుంబసభ్యులకు పచ్చడి మెతుకులు. బయిట అందరూ నా గొప్పతనానికి అడుగడుగునా మెచ్చుకుంటున్నారు, ఇంట్లో మాత్రం వీసమెత్తు విలువలేదు.....ఇదీ వారి ఫిర్యాదు. బయిట వాళ్లయితే తమ స్వార్థం కోసం తప్పనిసరై మెచ్చుకుంటారని,  ఇంట్లో వాళ్ళకు అడుగడుగునా మెచ్చుకునే అవసరం లేదని, వాళ్ళకు వీరి పట్ల బాధ్యత వుంటుందే కానీ స్వార్థం కాదనీ  అర్థం కాదు. అర్థం అయినా అది ఒప్పుకునేందుకు అహం అడ్డొస్తుంది. ఎందుకంటే పొగడ్తలనే భ్రమలో బతికేస్తుంటారు కదా !

 ఈ కీర్తి కండూతి మహా చెడ్డది. దీనిలో పీకలదాకా మునిగిపోయిన వాళ్ళు స్వజనాన్ని దూరం చేసుకుంటారు. ఉన్నదంతా ఊడ్చుకుపోయాక పరజనం దూరం అయిపోతారు. నిజానికి అందరిలోనూ ఈ కీర్తి కండూతి అంతో ఇంతో అంతర్లీనంగా వుంటుంది. కాకపోతే కొంతమంది బయిట పడతారు. కొంతమంది గుంభనంగా వుంటారు. ఎవరైనా తమ స్వార్థంకోసమో, నిస్వార్థంగానో  మనల్ని పొగడ్తలతో ముంచెత్తినపుడు వివేకం వుపయోగిస్తే సమస్య వుండదు. 

ఏమైనా ఈ కీర్తి కండూతిని తగిన మోతాదులో వాడాలి.  శృతి మించితే వికటించి కళ్ళు మూసుకుపోతాయి.... చెవులు వినిపించవు.... బుద్ధి పనిచేయదు.... విచక్షణ నశిస్తుంది. ఆలోపతీ మందుల కంటే సైడ్ ఎఫ్ఫెక్ట్స్ చాలా వుంటాయి. అన్నీ ఉడిగాక... సర్వం హరించుకు పోయాక జ్ణానోదయం అయినా ప్రయోజనం లేదు. బెల్లంకోసం వచ్చిన ఈగలు అది ఖాళీ అవగానే ఎగిరిపోతాయి. తమని సదా అంటిపెట్టుకుని మంచిచెడ్డల్లో అండగా నిలిచే తన మనుష్యులు దూరం అవుతారు. చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. మనుష్యుల నైజమే అంత అనుకోండి. తమకందుబాటులో వున్నదాన్ని నిర్లక్ష్యం చేస్తారు. అంతరిక్షంలో వున్నవాటికోసం అర్రులు చాస్తారు. 

మనలోని గొప్పతనం వల్లో, మన ప్రవర్తన వల్లో, మన మంచితనం వల్లో కీర్తి దానంతట అది రావడం ఎంత మంచిదో..... కీర్తిని బలవంతంగా తెచ్చుకోవాలనుకోవడం, కొనుక్కోవాలనుకోవడం అంత చెడ్డది. 

కీర్తి హానికరం కాదు. కీర్తి కండూతి మాత్రం అత్యంత ప్రమాదకరమైనది. కీర్తికోసం కాక ఒక ప్రయోజనం కోసం కృషి చేస్తే...  వస్తే దానంతట ఆదే వస్తుంది. లేకపోతే ఆత్మ సంతృప్తైనా మిగులుతుంది. కేవలం కీర్తికోసం మాత్రమే కృషి చేస్తే చివరకు అది అపకీర్తినే మిగులుస్తుంది. 

మనవి : ఈ వ్యాసంతో బాటు మానవ జీవితాల్లో కనిపించే ఇలాంటి విషయాల గురించి నా అనుభవంలో నాకు కలిగిన భావాలకి అక్షర రూపం తేవాలనే వుద్దేశ్యంతో రాయడం ప్రారంభించాను. మనసులో మెదిలినపుడు కొన్ని విషయాలని రాసి పెట్టుకున్నాను.  అయితే వాటికి మెరుగులు దిద్ది పూర్తి చేసి ప్రచురించడం ప్రారంభిద్దామనుకునే లోగా మా ఇంటర్నెట్ కనెక్షన్ లో గత నెల 24 వ తేదీ నుంచి సమస్య వచ్చింది. బి‌.ఎస్‌.ఎన్‌.ఎల్. వారితో ఒక రకంగా యుద్ధం చేశాక, జి‌ఎం వరకూ వెళ్ళాక విజయదశమికి ముందురోజు అంటే సుమారు 20 రోజుల తర్వాత  పూర్తి పరిష్కారం దొరికి మామూలుగా పనిచేస్తోంది. 

ఈలోపు అనుకోకుండా ఇదే కీర్తి అనే విషయం మీద ప్రముఖ రచయిత శ్రీయుతులు గొల్లపూడి మారుతీరావు గారు అంతర్జాల పత్రిక కౌముది లో అక్టోబర్ 11 వతేదీన ఓ ఆడియో సహిత వ్యాసం ప్రచురించారు. అద్భుతమైన ఉదాహరణలతో వున్న ఆ మహానుభావుడి వ్యాసం ఇక్కడ చదవండి. గొల్లపూడి గారికి, కౌముది వారికి కృతజ్ణతలతో......   

Vol. No. 02 Pub. No. 040

Saturday, June 12, 2010

'ఆటా'డిస్తా !

ఈ రోజు రియాల్టీ షోల మీద మానవ హక్కుల కమిషన్ తీర్పు వచ్చింది. సహజంగానే విస్తృతంగా, వాడిగా, వేడిగా చర్చలు జరుగుతున్నాయి. ప్రజా సంఘాల వారు హర్షం వ్యక్తం చేస్తుంటే, ఆ షోలలో పాల్గొనే పిల్లల తల్లితండ్రులు, పిల్లలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాదు చేయిస్తున్నారు. దీనికి కూడా తెరవెనుక దర్శకత్వం స్పష్టంగా కనిపిస్తోంది. దీనికంతటికీ వీళ్ళందర్నీ 'ఆటా' డిస్తున్నది ' డబ్బే ' ! ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం.

ఈ రోజు ఒక ఛానల్లో జరుగుతున్న చర్చల్లో  పెద్దలతో వాదిస్తున్న ఒక బాలుడి వాదన వెనుక స్క్రిప్ట్, దర్శకత్వం ఎవరివో తెలుసుకోలేనంత అజ్ఞానంలో ప్రేక్షకులు లేరనుకుంటాను. కాకపోతే అందరిలోనూ సహజంగానే ఉండే ఉదాసీనత వలన కావలసినంత నిరసన రావడంలేదు. సరైన నిరసన వస్తే ఇలాంటి ' ఆట ' లు సాగవేమో ! ఇప్పుడు ఈ తీర్పు వచ్చాకా మనందరం కాసేపు ఆవేశపడిపోతున్నాం ! తర్వాత మన పనుల్లో మనం మునిగిపోతాం ! వాళ్లకి చట్టంలోనూ, న్యాయ వ్యవస్థలలోను, రాజ్యాంగంలోను వున్న లొసుగులు తెలుసు. లేదా తెలుసుకుంటారు. లొసుగులు లేకపోతే ఉన్నవాటికి వారికి అనుకూలమైన అర్థాలు అన్వయిస్తారు. పై కోర్ట్ లకి వెడతారు. లేదా డబ్బుతో బాధితుల్ని తమకి అనుకూలంగా తిప్పుకుంటారు.

దీనికి నిదర్శనం ఈ రోజు ఛానల్లో వాదించిన కుర్రవాడు నిర్వాహకుల్ని సమర్థించిన తీరు , మరో ఛానల్లో ఒక తల్లి వాదనలు వింటే అర్థమవుతోంది. డబ్బు కోసం మేం పిల్లల్ని హింసించడం లేదని వాదిస్తున్న ఆ తల్లికి, మిగిలిన తల్లిదండ్రులకి నాకు తెలిసిన విషయం ఒకటి చెబుతాను. రెండు సంవత్సరాల క్రితం ఆ కుర్రవాడి  పరిస్థితి విజయవాడలో చాలామందికి తెలుసు. అప్పట్లో ఆ కుర్రవాడిని వెంటబెట్టుకుని అతని తల్లి నగరంలోని పెద్దల దగ్గరికి, సంస్థల కార్యాలయాలకి ప్రతినెలా మొదటి వారంలో ఎక్కే గుమ్మంగా, దిగే గుమ్మంగా తిరగడం నాకు బాగా తెలుసు. ఆ కుర్రవాడిలో టాలెంట్ నచ్చి , అతని భవిష్యత్తుకు ఆర్ధిక ఇబ్బందులు ఆటకం కాకూడదని కొందరు ప్రతినెలా ఇచ్చే డబ్బుకోసమే అలా తిరిగేవారు. ఇలా ఇంకా ఎంతోమంది ఈ స్థాయి పిల్లల తల్లిదండ్రులు ఈ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. సొంత పిల్లలనే బలిచేస్తున్నారు.

ఈ షోల పుణ్యమాని పిల్లలు అంగడి సరుకులై పోయారు. తల్లిదండ్రులు వారిని అమ్ముకుంటున్నారు. నిర్వాహకులు కొనుక్కుని తమకు కోట్లు సంపాదించి పెట్టే సరుకుగా తయారుచేసి  ప్రేక్షకుల మీద వదులుతున్నారు. డబ్బు కోసం పిల్లల్ని ఇలా తయారు చెయ్యడం కొంతమంది చేస్తుంటే, మరో రకం తమ పిల్లలు తెర మీద కనబడాలని, ఉన్నతమైన స్థానంలో చూడాలనే పిచ్చితో ఎదురు పెట్టుబడి పెట్టే వాళ్ళు కూడా లేకపోలేదు. ఏ రకమైన తల్లిదండ్రులైనా నలిగిపోతున్నది మాత్రం పిల్లలే !


ఒక ప్రక్క  తీర్పు వచ్చింది. మరోప్రక్క వేడిగా చర్చ జరుగుతోంది. ఆ సమయంలోనే మరో ఛానల్ అలాంటి కార్యక్రమమే  ప్రసారం చేస్తోంది. త్వరలోనే నిషేధించిన కార్యక్రమం పాత వేషం తీసేసి  కొత్త రూపంతో, కొత్త పేరుతో వస్తుంది. నిరసన తెలియజేసే మానవతావాదుల్ని పరిహసిస్తూ తల్లిదండ్రులందరూ నిర్వాహకుల పక్షమే జేరుతున్నారు. డబ్బెవరికి చేదు ?

ఈ ఫీట్లన్నీ ఎందుకంటే బ్రహ్మ పదార్ధం లాంటి టి. ఆర్. పి. రేటింగుల కోసమే ! అవేమో కొంతమంది జేబులో ఇరుక్కు పోయాయి మరి. తమ జేబులోకి రావాలంటే ఇలాంటి జిమ్మిక్కులు తప్పదు. దానికోసం, ఆది తెచ్చే డబ్బు కోసం  పిల్లల్ని, తల్లిదండ్రుల్నీ, ప్రేక్షకుల్నీ, నిరసనకారుల్నీ ఇలాంటి  కార్యక్రమాల నిర్వాహకులు 'ఆటా' డిస్తూనే వుంటారు. 



Vol. No. 01 Pub. No.319

Monday, May 10, 2010

జీవితచక్రం

నాడు దర్జాగా తిరిగిన దర్జీ చక్రం
నేడు రోడ్ల పాలైన పరిణామ క్రమం

ఒకప్పుడు బట్టలు టైలర్ మేడ్
మరిప్పుడు అవే రెడీమేడ్


కంపెనీల మెరుస్తున్న బట్టలు
కొట్టాయి కాలుతున్న పొట్టలు

ఒకప్పుడు మన దగ్గరకే జనం
మరిప్పుడు జనం దగ్గరకే మనం



పని దొరికితేనే కడుపులు నిండేది 
చక్రం తిరిగితేనే జీవిత చక్రం తిరిగేది

అప్పుడే మా జీవితాల్లో వెలుగులు నిండేది
లేకపోతే చీకటే మాకు మిగిలి వుండేది  







Vol. No. 01 Pub. No. 289

Thursday, April 8, 2010

కిడ్నాప్

డబ్బుకోసం ధనవంతుల పిల్లల కిడ్నాప్ 
కక్ష తీర్చుకోవడానికి కావాల్సిన వాళ్ళ కిడ్నాప్
ఎన్నికల్లో గెలవడానికి ప్రత్యర్థి కిడ్నాప్
రాక్షస వివాహానికి నచ్చిన అమ్మాయి కిడ్నాప్
అప్పు రాబట్టుకోవడానికి బాకీదారుల కిడ్నాప్
............... ఇలా కిడ్నాప్ లలో ఎన్నో రకాలు

కానీ ఇదో కొత్త రకం కిడ్నాప్
విద్యా వ్యాపారుల దుర్మార్గాలకి పరాకాష్ట
ఫీజు కట్టలేదని అభం, శుభం తెలియని విద్యార్థిని స్కూల్ యాజమాన్యం నిర్బంధం.
ఫీజు కట్టనిదే ఇంటికి పంపబోమని తండ్రికి తెలియజేసిన ప్రైవేటు యాజమాన్యం.
మాకు డబ్బే ముఖ్యం..... మానవతా విలువలు ముఖ్యం కాదు
అని డంకా మీద దెబ్బ కొట్టి చెప్పిన విద్యా వ్యాపారులు
విద్య మన దేశంలో అందని ఫలమైపోయింది... అంగడి సరుకై పోయింది.
వెర్రి తలలు వేస్తున్న విద్యా వ్యాపారానికిది నిదర్శనం

గురువారం నాటి ఆంధ్రజ్యోతి లోని ఈ వార్త చూడండి.

Vol. No. 01 Pub. No. 247

Thursday, March 4, 2010

ఓం సచ్చిదానంద....

ఇప్పుడెక్కడ చూసినా సచ్చిదానందమే !
అంతా మాయ ! జగమంతా మిథ్య !!
మా కేళీ లీలా విలాసాలోకటే సత్యం !
భక్తులకు ముక్తి వేదాంతం
మాకు రక్తి సిద్దాంతం
మా బోధనలే మీకు శిరోధార్యాలు
మీ ' సేవ 'లే మాకు అలౌకికానందాలు
ఎందరో స్వాములు, గురువులు, బాబాలు
అందరికీ వందనాలు
అందుకే మహాకవి దృష్టిలో మిథ్యావాది .............

మాయంటావా ? అంతా
మిథ్యంటావా ?
నా ముద్దుల వేదాంతీ !
ఏమంటావూ ?
కనబడినది కనబడదని
వినబడినది వినబడదని
జగతి మరుపు, స్వప్నం, ని
శ్శబ్దం ఇది
మాయ ! మాయ !
మాయంటావూ ! అంతా
మిథ్యంటావూ !!

ఓం సచ్చిదానంద..............



Vol. No. 01 Pub. No. 214

Monday, February 8, 2010

మేరా భారత్ మహాన్

మనం దేశ పౌరులుగా అనేక రకాల పన్నులు కడుతున్నాం. కానీ అందులో ఎంతభాగం ప్రజా సంక్షేమం కోసం వినియోగమవుతోంది, ఎంతభాగం నాయకుల సంక్షేమం కోసం వినియోగమవుతోంది అనేది పట్టించుకోం ! ఒకసారి కొన్ని నిజాలు తెలుసుకుందాం !

మన
దేశంలో ఒక పార్లమెంట్ సభ్యుని ( M.P. ) గౌరవ వేతనాలు, భత్యాలు ఇలా ఉన్నాయి.
  • నెల జీతం : రు. 12, 000/-
  • నియోజక వర్గ ఖర్చు (నెలకు ) : రు. 10, 000/-
  • కార్యాలయ ఖర్చులు (నెలకు ) : రు. 14, 000/-
  • ప్రయాణ భత్యం : కిలోమీటరుకు రు. 8/- (ఉదాహరణకు రాజధాని ఢిల్లీ నుండి దక్షిణ కొసనున్న కేరళకు మారుగా 6, 000 కిలోమీటర్లు ) చొప్పున రు. 48, 000/-
  • పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నపుడు రోజు వారీ భత్యం : రు. 500/-
  • రైలు ప్రయాణ ఖర్చులు : దేశంలో ఎక్కడినుండి ఎక్కడికైనా, ఎన్నిసార్లు అయినా రైలులో మొదటి తరగతి . సి. ఉచితం.
  • విమాన ప్రయాణం : వాణిజ్య తరగతిలో భార్య లేదా భర్త / వ్యక్తిగత సహాయకుడు తో సంవత్సరానికి 40 సార్లు ఉచితం.
  • వసతి : ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుల హాస్టల్ లో ఉచితం.
  • విద్యుత్ ఖర్చులు : నివాసానికి 50, 000 యూనిట్ల వరకూ ఉచితం
  • ఫోన్ ఖర్చులు : 1, 70, 000 కాల్స్ వరకూ ఉచితం
  • మొత్తం ఖర్చులు : ఒక్కొక్క సభ్యునికి సంవత్సరానికి సుమారుగా రు. 32, 00, 000/- అంటే నెలకు సుమారు రు. 2, 66, 000/-
  • పదవీకాలానికి ( 5 సంవత్సరాలకు ) మొత్తం ఖర్చు : రు. 1, 60, 00, 000/-
  • పార్లమెంట్ సభ్యుల మీద మొత్తం ఖర్చు : అయిదు సంవత్సరాలకు మొత్తం 534 సభ్యుల మీద దేశం పెడుతున్న ఖర్చు రు. 8, 54, 40, 00, 000/- అంటే సుమారు రు. 855 కోట్లు .

ఇదంతా మనం ప్రభుత్వానికి పన్నుల రూపంలో చెల్లిస్తున్న డబ్బు లోనుండి పెడుతున్న ఖర్చు.
ఇక సామాన్యులకవసరమైన సరుకుల ధరలు పెంచకపోతే ఎలా సమకూడుతుంది ?

Vol. No. 01 Pub. No. 191

Thursday, December 24, 2009

ఉదాసీనతా నీ విశ్వరూపం !!!

అధికారం, ధనం, పలుకుబడి ముందు
సభ్యత, సంస్కారం తలవంచుకుంటున్నాయా ?
రాజకీయాలకు విలువలు లేవా ?
విశృంఖలత్వమే వాటి చిరునామాగా మారిపోతోందా ?
స్వార్థ రాజకీయాలు ..........
రాజకీయ స్వార్థాలు .........
ఉద్యమాలను బలితీసుకుంటున్నాయి
విద్యార్థుల భవిష్యత్తును బలి తీసుకుంటున్నాయి
సామాన్య ప్రజల జీవితాలను బలి తీసుకుంటున్నాయి
ప్రజలిచ్చిన అధికారంతో అందాలాలెక్కుతున్నాయి
మదమెక్కిన జంబుకాలు ప్రజా భవనాలనే
రాసలీలా మందిరాలుగా మార్చేస్తున్నాయి
వారికా భవనాలేవరిచ్చారు ? అధికారమెవరిచ్చారు ?
హోదా ఎవరిచ్చారు ? ధనమెవరిచ్చారు ?
వారికి ఇలా కళ్ళు నెత్తికెక్కడానికి కారణమేమిటి ?
ఇంకేమిటి ? ప్రజల ఉదాసీనతే !
అదే ఈనాటి రాజకీయాలకు పెట్టుబడి
ఎప్పటికైనా ప్రజల్లో ఈ ఉదాసీనత తొలిగిపోతుందా ?

Vol. No. 01 Pub. No. 143

Monday, December 14, 2009

అమరజీవి ఆత్మఘోష


అఖిలాంధ్ర ప్రజలకు అభివాదాలు !

అన్నట్లు
అఖిలాంధ్ర, సమైక్యాంధ్ర అనొచ్చా ? ఏమో ! ఏమంటే ఏ తంటానో కదా ! అయినా నేను ఆత్మనే కదా ! ఏమన్నా ఫర్వాలేదు. నన్నేమీ చెయ్యలేరు కదా !
ఎలా ఉన్నారు అని కుశల ప్రశ్నలు అడుగలేను. ఆంధ్ర దేశ పరిస్థితి నాకు ఎప్పటికప్పుడు తెలుస్తోంది.

ఏమని
చెప్పను నా బాధ ? తెలుగు ప్రజలు పరాయి భాష పాలకుల చేతిలో అవమానింపబడుతున్నారని అప్పట్లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. అసఫ్ జాహీలు, నిజాం నవాబుల కాలంలో తెలుగు భాషకు, తెలుగు వారికి జరిగే పరాభవాలు తట్టుకోలేక తెలంగాణా ప్రాంతంలో విముక్తి కోసం ఉద్యమాలు చేశారు. 1937 లో కుదిరిన ' శ్రీబాగ్ ' ఒప్పందం ప్రకారం మరుసటి సంవత్సరమే ఆంధ్ర రాష్ట్రం వస్తుందనుకుంటే రాజధానిగా మద్రాస్ నగరాన్ని కోరుకోవడంతో వాయిదా పడింది. నిజానికి రాజధాని రాష్ట్రానికి మధ్యన ఉంటే ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మరి మద్రాస్ ( అదే ఇప్పుడు చెన్నై అంటున్నారట కదా ! ) తమిళనాడు రాష్ట్రానికి మధ్యలో ఉందా ! లేదే !

సరే
... 1947 లో భాషా రాష్ట్రాల సమస్యను పరిష్కరించడానికి వేసిన థార్ కమీషన్ భాషల పరంగా విభజించడం కుదరదని చెప్పేసింది. నీలం సంజీవరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికవడంతో 1952 లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్ర మహా సభ నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి హాజరుకావద్దని సభ్యులందర్నీ ఆదేశించడం, 21 మంది కాంగ్రెస్, స్వతంత్ర సభ్యుల సంతకాలతో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు వాయిదా వెయ్యాలని విజ్ఞాపన ప్రధాని నెహ్రు గారికి అందజెయ్యడం చేసాడు. ఇది నెహ్రుకు బాగా అనుకూలించింది. మీరు విడదియ్యమంటున్నారు కానీ వాళ్ళేమో విడదియ్యోద్దంటున్నారు. ముందు మీలో మీరు తేల్చుకుని ఏకాభిప్రాయానికి రండి అని చెప్పి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వాయిదా వేసి తమాషా చూస్తూ ఉండిపోయాడు. ఇప్పటికీ పరిస్థితిలో పెద్దగా మార్పులేదనుకుంటాను.
దీంతో అసంతృప్తికి లోనైన స్వామి సీతారాం 36 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి వినోభాభావే జోక్యంతో విరమించాడు. నేను ఊరుకోలేకపోయాను. ఇంకా ఎన్నాళ్ళు తాత్సారం చేసి తమాషా చూస్తారు అని బాధతో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాను. మొదట్లో ఎవ్వరూ సరిగా పట్టించుకోలేదు. అప్పట్లో ఇన్నేసి ఎడిషన్లున్న వార్తాపత్రికలు లేవు, ఎలక్ట్రానిక్ మీడియా లేదు. లైవ్ టెలికాస్ట్లు లేవు. అందుకని నిరాహార దీక్ష మొదలు పెట్టగానే అరెస్టు చెయ్యడానికి, ఆస్పత్రిలో పడేసి సెలైన్లు పెట్టెయ్యడానికి అప్పుడు అవకాశం లేకపోయింది. ఇప్పుడనిపిస్తోంది ఈ రోజుల్లో పుట్టి ఇప్పుడు ఆమరణ నిరాహార దీక్ష చేసి ఉంటే బాగుండేదేమోనని ! ప్చ్ ! ఏం చేస్తాం ? తొందరపడి ప్రచార సాధనాలు అంతగా అభివృద్ది చెందని రోజుల్లో పుట్టేసానే ! ఆంధ్ర దేశమంతా నా పరిస్థితి పూర్తిగా తెలియడానికి 50 రోజులు పట్టింది. అప్పటికి నా పరిస్థితి ఎలా ఉంటుందో ఉహించుకోండి. నేను నీరసించాను. ఉద్యమం బలపడింది. నాకు ఆ నిరాహార దీక్ష నుంచి విముక్తి కలగడానికి మరో ఎనిమిది రోజులు పట్టింది. అంటే ప్రత్యేక రాష్ట్రమిచ్చేసి దీక్ష విరమింప జేసారనుకుంటున్నారా ? అబ్బే ! నాలోని జీవుడు ఎగిరిపోయాడు. తర్వాత నెహ్రు మద్రాస్ లేకుండానే ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించాడు. ఏం చేస్తాం దక్కిందే మహాభాగ్యమని తెలుగువారు సర్దుకున్నారు.

నిజాం
నవాబు పరిపాలనలో హైదరాబాద్ రాష్ట్రం చీకటిలో మ్రగ్గి పోయింది. నిజాం బ్రిటిష్ వాళ్లకు తొత్తులుగా ఉంటే, జాగీర్దార్లు- భూకామందులు నిజాంకు బంటులుగా ఉండి సామాన్య ప్రజల్ని వెట్టి చాకిరితో పీడించుకుని తిన్నారు. ప్లేగు. కలరా మొదలైన వ్యాధులు ప్రబలితే పట్టించుకునే నాథుడే లేడు. ఇటువంటి దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొన్న తెలంగాణావాసులు నుండి విముక్తితో ఊపిరి పీల్చుకున్నారు. తర తరాలుగా తెలుగుకు పట్టిన దురవస్థను జీర్ణించుకోలేక తెలుగు వాళ్లందరమూ కలిసి ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. సహజంగానే మర్రి చెన్నారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి లాంటి వాళ్లు వ్యతిరేకించినా, బూర్గుల రామకృష్ణారావు లాంటి కొంతమంది రాజకీయ ప్రయోజనాలకోసం తర్వాత సమర్థించడంతో దేశంలో మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం గా ఏర్పాటయిందని తెలిసి చాలా ఆనందపడ్డాను. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలువలేదు. రాజకీయ నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం ఇరు ప్రాంతాల మధ్యా ద్వేషాలను రగిలించడం, అవి తీరాక ఉద్యమాలను చల్లార్చడం లాంటి చర్యలతో ప్రజల అమాయకత్వాన్ని, ఆవేశాన్ని ఉపయోగించుకున్నారని తెలిసి చాలా బాధపడ్డాను. బతికుంటే వారి నుంచి ప్రజల్ని విముక్తి చెయ్యడానికి మళ్ళీ సత్యాగ్రహం చేపట్టేవాడినేమో ! ఏం చేస్తాం ! ఆ అవకాశం లేదుగా !
గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలనే మాట వినబడుతోంది. అప్పుడప్పుడూ అసమ్మతి వాదం తెర మీదకు రావడం మామూలే కదా అనుకున్నాను. కానీ క్రిందటి నెలలో నా విగ్రహాల మీద దాడి జరగడంతో ఉద్యమం ప్రారంభమయిందని తెలిసింది. నా సత్యాగ్రహబాటను కూడా అనుసరిస్తున్నారని తెలిసింది. అయితే తర్వాత గానీ తెలియలేదు నిరాహార దీక్ష చెయ్యడం ఈ రోజుల్లో ఇంత సుళువని. దీక్ష విరమిస్తున్నట్లు ప్రకటించగానే ప్రజలు తిరగబడడం చూస్తే ప్రజల్లో మార్పు వచ్చిందని అర్థమయింది. కానీ సమస్య నుంచి తప్పించుకోవడానికి ఆదిస్థానం చేసిన ప్రకటన చూస్తే నాకు నెహ్రు రాజకీయమే గుర్తుకు వచ్చింది. పాలకులు మాత్రం మారలేదు. ప్రస్తుతం ఇరు ప్రాంతాల వారిని బలాబలాలు తేల్చుకోమన్నట్లే అనిపిస్తోంది. దాన్ని నాయకులు బాగానే ఉపయోగించుకుంటున్నట్లున్నారు. ఏమైనా 1969 ఉద్యమ ద్రోహాన్ని తెలంగాణా అమాయక ప్రజలు మరిచిపోయినా, ఆంధ్ర ప్రాంత ప్రజలు బాగా గుర్తు పెట్టుకుని 1972 నాటి ప్రత్యేకాంధ్ర నినాదాన్ని సమైక్యాంధ్ర నినాదంగా మార్చేశారు. నా చెవులకింపుగా ఉంది.

అయితే
కొంతమంది తెలంగాణా నాయకులు చేస్తున్న వాదనలే కొరుకుడు పడడంలేదు. మాటి మాటికీ ఆంధ్రవాళ్లు, ఆంధ్రవాళ్లు అంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో పుట్టిన, నివసిస్తున్న వారందరూ ఆంధ్రా వాళ్ళే కదా ! అసలు తెలంగాణా అన్నా, ఆంధ్రా అన్నా అర్థం దాదాపుగా ఒకటేనని మా రోజుల్లో అనుకునేవాళ్ళమే ! ఈ మథ్య భాషలో అర్థాలేమైనా మారిపోయాయా ? ఎవరైనా నా సందేహం తీరిస్తే బాగుండును. మరో విషయం. రాష్ట్రమన్నాక రాజధాని అవసరం. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో ఉన్నపుడు రాయలసీమ, కోస్తాంధ్ర వాసులు అప్పుడు రాజధానిగా ఉన్న మద్రాస్ నగరాభివృద్ధిలో భాగస్వాములయ్యారు. ఆ నగరం తెలుగు వారికి చెందుతుందని ఎన్ని దృష్టాంతాలు చూపించినా దక్కించుకోలేకపోయారు. విశాలాంధ్ర ఏర్పడ్డాక అందరి ఆమోదంతో కర్నూలు నుంచి రాజధాని హైదరాబాద్ మార్చారు కదా ! ఒక రాజధాని... అది రాష్ట్రానిదైనా, దేశానిదైనా ప్రజలందరి భాగస్వామ్యంతోనే కదా అభివృద్ది చెందేది. అలా కాకుండా కొంతమంది వ్యాపారాలు, పరిశ్రమల్లో పెట్టుబడి పెట్టారు తప్ప హైదరాబాద్ అభివృద్ధిలో ఆంధ్రా వాళ్ల పాత్ర ఏమీ లేదంటారే ! అంటే వాళ్ల దృష్టిలో కోట్లకు పడగలెత్తిన వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, నాయకులు తప్ప సామాన్యులు మనుష్యులు కాదా ! వాళ్లు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కట్టిన పన్నుల్లో కొంత భాగంతోనే కదా రాజధాని అభివృద్ది జరిగేది. అందుకని దాంట్లో రాష్ట్ర ప్రజలందరికీ భాగస్వామ్యం ఉంటుంది కదా ! ఏమో నాకేమీ అర్థం కావడం లేదు. అసలు ఆ వ్యాపార వేత్తలు వగైరాలు కట్టే పన్నుల శాతం కంటే సామాన్య ప్రజలు కట్టే పన్నుల శాతమే ఎక్కువగా ఉంటుందేమో ! ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సమస్య రాజధాని చుట్టూ తిరుగుతున్నట్లనిపిస్తోంది. అసలే హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయి నగరంగా అభివృద్ది చెందుతోంది. అన్నదమ్ముల మధ్య పరిష్కారంగా హైదరాబాద్ అభివృద్ది ఖర్చుని వాటాలేస్తే హైదరాబాద్ నగరం తమ రాజధానిగా ఉంచుకున్నవాళ్లు విడిపోయిన వాళ్లకు చెల్లించాల్సిన వాటా మాట ! ఆ... ఇదో పెద్ద విషయమా.... ఉన్నారుగా.... అమాయక ప్రజలు. వాళ్ల జీవితాలు తాకట్టు పెట్టేస్తారు ! ఇలాంటి సందర్భాల్లో నాయకులకు పండగేగా ! ప్రజలకు దండగ గానీ ! మా కాలంలో కంటే ఈ కాలంలో ప్రజలకు కొంత తెలివి వచ్చినట్లు అనిపిస్తోంది. చూద్దాం. వాళ్లు నాయకుల మెడలు వంచి తామంటే భయపడేటట్లు చేస్తారో , నాయకులే ప్రజల్ని ఎప్పటిలాగే వెర్రి గొర్రెల్ని చేస్తారో ! ఏమైనా ఈ నష్టాన్ని భరించాల్సింది సామాన్య ప్రజలే కానీ నాయకులూ కాదు వారిని వెనకనుండి నడిపిస్తున్న వ్యాపార, పారిశ్రామిక వేత్తలూ కాదు.

అప్పుడే... అమరజీవి పొట్టి శ్రీరాములు అమరరహే ! అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. పాలబిందేలు వస్తున్నాయి. నా విగ్రహాలకు అభిషేకాలు చెయ్యడానికి కాబోలు. ప్చ్ ! ఎప్పుడు, ఎందుకు, ఎవరు మా విగ్రహాలు పగలగోడతారో, ....పూజిస్తారో బ్రహ్మ దేవుడికైనా అర్థమవుతుందా ! ఆయనకెందుకు అర్థమవుతుందిలే ! ఆయన అసలు తనకు గుడులు, విగ్రహాలు లేకుండా జాగ్రత్త పడ్డాడుగా ! ఉన్నా విష్ణు మహేశ్వరుల చాటున దాక్కుంటాడు. ' దేముడికేం ! హాయిగా ఉన్నాడు. ఈ మానవుడే... కాదు కాదు....విగ్రహాలే బాధలు పడుతున్నాయి '. అన్నట్లు మీకు చెప్పలేదు కదా ! ఈ రోజుతో నా ప్రాణ త్యాగానికి 57 సంవత్సరాలు నిండుతున్నాయి. అందుకే మిమ్మల్ని ఒకసారి పలుకరిద్దామని వచ్చా ! సెలవు.

Vol. No. 01 Pub. No.138

Thursday, November 5, 2009

మందు తాగండోయ్ ! బాబులూ !!

కరువొచ్చింది. పంటలు ఎండిపోయాయి.
వరదొచ్చింది. పంటలు కొట్టుకుపోయాయి.
పప్పుల ధరలు పెరిగిపోయాయి.
బియ్యం కనుమరుగై పోతుందిట.
రోగాలు విజృంభిస్తున్నాయి.
ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి.
వీటన్నిటికీ పరిష్కారం ఏమిటి ?
ప్రభుత్వం బుర్ర బ్రద్దలగొట్టుకుని పరిష్కారం ఆలోచించింది.
అదే ' మందు తాగండోయ్ ! బాబులూ !! ' నినాదం.
అంతే ! ప్రభుత్వాదికారులందరు ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు.
ఆ రకంగా ప్రభుత్వోద్యోగులందరికీ పని దొరికింది.
అడుగడుగునా కొత్త కొత్త మందు దుకాణాలు వెలిసాయి.
ఆ రకంగా నిరుద్యోగ సమస్య కొంత వరకు తగ్గింది.
సంపాదనంతా సారాకు పోతుంటే కుటుంబమంతా ఆకలితో చచ్చిపోతోంది.
మందు కొట్టిన వాహనాలు రోడ్డు మీద కాకుండా జనాల మీదుగా వెడుతున్నాయి.
ఆ రకంగా జనాభా సమస్య పరిష్కారం అవుతోంది.
అన్ని బాధలు మర్చిపోయి ప్రజలు హాయిగా మత్తులో మునిగిపోతున్నారు.
ఆ రకంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తగ్గిపోయింది.
అబ్బో ! ఎన్ని సమస్యలు పరిష్కారమయ్యాయి !
ఇంతకన్నా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకునే ప్రభుత్వముందా !!



Monday, October 19, 2009

నిర్విచారం


కరువు విలయ తాండవం చేస్తోందట
నిజమే ! చెయ్యనీ ఏం చేస్తాం !!

వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయట
నిజమే ! సృష్టించనీ ఏం చేస్తాం !!

భారీ తుఫానులు, భూకంపాలూ వస్తున్నాయట
నిజమా ! రానీ ఏం చేస్తాం !!

ధరలు
భారీగా పెరుగుతున్నాయ
నిజమా ! పెరగనీ ఏం చేస్తాం !!

వేతనాల్లోను, జీతాల్లోను కోతలుంటాయట
నిజమా ! ఉండనీ ఏం చేస్తాం !!

మధ్యంతర ఎన్నికలు రావచ్చట
నిజమా ! రానీ ఏం చేస్తాం !!

ఏం చెయ్యగలం ? మన రాత ఎలావుంటే అలాగే జరుగుతుంది
ఒక వైపు విచారం మరోవైపు నిర్విచారం ! వీటి ప్రతి రూపమే సామాన్యుడు !!

Tuesday, October 6, 2009

సర్వ మానవ సమానత్వం

తుఫాను వాతావరణం. ఒక పండితుడు అవతలి వడ్డుకు వెళ్లడానికి నది దగ్గరకు వచ్చాడు. పడవ మాట్లాడుకున్నాడు. ప్రయాణం సాగుతోంది. పండితుడు కాలక్షేపానికి పడవవాడి జ్ఞానాన్ని పరీక్షించాలనుకున్నాడు. " ఒరేయ్ అబ్బీ! నీకు వ్యాకరణ శాస్త్రం తెలుసా ? " అని అడిగాడు. "తెలీదు బాబయ్యా !" అన్నాడు పడవవాడు. " అయితే నీ జీవితంలో పావువంతు వృధా ! నేను చూడు వ్యాకరణ శాస్త్రాన్ని ఔపోసన పట్టేశాను. సరేగానీ వేదాలు తెలుసా ? " అడిగాడు పండితుడు. "వేదాలా ! అంటే ఏటి బాబయ్యా !" ఆశ్చర్యకరంగా అడిగాడు పడవ మనిషి. " వేదాలంటే కూడా తెలీదా ? పోనీ... తర్కం, మీమాంస లాంటి వాటిగురించేనా విన్నావా ? " అన్నాడా పండితుడు. అబ్బే లేదన్నాడు పడవవాడు. పండితుడికి అతడి మీద చాలా జాలి వేసింది. " నిన్ను చూస్తే చాలా భాద వేస్తోందిరా అబ్బీ ! నీ జీవితంలో మూడువంతులు వృధా చేసుకున్నావురా !!" అన్నాడా పండితుడు. ఇంతలొ పెద్ద గాలి. ఒక పెద్ద అల పడవను తాకింది. పండితుడు కంగారు పడ్డాడు. పడవవాడు అడిగాడు " తమరికి ఈత వచ్చా బాబయ్యా ? " అని. " రాదురా ! ఇప్పుడెలా ? " అన్నాడు భయం భయంగా. " అయితే మీ జీవితం మొత్తం వృధా !! " అంటూ నదిలోకి దూకేసాడు పడవవాడు.
ఇది అందరికీ తెలిసిన కథే ! అందులో విశేషం లేదు. కానీ కథలో భిన్న కోణాలున్నాయి. అందులో ఒకటి అహం పనికి రాదన్నదైతే మరొకటి ప్రకృతి దృష్టిలో పండితుడు పామరుడు అనే తేడాలేమీ లేవనేది. అలాగే ప్రకృతికి బీదా గొప్పా తేడాలు కూడా ఉండవు. దానికి ఉదాహరణ తాజా వరదలు. భేదాలేమీ లేకుండా అందర్నీ ముంచెత్తింది. డబ్బు, పలుకుబడి కల వాళ్లు సైతం వాటిని ఉపయోగించి వరదని ఆపలేకపోయారు. ఇవన్నీ శాశ్వతం కాదని హెచ్చరించింది. ప్రకృతిలో అందరూ సమానమే! సృష్టిలో తేడాలు లేవు అని చాటి చెప్పింది. మనిషి తన సృష్టేనని గుర్తుచేసింది. అహంకారం పోరలుకమ్మి తన ఉనికిని తాను మరచిపోతున్న మనిషికి నువ్వు నా ముందు చాలా అల్పుడివిరా అని నెత్తి మీద మొట్టినట్లు అప్పుడప్పుడూ ఇలా తన ప్రతాపం చూపిస్తోంది . ఎంత అభివృద్ది సాధించినా ప్రకృతిని శాసించలేకపోతున్నాం. వరదల్ని, తుఫానుల్ని ఆపలేకపోతున్నాం . ఆపలేం కూడా ! మానవ మనుగడకు ప్రకృతిని ఉపయోగించుకునే శాస్త్ర సాంకేతిక అభివృద్ది అవసరమే కానీ మానవాళికి ముప్పుగా పరిణమించే అభివృద్ది ఆత్మహత్యా సదృశ్యం కాదా ? మనుగడే ప్రశ్నార్థకమైనప్పుడు అభివృద్ది దేనికోసం ? ఎవరికోసం ? ప్రకృతిని జయించగలిగాననుకోవడం ఎంత అవివేకం ! ఉదాహరణకు ప్రకృతిలో సహజంగా పెరిగే వైరస్ ద్వారా వచ్చే జబ్బులేన్నిటికో విరుగుడు కనిపెట్టాననుకున్నాడు మానవుడు. కానీ వాటిని కూడా తట్టుకునే కొత్త వైరస్ లెన్నో పుట్టుకొస్తున్నాయి. ప్రకృతిని జయించడం కల్ల . మనలోని అహాన్ని జయించి ప్రకృతి సహజత్వానికి భంగం కలగకుండా,అత్యాశకు పోకుండా మన మనుగడకు ఎంతవరకూ అవసరమో అంతవరకూ అభివృద్ధిని పరిమితం చేస్తే ప్రకృతి కూడా తన సహజ పద్ధతిలో నడుచుకుంటుంది. బీదా గొప్పా , కుల మత జాతి ప్రాంతీయ, పండిత పామర భేదాలు ప్రకృతికి లేవు. పుట్టుకతో మనుషులందరూ సమానమే! వారి వారి కర్మలను బట్టి , గుణాలను బట్టి విభజనలుంటాయని ఆది శంకరుల మాట. ఇది అక్షర సత్యం.
కొస మెరుపు : ఇదంతా నిజమే! కానీ మేము కొంచం ఎక్కువ సమానం అని కర్నూల్ లో కొంతమంది బడాబాబులు నిరూపించారు. తమ డబ్బు, పలుకుబడి ఉపయోగించి నీటి గండం నుంచి తప్పించుకోవడమే కాక వరద నీరు మిగిల్చిన బురద శుభ్రం చెయ్యడానికి ప్రభుత్వం పంపించిన యంత్రాలను , సిబ్బందిని కూడా కొనేస్తున్నారు. మరి సామాన్యుల సంగతి, వారికి పంపుతున్న పరిహారం సంగతి..... దేవుడికే తెలుసు. అన్నట్లు ఆయన కూడా వాళ్ల పక్షమే కదా!