Friday, October 22, 2010

మీసం చేసిన మోసం

 రంగస్థలం మీద నటునికి ముందుగా కావాల్సింది ధారణ శక్తి . ఎంత పెద్ద డైలాగ్ నైనా, ఎన్ని పేజీలున్నా తడుముకోకుండా సహజరీతిలో చెప్పాల్సివుంటుంది. జ్ఞాపకశక్తి అంతగా లేని నటుడు రంగస్థలం మీద రాణించడం కష్టమే !
సినిమాలో అయితే ఆ అవసరం తక్కువ. గతంలోనైతే ముందుగా పక్కాగా స్క్రిప్ట్ తయారయ్యేది, దాన్ని షూటింగ్ కి వెళ్లక ముందే నటీనటులకు పంపడం జరిగేది. వాళ్ళు బాగా చదువుకుని, హావభావాలు సాధన చేసి మరీ షూటింగ్ కి వచ్చేవారు. అందువలన దర్శకుడు ఇచ్చే సూచనలను బాగా అర్థం చేసుకుని నటించడానికి వీలయ్యేది. సెట్ మీద అప్పడికప్పుడు డైలాగ్ లు రాసుకుని, అసలు డైలాగ్ షీట్ అవసరం లేకుండా సీన్ చెబితే చాలు నటీనటులు ఎవరికి తోచిన డైలాగ్ లు వారే చెప్పుకునే స్థాయికి ఎదిగిన ఈరోజుల్లో ఈ సంగతి చాలామందికి తెలియక పోవచ్చు....తెలిసినా తెలియనట్లు నటించొచ్చు, లేదా అంత శ్రమ పడడం శుద్ధ దండగ అని కొట్టి పడేయ్యవచ్చు. 

ఎంత పెద్ద పేరున్న నటుడైనా ఎప్పుడైనా తడబడతాడేమో గానీ ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా ఒక్క అక్షరం పొల్లు పోకుండా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసాడా అన్నట్లు నటించే నటుడు సాక్షి రంగారావు. ఆయన సంభాషణా ప్రవాహానికి ఒక ఉదాహరణ ' నటనలో జీవించిన సాక్షి ' అనే టపాలో గతంలో వివరించాను.

అయితే ఎంత గొప్పవారికైనా, ఎంత జాగ్రత్త తీసుకున్నా ఒక్కోసారి తప్పటడుగు పడే సందర్భం వస్తుంది. అంతటి ధారణాశక్తి కలిగిన సాక్షి రంగారావు గారికి కూడా అలాంటి పరిస్థితి ఒకసారి ఎదురయింది. అయితే దాన్నుంచి ఆయన ఎలా బయిట పడ్డారో చూద్దాం.......

ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనపుడు బాధితుల సహాయం కోసం చలనచిత్ర నటులు సాంస్కృతిక ప్రదర్శనలివ్వడం ద్వారా ధన సేకరణ చెయ్యడం ఆనవాయితీ. అలా ఓసారి కరువు బాధితుల సహాయం కోసం సూపర్ స్టార్ కృష్ణ తెనాలిలో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రముఖ నటీనటులు పాల్గొన్నారు. అందులో భాగంగా కృష్ణ, చంద్రమోహన్, సత్యనారాయణ, రావికొండలరావు, రాధాకుమారి, సాక్షి రంగారావు పాల్గొన్న ' వింత మనుషులు ' అనే హాస్యనాటిక ప్రదర్శించారు.

సాక్షి రంగారావు చేతిలో గొడుగుతో స్టేజి మీదకు ప్రవేశించే ఘట్టం. ఆయన హుషారుగా వచ్చేసాడు. కానీ ఆయన  మీసం పెట్టుకోవడం మరచిపోయాడు. ఆది గమనించిన రావికొండలరావు గారు ఊరుకోకుండా సాక్షి చెవిలో ' మీసం పెట్టుకోలేదేం ? ' అని అడిగారు. దాంతో సాక్షిగారు తెల్లబోయారు. గుటకలు మింగారు. ఆ తప్పు ఎలా జరిగిందో అర్థం కాక అయోమయంలో పడిపోయారు.

అంతే ! ఆ దెబ్బకి చెప్పాల్సిన డైలాగ్ మరిచిపోయారు. తోటి నటీనటులందరి వంకా వెర్రిచూపులు చూస్తూ నిలబడిపోయారు. ఆయన మొహంలో రకరకాల భావాలు ఒకేసారి కనిపించాయి. డైలాగ్ గుర్తు తెచ్చుకోవడానికి రకరకాల వింత చేష్టలు చేశారు. ఇదంతా చూస్తున్న ప్రేక్షకులు మాత్రం ఆది కూడా నటనలో భాగమే అనుకుని ఆనందపడిపోయారు. పగలబడి నవ్వారు. చివరికి గండం గట్టెక్కిందనుకోండి. సాక్షి రంగారావు గారిని మీసం చేసిన మోసం కథ ఆది.   

Vol. No. 02 Pub. No. 042

3 comments:

  1. He also acted like a real mridangam player in 'sankaraabharanam'.

    ReplyDelete
  2. one of the real and best actor in telugu.his pronunciation ,diction,body language asper character like all are good.

    ReplyDelete