Monday, June 7, 2010

సంగీతమయం సమస్తం



చిత్తూరు వి. నాగయ్య గారి కాలం తెలుగు సినిమా సంగీతానికి స్వర్ణయుగం. ఆయన రేణుకా పిక్చర్స్ కార్యాలయం సంగీత సరస్వతి నిలయం. సంగీత సామ్రాట్టులు, సాహితీ స్రష్టలతో నిత్యం ఆ కార్యాలయం కళకళలాడేది. విద్వద్గోష్టులు జరుగుతుండేవి. ఒకటేమిటి... సమస్తం సంగీతమయంగా వుండేది.



  త్యాగయ్య  చిత్ర నిర్మాణ కాలంలో  ఆ కార్యాలయంలో సంగీత వైభవం మరింతగా వుండేది. అప్పటి ప్రముఖ సంగీత విద్వాంసులందరూ అక్కడే వుండేవారు. కాబట్టి ఆ ప్రాంగణంలో నిత్యం జరిగే మామూలు సంభాషణలు కూడా సంగీతమయంగానే వుండేవి.  వాటినుంచి కొన్ని..........

* ప్రముఖ సంగీత విద్వాంసులు చెంబై వైద్యనాథ భాగవతార్ కూడా ఆ సమయంలో నాగయ్య గారి వద్దకు వచ్చేవారు. ఆయన్ని నాగయ్యగారు ఓసారి " అయ్యా ! మీ వయసెంతో తెలుసుకోవచ్చా ? " అని అడిగారు. దానికి సమాధానంగా ఆయన
" షణ్ముఖ ప్రియ " అన్నారట.
షణ్ముఖ ప్రియ 65 వ మేళకర్త రాగం. అంటే వైద్యనాథ భాగవతార్ గారి జవాబుకి అర్థం ఆయన వయస్సు 65 సంవత్సరాలు అని.

* చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళై అని మరో విద్వాంసుణ్ణి " మీ ఇల్లు ఎంత దూరం ? " అని అడిగితే " మా ఇల్లు ఇక్కడికి దగ్గరే ! మాయామాళవగౌళ గజాలకన్నా ఎక్కువ వుండదు " అన్నారట.
మాయామాళవగౌళ 15 వ మేళకర్త రాగం. అంటే ఆయన ఇల్లు 15 గజాలకన్నా ఎక్కువ వుండదు.

* నాగయ్య గారు తమ కార్యాలయానికి ఎవరొచ్చినా కాఫీ పలహారాదులు, భోజనాలు చేసి వెళ్ళే ఏర్పాటు చేసేవారు. ఇందుకోసం కార్యాలయంలోనే మెస్ నడిపేవారు. ఒకసారి ఒక సంగీత విద్వాంసుడు ఆ మెస్ లో ఫలహారం కానిచ్చి " ఇడ్లీకి పక్కవాయిద్యాలు భలే వున్నాయి " అన్నాడట. ఇడ్లీకి పక్కవాయిద్యాలంటే దానితో బాటు ఇచ్చిన సాంబారు, చెట్నీ, కారప్పొడి.
ఆ విద్వాంసుడే కాఫీ త్రాగబోతూ " అరే ! కాఫీ ఇంత వేడిగా వుందేమిటి ? " అన్నాడట. అక్కడే వున్న నాగయ్య గారు " ఏముందీ ! ఆ లోటాలోంచి ఈ లోటాలోకి ఆరోహణ, అవరోహణ చెయ్యండి " అని సంగీత పరిభాషలోనే సలహా ఇచ్చారట.   

................. ఇలా సాగేవి నాగయ్యగారి కొలువులో సంగీత సరస్వతి స్వేచ్చా విహారాలు.



Vol. No. 01 Pub. No.312

Sunday, June 6, 2010

విరాళం పెంచిన వ్యాపారం

బెనారస్ హిందూ యూనివర్సిటీ ( కాశీ విశ్వ విద్యాలయం ) స్థాపకుడు పండిట్ మదనమోహన్ మాలవ్యా. ఆ విశ్వవిద్యాలయ స్థాపనకు ఆయన అవిరళ కృషి చేశారు. అందులో భాగంగా విరాళాల సేకరణ కూడా ఆయనే స్వయంగా చేసేవారు. ఆ పని మీద ఒకసారి ఆయన ఒక బ్యాంకు అధిపతి దగ్గరకు వెళ్ళారు. అప్పుడు ఆ బ్యాంకు ఆర్ధిక సంక్షోభంలో వుంది. అందువల్ల విరాళమియ్యలేని తన అశక్తతను మాలవ్యా దగ్గర వ్యక్త పరచాడు ఆ బ్యాంకు అధిపతి.

మదనమోహన్ మాలవ్యా కొద్దిసేపు ఆలోచించారు. ఆయనకో ఉపాయం తట్టింది. " ఒక పని చేద్దాం ! మొదట అయిదు లక్షల రూపాయలకు ఒక చెక్కు రాసివ్వండి. దాంతో మీ వ్యాపారం కూడా బాగుపడుతుంది " అన్నారు.

ఆ బ్యాంకు అధిపతికి ఏమీ అర్థం కాలేదు. అసలే నా వ్యాపారం బాగులేదంటే ఈయన అయిదు లక్షలకు చెక్కు ఇమ్మంటారేమిటీ ? అనుకున్నాడు. అదే విషయం మాలవ్యా గారికి చెప్పాడు. ఆయన వెంటనే " అదేం కాదు. ముందు నేను చెప్పినట్లు చెయ్యండి. తర్వాత విషయం నేను చూసుకుంటాను "

మాలవ్యా గారి మీద గురి, గౌరవం వున్న ఆ బ్యాంకు అధిపతి ఇంకేమీ మాట్లాడకుండా అయిదులక్షలకు చెక్కు రాసి ఇచ్చాడు. అంతే ! మర్నాడు వార్తాపత్రికల్లో ఫలానా బ్యాంకు కాశీ విశ్వవిద్యాలయానికి అయిదు లక్షల విరాళం ఇచ్చినట్లు వచ్చింది. దాంతో ప్రజల్లో అప్పటివరకూ ఆ బ్యాంకు మీద వున్న అపోహలు, సందేహాలు అన్నీ తొలగిపోయి మళ్ళీ డిపాజిట్లు ఇవ్వడం ప్రారంభించారు. అలా బ్యాంకు ఆర్ధిక పరిస్థితి గాడిన పడింది. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి విరాళం దక్కింది.


Vol. No. 01 Pub. No.311

Saturday, June 5, 2010

పంచభూతాలు - ప్రకృతి

పంచభూతాలు ప్రకృతిమాత మనకు ప్రసాదించిన వరాలు
మహాజ్ఞానులమనే అజ్ఞానంతో మనం విర్రవీగితే
మిగిలేది శూన్యమే !

ప్రకృతి మాత వొడిలో మానవుడు ఎప్పుడూ బాలుడే !
ఆది తెలుసుకుంటే ప్రకృతి మనకెప్పుడూ అమ్మ వొడే !
అప్పుడంతా ఆనందమే !

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఓ చిన్న విన్నపం..........

 


Vol. No. 01 Pub. No.310

Friday, June 4, 2010

' బాలు ' నికి వెరైటీ సన్మాన పత్రం

 
 సన్మాన పత్రం    
 ఎలక్ట్రానిక్ వాచ్ ( ఓడిపోయిన మొహంతో ) :  మా బాస్ కి స్పీడెక్కువ. ఆయనతో పరుగెత్తలేక నా కాళ్ళు  ( ముళ్ళు )   నొప్పెడుతున్నాయి. నన్నిక ఎవరికో ఒకరికి ప్రెజెంట్ చేసినా బాగుణ్ణు. కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు.

 గిల్లెట్ రేజర్ ( దర్పంగా ) :  ఆయనకి ప్రతిరోజూ షేవింగ్ హడావిడే ! కంఠం దగ్గరకొచ్చేసరికి మాత్రం నేను చాలా ' స్మూత్ ' గా  రన్నవుతాను.

 ఏసీ అంబాసడర్ కారు ( ఉస్సురనుకుంటూ ) : ప్రతిపూటా ఓవర్ లోడింగే ! ఆయన కేంతమంది ఫ్రెండ్స్ ఉంటే మాత్రం అంతా రికార్డింగ్ కి రావలసిందేనా ! ఇద్దరు ముగ్గురు చాలు ప్రాణానికి హాయిగా వుంటుంది. 

 వడపళని, నుంగంబాక్కం రోడ్లు ( సాదరంగా ) : ఎంతమంది మహావ్యక్తులకి మేము రోజూ రాజమార్గాలైనా, బాలూ కారుకి మేమిచ్చేది మాత్రం ఎప్పటికీ రెడ్ కార్పెట్ ట్రీట్ మెంటే !

 మైక్ ( సిన్సియర్ గా ) : ఏకు మేకై కూర్చోడమంటే ఇదే ! సన్నగా, నున్నగా వున్న ' బాలగాత్రం ' గాన గానాభివృద్ధి చెంది ' బోల్డ్ వాయిస్ ' అయిన బాలు గాత్రంగా మారడానికి నేనేగా ప్రత్యక్ష సాక్షిని. ఏమాటకామాటే చెప్పుకోవాలి. నేనున్నా, లేకున్నా - నాలోంచి విన్నా, విడిగా విన్నా బాలు గొంతు ' నభూతో నభవిష్యతి ' 

 మద్రాస్ రికార్డింగ్ థియేటర్లు ( గ్లూకోస్ డబ్బాలవైపు చూస్తూ ) : మేమే మెషిన్లమయితే మమ్మల్ని మించిన ' సింగింగ్ ' మెషిన్ దొరికాడు మా ప్రాణానికి.

 పాట సాహిత్యం ( బాలానందంగా )  : థాంక్ గాడ్ ! మా పదాలకి మాకే తెలీని కొత్త అందాలు పెట్టగలిగే గాయకుడి గొంతులో పడ్డాం !

 వాయిద్యాలు ( బెరుకుగా ) :  ఇదెక్కడి మిమిక్రీ అండి బాబూ ! తొందరలో మమ్మల్ని రిప్లేస్ చేసేలా వున్నాడే !

 బాల్ ( + ఉ ) పెన్ను ( ధీమాగా ) : మా ఓనర్ గారి చేతిలో పడ్డాక నా ' రాతే ' మారిపోయింది.

పత్రికలు ( గర్వంగా ) : ఈయన పేరు లేకుండా రావుకదా పత్రికలు.

 హిగ్గిన్ బాదమ్స్ బుక్ స్టాల్ ( ముసి ముసి నవ్వులతో ) : కొత్త ఇంగ్లిష్ పుస్తకం రావడం ఆలస్యం. నా రాక్ లో పట్టుమని పదినిముషాలుండనివ్వడు కదా !

 రేడియో ( గంతులేస్తూ ) : ఇక నా పేరు ' బాలిండియా రేడియో ' గా మార్చేస్తారట.

 వీడియో ( దర్పంగా ) : నాకు, బాలు గారికి ఇంతటి అనుబంధం ఏర్పడిపోతుందని కల( ర్ ) లో కూడా అనుకోలేదు. రాత్రి ఒకటైనా, రెండైనా నా దర్శనం చేసుకోందే పడుకోలేడుకదా !

 అకాయ్ డెక్ ( హడావిడిగా ) : సారీ సర్ ! ఐ యాం టు బిజీ. టేప్ టు టేప్ టు టేప్...... !

 చొక్కా కన్నీళ్ళతో ) : కాస్త డైటింగ్ చెయ్యమని చెప్పండి డాక్టరూ ! నా కుట్లు విడిపోతున్నాయి దేవుడో !

 సుమారు రెండు దశాబ్దాల క్రితం బాలుగారికి హైదరాబాదులో జరిగిన ఓ సన్మాన కార్యక్రమంలో డా. వై. దివాకరబాబు సమర్పించిన వెరైటీ సన్మాన పత్రం ఇది. 

బాలుగారి జన్మ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలందిస్తూ....... బాలుగారు తెరమీద తొలిసారిగా కనిపించి స్వయంగా పాడిన ' హ్యాపీ బర్త్ డే ' పాట..... ఆయనకోసం, మీకోసం .................



Vol. No. 01 Pub. No. 309

Wednesday, June 2, 2010

దొరకునా ఇటువంటి సేవ....ధర్మతేజ

 ' దొరకునా ఇటువంటి సేవ ...'  వేటూరి వారు రాసిన ఆణిముత్యాలలో ఒకటి. ధర్మతేజ వేటూరి వారికి లభించిన ఆణిముత్యంలాంటి అనుయాయి. చదివిన న్యాయశాస్త్రాన్నీ, మెజెస్ట్రేట్ వుద్యోగాన్నీ వదిలి, స్వయంగా రచయితో, సంగీత దర్శకుడో  కాగలిగే సామర్థ్యం వుండి కూడా ఆ సాహితీమూర్తి సేవలో తరించారు ధర్మతేజ.

సుమారు అయిదు సంవత్సరాల క్రితం ధర్మతేజ గారితో వున్న కొద్దిపాటి పరిచయంలోనే ఆయనకు వేటూరిగారితో  వున్న అనుబంధం ఏపాటిదో నాకు అర్థమయింది.  ఆయన  ప్రతి సంభాషణలోనూ వేటూరివారి ప్రసక్తి, ఆయన రచనల ప్రసక్తి రాకుండా ఉండేదికాదు. అంతగా ఆయన జీవితం ఆ సాహితీమూర్తి జీవితంతో పెనవేసుకుపోయింది.

ధర్మతేజగారు వేటూరి గారితో తన అనుబంధాన్ని ఈ రోజు ఆంధ్రజ్యోతి లో వివరించారు.  ఆ లింక్ మీకోసం.........

http://www.andhrajyothy.com/navyaNewsShow.asp?qry=2010/jun/3/navya/3navya1&more=2010/jun/3/navya/navyamain&date=3/6/2010

Vol. No. 01 Pub. No.308

పార్లమెంట్ - విరహ వేదన


 పి.వి. నరసింహారావు గారు ప్రధానిగా ఉన్నప్పటి రోజులు. ఉపాధ్యక్షరాలిగా శ్రీమతి నజ్మా హెప్తుల్లా వున్న రాజ్య సభలో ప్రశ్నోత్తరాల సమయం. ప్రధానికి ప్రశ్న వేశారు. కానీ ఆ సమయానికి ఆయన సభలో లేరు. ప్రతిపక్ష సభ్యులు తమ అభ్యంతరాన్ని ఉపాధ్యక్షురాలి దృష్టికి తీసుకెళ్ళారు. సరిగ్గా ఆ సమయంలోనే పి. వి. సభలో ప్రవేశించారు.


ఆయన్ని చూసి నజ్మా హెప్తుల్లా " ప్రధాని గారూ ! మీరంటే సభ్యులకు ఎంత ప్రేమో చెప్పలేం ! మీరు రావడం ఒక్క నిముషం ఆలస్యమైనా తాళలేకపొతున్నారు " అన్నారు.

వెంటనే పి.వి. నరసింహారావు గారు నవ్వుతూ " అయ్యో ! ఈ విషయం ముందే తెలిస్తే మరికొంచెం ఆలస్యంగా వచ్చేవాడిని.  అప్పుడు సభ్యులు విరహ వేదనతో మరింత ప్రేమ కురిపించేసి ఉండేవాళ్ళు కదా ? " అని ఛలోక్తి విసిరారు. 



Vol. No. 01 Pub. No.307

Tuesday, June 1, 2010

కల్తీ లేని కట్టలు

1952 లో విడుదలయిన ' సువర్ణమాల ' చిత్ర నిర్మాణ సమయంలో జరిగిన విచిత్ర సంఘటన. ఆ చిత్రానికి దర్శకుడు కాళ్ళకూరి సదాశివరావు గారు.

కథానాయిక " నీ రూపాయిలెవరికి కావాలి. నాకు కావాల్సింది కల్తీలేని ప్రేమ " అంటూ డబ్బు కట్టల్ని కథానాయకుని మొహం మీద విసిరి కొట్టే సన్నివేశం.

చిత్రీకరణ సమయంలో డమ్మీ రూపాయి కట్టలతో అనుకున్న ఎఫెక్ట్ రాదనీ నిజం నోట్ల కట్టల్నే తెప్పించమన్నారు దర్శకులు . నిజం కట్టలే వచ్చాయి. సన్నివేశం ప్రారంభమైంది. అనుకున్నట్లుగానే హీరోయిన్ నోట్లను విసిరేసింది. దాంతో అనుకున్న ఎఫెక్ట్ వచ్చింది.

కానీ నిర్మాత ముఖంలో మరో ఎఫెక్ట్ కనిపించింది. చెల్లాచెదురుగా పడ్డ ఆ నోట్లను బోయ్స్ దగ్గర్నుంచి దర్శకుని వరకూ అందరూ తరతమ బేధాలు లేకుండా ఏరేసుకున్నారు. అప్పటికి మూడు నెలలుగా ఆ కంపెనీలో సిబ్బందికి జీతాలు లేవు మరి. అందుకే దర్శకులు ఈ ఝలక్ ఇచ్చారు.

Vol. No. 01 Pub. No. 306