Saturday, September 18, 2010

ఉద్యోగ భయం

నేడు చెన్నైగా మారిన మదరాసు మహానగరంలో ఒకప్పుడు ట్రామ్ బళ్ళు తిరిగేవి. ఆ రోజుల్లో ఒకసారి ఒక ట్రామ్ లో ప్రయాణం చేస్తున్న రచయిత ఆచంట జానకిరామ్ గారికి వెలిసిన పాత కోటు వేసుకుని అతి దీనమైన అవతారంతో వున్న కవి పుంగవులు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు కనిపించారు.

ఆయన పరిస్థితి చూసి ఏమీ అర్థం కాకపోయినా దగ్గరకెళ్ళి పరిచయం చేసుకున్నారు జానకిరామ్ గారు.
 అలా జరిగింది ఆ సరస్వతీ పుత్రుల తొలి పరిచయం. మర్నాడు జానకిరామ్ గారు మరో కవిశేఖరులు మల్లంపల్లి చంద్రశేఖర శాస్త్రి గారి ఇంటికి వెళ్లారు. అప్పుడక్కడికి కృష్ణశాస్త్రి గారు కూడా వచ్చారు. అయితే ఇప్పుడు మరో వేషంలో. మల్లెపువ్వులాంటి తెల్లని లాల్చీలో అచ్చమైన భావకవిలా వెలిగిపోతూ కనిపించారు. నిన్నటికీ, ఈరోజుకీ ఎంత తేడా అని జానకిరామ్ గారు ఆశ్చర్యపోయారు. అదే విషయం అడుగుదామని

" నిన్న మీరు ట్రాంలో..... వెలిసిపోయిన కోటులో .... " అంటూండగానే........

దేవులపల్లి వారు అందుకుని " అదా..... ఎవరో ఉద్యోగం యిస్తాం రమ్మన్నారు. వెళ్లక తప్పింది కాదు. వాళ్ళు అన్నంతపనీ చేస్తారేమోనని జడిసి ఆ కోటు తొడుక్కుని వెళ్లాను. అమ్మయ్య ! అదృష్టవశాత్తూ ఆ ఉద్యోగం రాలేదు " అన్నారట.

Vol. No. 02 Pub. No. 027

No comments:

Post a Comment