Tuesday, March 9, 2010

తొలి నేపథ్య గానం

   1931 లో భారత చిత్రాలకు మాటలోస్తే నేపథ్యగానం మాత్రం 1934 లో ఆరంభమైంది. కెమెరామన్ గా ప్రారంభించిన నితిన్ బోస్ ( దాదా సాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత ) తాను దర్శకత్వం వహించిన  ' భాగ్య చక్ర ' బెంగాలీ చిత్రంలో తొలిసారిగా నేపథ్యగానాన్ని ప్రవేశపెట్టారు. ఆ చిత్రం ' దూప్ చావ్ ' గా హిందీలో అదే సంవత్సరం రూపొందించారు. మొదటి పాటను కె. సి . డే, పాల్ ఘోష్, సుప్రభా సర్కార్ పాడారు.  


తెలుగులో మాత్రం పది సంవత్సరాలు ఆలస్యంగా 1944 లో నేపథ్య గానం ఆరంభమైంది. అప్పటివరకూ నటీనటులు వారి పాటలను వారే లైవ్ లో పాడుకునేవారు. తర్వాత కాలంలో సుందరదాసుగా ప్రసిద్ధి పొందిన ఎం.ఎస్. రామారావు గారు తొలి నేపథ్య గీతాన్ని ఆలపించారు. ఆ చిత్రం ' తాసిల్దారు '. వై. వి. రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ఆయనతో బాటు భానుమతి, కమలా కొట్నీస్, బలిజేపల్లి మొదలైన వారితో బాటు ఎం. ఎస్. రామారావు కూడా నటించారు. హెచ్. ఆర్. పద్మనాభ శాస్త్రి సంగీత దర్శకత్వం వహించారు. నండూరి సుబ్బారావు గారి ఎంకి పాట ' ఈ రేయి నన్నొల్ల నేరమా '  ఎం. ఎస్. రామారావు గారు పాడారు.

గమనిక : ఎం. ఎస్. రామారావు గారి తొలి పాట ఎవరి దగ్గరైనా వుంటే వినిపిస్తారా ?

Vol. No. 01 Pub. No. 218

Sunday, March 7, 2010

మహిళాలోకానికి శుభాభినందనలు

పుడమి తల్లి మహిళ
లెక్కలేనంత సంతానాన్ని భరిస్తోంది
ప్రకృతిమాత మహిళ
అంతులేనంత కాలుష్యాన్ని భరిస్తోంది

నవమాసాలు కడుపున భరించేది మహిళ
రెక్కలోచ్చేవరకూ మన అల్లరి భరించేది మహిళ
మనకి తొలి గురువు, మార్గదర్శి ఆ మహిళే
జీవితాంతం తోడూ నీడగా వుండి భరించేది మహిళ
కుటుంబ వ్యవహారాల నిర్వాహకురాలు కూడా ఆ మహిళే
మహిళ లేనిదే మగవాని జీవితం అసంపూర్ణం
అర్థనారీశ్వర తత్వమే దీనికి నిదర్శనం

ముఖ్యంగా మహిళా బ్లాగరు మిత్రులకు మరిన్ని శుభాకాంక్షలతో ...




గమనిక : ఈ వీడియోలో కొంతమంది మహిళా ప్రముఖుల చిత్రాలున్నాయి. వారిని కనిపెట్టి, వారే రంగంలో ప్రముఖులో వరుసక్రమంలో చెప్పగలరేమో ప్రయత్నించండి..

Vol. No. 01 Pub. No. 217

Saturday, March 6, 2010

ఎవరో వస్తారని ఏదో చేస్తారని.......

ఎదురు చూసి మోసపోకుమా
మహాకవి శ్రీ శ్రీ రాసిన మంచి పాటల్లో ఇది కూడా ఒకటి. ప్రబోధాత్మక గీతం.శ్రీ శ్రీ ఈ పాటలో చెప్పిన పంతుళ్ల పరిస్థితుల్లో ఇప్పుడు కొంత మార్పు వచ్చిందేమో గానీ చదువులో పెద్ద మార్పు కనబడదు. మిగిలిన పూరిగుడిసెల, పేదల కాలే కడుపుల , మందులు లేని ఆసుపత్రుల, మూఢాచారాలకు, ఇతరత్రా అన్యాయంగా బలైపోయే పడతుల, దురాశ, దురలవాట్లకు బానిసలై పోయే వాళ్ళ , సేద్యం లేక పనుల్లేని రైతు కూలీల, శ్రమకు తగ్గ ఫలితం దక్కని శ్రమజీవుల పరిస్థితుల్లో అప్పటికీ, ఇప్పటికీ చెప్పుకోదగ్గ మార్పు రాలే్దు. అందుకే ఆయన ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడద్దంటారు.

అనుపమ ఫిల్మ్స్ బ్యానర్ పైన దర్శక నిర్మాత కె. బి. తిలక్ నిర్మించిన చిత్రం ' భూమికోసం ' లోనిదీ పాట. ఘంటసాల గారు చివరి రోజుల్లో పాడిన పాటల్లో ఇది కూడా ఒకటి. ఈ చిత్రానికి పేరు పెట్టింది శ్రీ శ్రీ గారేనట. పెండ్యాల నాగేశ్వర రావు సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని తిలక్ గారి సోదరుడు కె. రామనరసింహ రావు ( నక్సలైట్ ) కు అంకితమిచ్చారు. తిలక్ గారు ఒక ఐరిష్ రచయిత రాసిన LAND అనే నవలను శ్రీ శ్రీ గారికిస్తే ఆయన దాన్ని మన తెలుగు వాతావరణానికి అన్వయిస్తూ చలన చిత్ర కథగా మార్చారు. ఈ పాటలో గుమ్మడి నటించారు. ఈ చిత్రం ద్వారానే ప్రభ, జయప్రద పరిచయమయ్యారు. అయితే తర్వాత ప్రభ నటించిన ' నీడలేని ఆడది ' ముందుగా విడుదలయింది.

రేపు, ఎల్లుండి ( మార్చి 8, 9 తేదీలలో ) చెన్నై లో శ్రీ శ్రీ సాహిత్య సదస్సులు జరుగనున్నాయి. ఆ సందర్భంగా ఆ మహాకవిని మరోసారి జ్ఞప్తికి తెచ్చుకుంటూ........




Vol. No. 01 Pub. No. 216

సమాధి మీద రాత

మనకి సమాధి మీద రాతలతో పరిచయం తక్కువ. ఎక్కువగా మన దేశంలోని సమాదులమీద జనన మరణ తేదీలనే రాస్తారు కానీ పాశ్చాత్య దేశాలలో అలా కాదు. సమాధి మీద చనిపోయిన వ్యక్తికి సంబంధించిన లేదా ఆ వ్యక్తికి నచ్చిన వాక్యాలు రాయడం పరిపాటి.

ఆంగ్ల చిత్ర ప్రియులకు 1939 లో వచ్చిన GONE WITH THE WIND చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. హాలీవుడ్ ఆణిముత్యాలుగా పిలువబడే చిత్రాలలో ఇది కూడా ఒకటి. పది ఆస్కార్ అవార్డులు సాధించి సంచలనం సృష్టించిన చిత్రం. మరో ఇరవై సంవత్సరాలదాకా ఆ రికార్డును ఏ చిత్రం కూడా అధిగమించ లేకపోయింది. హాలీవుడ్ చిత్రాలలో మణిపూసగా నిలిచిన ఆ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించి ఆస్కార్ కు నామినేట్ అయిన ' హాలీవుడ్ రారాజు ( King of Hollywood ) ' అని పిలిపించుకున్న నటుడు క్లార్క్ గేబుల్ ( Clark Gable ).

నటుడు కావడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. నాటక రంగంనుంచి సినిమా రంగానికి వచ్చాడు. చేటంత చెవులతో అతనొక కోతిలా ఉన్నాడని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ వార్నెర్ బ్రదర్స్ ప్రతినిథి వెటకారం చేసాడు. అయినా పట్టుదలతో ప్రయత్నించి MGM సంస్థలో చేరి 1931 లో Dance, Fools, Dance చిత్రంతో నిలదొక్కుకున్నాడు.

అందరిలాగే క్లార్క్ గేబుల్ కూడా తన మరణం తర్వాత తన సమాధి మీద రాయడానికి ఓ వాక్యాన్ని, జీవించి వుండగానే సిద్ధం చేసుకున్నాడు. ఆ వాక్యం ఏమిటంటే...........

క్లార్క్ గేబుల్ నవంబర్ 16 వ తేదీ 1960 న మరణించాడు.

Vol. No. 01 Pub. No. 215

Thursday, March 4, 2010

ఓం సచ్చిదానంద....

ఇప్పుడెక్కడ చూసినా సచ్చిదానందమే !
అంతా మాయ ! జగమంతా మిథ్య !!
మా కేళీ లీలా విలాసాలోకటే సత్యం !
భక్తులకు ముక్తి వేదాంతం
మాకు రక్తి సిద్దాంతం
మా బోధనలే మీకు శిరోధార్యాలు
మీ ' సేవ 'లే మాకు అలౌకికానందాలు
ఎందరో స్వాములు, గురువులు, బాబాలు
అందరికీ వందనాలు
అందుకే మహాకవి దృష్టిలో మిథ్యావాది .............

మాయంటావా ? అంతా
మిథ్యంటావా ?
నా ముద్దుల వేదాంతీ !
ఏమంటావూ ?
కనబడినది కనబడదని
వినబడినది వినబడదని
జగతి మరుపు, స్వప్నం, ని
శ్శబ్దం ఇది
మాయ ! మాయ !
మాయంటావూ ! అంతా
మిథ్యంటావూ !!

ఓం సచ్చిదానంద..............



Vol. No. 01 Pub. No. 214

Wednesday, March 3, 2010

నాయకుడికి నిజమైన నిర్వచనం

నాయకుడంటే ఒక గుంపుకో, ఒక ప్రజా సమూహానికో దిశా నిర్దేశకుడు. అతనిని అనుసరించే వాళ్ళు సహజంగానే అతడు తమను సరైన మార్గంలో నడిపించాలనుకుంటారు. తమకు నాయకుడు మంచి చేస్తాడని, తమ ప్రయోజనాలను కాపాడతాడని నమ్ముతారు.

మనది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. ప్రజల్ని నియోజకవర్గాలవారిగా విడదీసి ఒక్కొక్క నియోజక వర్గానికీ ఒక్కొక్క నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడు ఆ నియోజకవర్గ ప్రజల సంక్షేమానికి పాటు పడాలి. సాంకేతికంగా, రాజ్యాంగపరంగా ఇదే నిజమనుకుంటాను. కానీ ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ముందు ఆలోచించేది ప్రజల సంక్షేమం కాదు. తన, తనవాళ్ళ క్షేమం. ప్రజల ఓట్ల అండతో పదవిలోకొచ్చాక ఆలోచించేది తనకా స్థితి కల్పించిన ప్రజల్ని ఎలా దోచుకోవచ్చా అనే విషయమే ! అందుకే వాళ్ళు మంత్రి పదవి దక్కే అవకాశం వస్తే కాసులు కురిపించే శాఖ కావాలనుకుంటారే కానీ ప్రజలకు సేవ చేసే శాఖ కావాలని కోరుకుంటారా ? ప్రజలకు సేవ చేస్తే ఏం రాలుతుంది.... బూడిద !! ఒకవేళ ఎవరైనా అలా కోరుకుంటే వాళ్ళను పిచ్చివాళ్ళనుకుంటారు. కానీ అలా సేవ చెయ్యాలనుకునే వాళ్ళు కూడా వుంటారు. ఈ రోజుల్లో కాకపోవచ్చు. గతవైభవమే కావచ్చు. అయినా అలాంటి వాళ్ళను ఒక్కసారైనా తలుచుకుంటే ప్రస్తుత రాజకీయనాయకుల అవినీతి విన్యాసాలనుంచి కొంచెం ఉపశాంతి. అలాంటి ఓ ఉదంతం.

గత కాబినెట్ లో పశుసంవర్థక శాఖా మంత్రిగా పనిచేసిన మండలి బుద్ధ ప్రసాద్ గారి పేరు వినే వుంటారు. ఆయన తండ్రిగారు మండలి వెంకట కృష్ణారావు గారు కూడా ఒకప్పుడు మంత్రిగా పనిచేసినవారే ! ఆయనకు మొదటిసారి మంత్రి పదవి లభించింది పి.వి.నరసింహారావు గారి హయాంలో. పి.వి. గారు మంత్రివర్గానికి శాఖల కేటాయింపులు చేస్తూ సహచరులను శాఖల మీద వాళ్ళ ఆసక్తిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో మండలి వెంకట కృష్ణారావు గారి వంతు వచ్చింది. పి.వి. గారు అడిగారు మీకేం శాఖ కావాలని. తనకు సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించమన్నారు. పి.వి. గారు ఆశ్చర్యపోయారు. ఆయన ఎందుకు ఆశ్చర్యపోయారో అప్పట్లో అజ్ఞానులైన ఓటర్లకు అర్థం కాకపోయి వుండవచ్చుగానీ, తెలివి మీరినా నిస్సహాయులైన ఇప్పటి ఓటర్లకు అర్థమవుతుంది. ఇదివరలో ప్రభుత్వోద్యోగులకు పనిష్మెంట్ ట్రాన్స్ఫెర్ అంటే ఏ శ్రీకాకుళమో, ఆదిలాబాదో పంపిచేయ్యడం. అదే ఇప్పటి నాయకుల దృష్టిలో సాంఘిక సంక్షేమ శాఖ ఇవ్వడమంటే అలాంటిదే ! రాజకీయాలు వ్యాపారమైపోయిన ఈ రోజుల్లో ఆశాఖలో తమ పెట్టుబడి గిట్టుబాటు కాదని వారి ప్రగాఢ విశ్వాసం. అందుకే వాళ్ళు దాని జోలికి పోరు. ఇక ఆఖరు వరుసలో వున్న వారు మాత్రం ( బంగారు ) భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తప్పనిసరై వప్పుకుంటారు.

అందుకే పి.వి. గారికి కూడా అనుమానం వచ్చింది. ఈయన ఈ శాఖను ఎందుకు కోరుకుంటున్నారా అని. ఆ విషయమే అడిగారు అందరూ వద్దనుకునే శాఖనే మీరెందుకు కోరుకుంటున్నారని. దానికి మండలి వెంకట కృష్ణారావు గారిచ్చిన సమాధానం ఏమిటంటే పేదప్రజలకు దగ్గరగా వుంటూ సేవ చేసే అవకాశం సాంఘిక సంక్షేమ శాఖలోనే వుందని, అందుకని ఆ శాఖనే తనకు కేటాయించవలసినదిగా ముఖ్యమంత్రిని కోరారు. పిచ్చివాడు కాకపోతే పేద ప్రజలకు సాయం చెయ్యడమేమిటి ? సొంత లాభం చూసుకోక ! అలా కాదు కాబట్టే మనం ఇప్పుడు కూడా వాళ్ళను తలచుకోవడం జరుగుతోంది. ఈ విషయాన్ని స్వయంగా పి.వి. గారే ఒక సదస్సులో చెప్పి మండలి వారి గొప్పతనాన్ని ప్రశంసించారట.

ఈ రోజుల్లో కూడా ఇలాంటి నిస్వార్థ రాజకీయ నాయకులు వుండాలని కోరుకోవడం అత్యాశ అవుతుందేమోగానీ నిజమైన నాయకుడికి నిజమైన నిర్వచనం మాత్రం ఇదేనేమో !



Vol. No. 01 Pub. No. 213

Monday, March 1, 2010

తొలి భారతీయ ఆంగ్ల టాకీ చిత్రం ' కర్మ '

హిమాంశురాయ్ అనే తొలి తరం భారత నిర్మాత, దర్శకుడు జర్మనీ సహకారంతో 1926 లో ' ది లైట్ అఫ్ ఆసియా ' అనే చిత్రాన్ని నిర్మించాడు. అంతర్జాతీయ సహకారంతో నిర్మించిన మొదటి చిత్రం అదే. అయితే అది మూకీ చిత్రం. తర్వాత జర్మనీ సంస్థ అయిన UFA ( Universum Film Aktiengesellschaft ) తో కలసి మరో రెండు చిత్రాలు నిర్మించారు.

1930 లో నిర్మించిన ' A thrown of dice ' చిత్రంతో తొలి తరం కథానాయిక దేవికారాణి వెండితెరకు పరిచయమైంది. అప్పటికి దేవికారాణి ఇంగ్లాండ్ లో ఆర్కిటెక్చర్, ఫిలిం క్రాఫ్ట్ చదువుతోంది. మన విశాఖపట్నంలో కల్నల్ డా. ఎం.ఎన్. చౌదరి, లీల దంపతులకు జన్మించిన దేవికారాణి విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ మేనకోడలు. ' A thrown of dice ' నిర్మాణ సమయంలోనే హిమంశురాయ్, దేవికారాణి పెళ్లి చేసుకున్నారు.

ప్రపంచ చలనచిత్ర రంగం మాటలు నేర్చుకుంది. మూకీలు  టాకీలుగా మారాయి. ఇంగ్లాండ్ కు చెందిన I.B.P. సంస్థతో కలిసి హిమంశురాయ్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో ' కర్మ ' చిత్రం మొదలు పెట్టాడు. అందులో హిమంశురాయ్, దేవికారాణిలే నాయిక నాయకులు. సీతాపూర్ మహారాణికి, జయనగర్ యువరాజుకు మధ్య నడిచే ప్రేమాయణం, యువరాజుని అతని తండ్రి నిర్భంధించి వారి ప్రేమను భగ్నం చెయ్యడం ఈ చిత్ర కథ. లండన్ లోని మార్బుల్ ఆర్చ్ పెవిలియన్ లో 1933 మే నెలలో ఈ చిత్రం విడుదలయింది.

ఈ చిత్రంతో దేవికారాణి ప్రపంచ ప్రేక్షకలోకానికి కలలరాణి అయింది. పాశ్చాత్య పత్రికా ప్రపంచం ఈమె అందాన్ని, వాచకాన్ని వేనోళ్ళ కీర్తించింది. ఈ చిత్రం భారతదేశంలో 'కర్మ' 1934 లో విడుదలయింది. సాంప్రదాయాలకు పెద్ద పీట వేసే భారత్ లో ఈ చిత్రంలో హిమంశురాయ్, దేవికారాణి ల పై నాలుగు నిముషాల పాటు వుండే ముద్దు దృశ్యం అప్పట్లో సంచలనం రేపింది. ఈ చిత్రంతో భారతీయ ప్రేక్షకులకు కూడా ఆమె కలల రాణి అయిపోయింది. ఈ చిత్రాన్ని, దేవికారాణి అందాన్ని, అభినయాన్ని భారత కోకిల సరోజినీ దేవి ప్రత్యేకంగా ప్రశంసించారు కూడా !

Vol. No. 01 Pub. No. 212