Thursday, September 9, 2010

తెలుగు సినిమా దాదా...!


 కృషితో నాస్తి దుర్భిక్షం ............
దీనికి సజీవ ఉదాహరణ డా. డి. రామానాయుడు గారు

సినిమా నిర్మాణం మీద మక్కువను పెంచుకుని మద్రాస్ బాట పట్టి చిత్ర నిర్మాణంలో మెళుకువలు నేర్చుకుని చిత్రసీమ మీద ' అనురాగం ' పెంచుకుని ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ నేడు భారత దేశంలో అత్యున్నత పురస్కారాన్ని అందుకునే స్థాయికి చేరడం........... నిజంగా తెలుగు సినిమా రంగం, తెలుగు సినిమా ప్రేక్షకులు గర్వించదగ్గ విషయం.


ఒక నిర్మాత ఇన్ని సంవత్సరాలు వరుసగా చిత్రాలు నిర్మించడం మాటలు కాదు.
అందుకే గిన్నిస్ బుక్ లోకి ఆయన పేరు చేరింది.
ఆయన చిత్రాలు నేల విడిచి సాము చేసినవి కావు
వినోదం, వ్యాపారం ప్రధానమైనా బాధ్యత మరచిపోలేదు
సినిమా తియ్యడం పెద్ద గొప్పేమీ కాదు.... పుంఖాను పుంఖాలుగా నేను కూడా తియ్యగలను.... అని అదీ ఇదీ అని చూడకుండా అడ్డమైన చెత్త తీసి ప్రేక్షకుల మొహాన కొట్టలేదు.

ఆయన చిత్రాల విజయానికి, ఆయన జీవిత విజయానికి ముఖ్యమైన కారణం ప్రణాళిక
ఆయన చిత్రం నిర్మించినా, స్టూడియో కట్టినా, సంతానాన్ని చిత్రసీమలో ప్రవేశపెట్టినా అన్నీ ఒక ప్రణాళిక ప్రకారం జరిగాయి....జరుగుతాయి.
సరైన ప్రణాళిక, నిబద్ధత వుంటే ఏ మనిషైనా ఎంత ఎత్తు ఎదగచ్చో నాయుడు గారిని చూస్తే తెలుస్తుంది
కేవలం డబ్బు ఆ స్థాయిని కల్పిస్తుందని అనుకుంటే ఆది చాలా పొరబాటు.
ఆయన కంటే డబ్బున్నవాళ్ళు చాలామందే పరిశ్రమలోకి వచ్చారు.  గొప్ప నిర్మాతలుగా చాలామంది చెలామణీ అయ్యారు. కానీ అవన్నీ స్వల్పకాలమే ! తరువాత తెరమరుగయిన వాళ్ళే ఎక్కువ .

ఆయన చలన చిత్ర జీవితం కొత్తగా వచ్చే నిర్మాతలకు పెద్దబాలశిక్ష.
వాళ్ళు కొంతకాలం ఆయన నిర్మాణ శైలిని నిశితంగా గమనించిన తర్వాత నిర్మాణంలోకి దిగితే చేతులు కాల్చుకోవాల్సిన అవసరముండదు.
ఆయన చిత్రాల్లో అనవసరపు ఆర్భాటాలుండవు. హింసతో నిండిపోవు. హద్దు మీరిన శృంగారం వుండదు. ఫ్యాక్షన్ లు, బాంబులు వగైరా మసాలాలుండవు. సగటు ప్రేక్షకుడికి ఏమి కావాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. అందుకే ఆయన చిత్రాల్లో అన్నీ సమపాళ్ళల్లో రంగరిస్తారు. ఆయన చిత్రాలు ట్రెండ్ అంటూ గాలివాటుగా పోవు. అందుకే ఆయన తీసిన సినిమాలన్నీ దాదాపుగా విజయవంతమే !

కొందరికి తాము చేసిన పనుల కంటే తమకు ఎక్కువ గుర్తింపు రావాలనే కండూతి వుంటుంది. దానికోసం అవసరమైతే బిరుదులూ, సన్మానాలు కొనుక్కుంటారు. ఏదో ఒక సంచలన వార్తతోనో, వ్యాఖ్యతోనో మీడియా ద్వారా ప్రజల నోటిలో తమ పేరు నానేటట్లు చేసుకోవడానికి నానా తంటాలు పడతారు. ఆయనే ఒక చానెల్ గానీ, న్యూస్ పేపర్ గానీ పెట్టగలిగే స్థోమత వుండి కూడా పెట్టుకోలేదు. ఆయనకు ప్రచారం ఆయన చిత్రాలే !

రామానాయుడు గారికి ఆయన చిత్రాలు, ఆయన స్టూడియో తప్ప మరో దృష్టి వున్నట్లు తోచదు . రాజకీయాల్లో కూడా ఆయన ఇమడలేదు. తాను నమ్ముకున్న, తనని నమ్ముకున్న తెలుగు చిత్ర పరిశ్రమను ఆయన వదలలేదు. ఆ నిబద్ధతే ఆయన్ని ఈనాడు ఉన్నత శిఖరాలు చేర్చింది.

అందుకే ఆయన ఇంతకుముందు మూవీ మొఘల్ అయ్యారు.
ఇప్పుడు తెలుగు సినిమా దాదా అయ్యారు

దాదాసాహెబ్ ఫాల్కే భారతీయులకు సినిమాకళను అందించారు
రామానాయుడు తెలుగు చిత్ర పరిశ్రమకు నిర్మాణ కళను అందించారు 

 డా. రామానాయుడు గారికి దాదాసాహెబ్ ఫాల్కే  పురస్కారం ప్రకటించిన సందర్భంగా శుభాకాంక్షలతో............... 

Vol. No. 02 Pub. No. 022

Tuesday, September 7, 2010

ముచ్చటగా మూడు...? - మరికొన్ని వివరాలు.

ఈ ప్రశ్నలలో ఇచ్చిన చిత్రాలన్నీ అప్పట్లో సూపర్ హిట్ కాకపోయినా అంతో ఇంతో ప్రజాదరణ పొందినవే ! పేర్లు కూడా గుర్తుపెట్టుకోలేనివి మాత్రం కాదు. జవాబులతో బాటు మరికొన్ని వివరాలు ఇవ్వవలసింది. సులువుగా గుర్తుకొచ్చేవేమో ! నాకు తెలిసిన వివరాలతో బాటు ఆయా చిత్రాల పాటలు కూడా ఇస్తున్నాను. అవి వింటే గుర్తుకు రావచ్చు.

1. ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి ( ప్రముఖ రచయత ఆరుద్ర గారి సతీమణి ) సంభాషణలు రాసిన ఒకే ఒక చిత్రం ఏది ?

జవాబు : అభిమానవతి ( 1975 ) ; కృష్ణ , వాణిశ్రీ జంటగా నటించిన ఈ చిత్రం రామలక్ష్మి గారే రాసిన ' కరుణ ' అనే నవల ఆథారంగా నిర్మించబడింది.
చక్రవర్తి సంగీత నిర్దేశకత్వంలో దాశరథి రచించిన ఈ పాట బాలు గారు పాడారు. అప్పట్లో ఈ పాట ఎక్కువగా రేడియోలో వినిపించేది.





2. తెలుగులో తొలి ' పెద్దలకు మాత్రమే ' ( A సర్టిఫికేట్ ) చిత్రమేది ?

జవాబు : ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి  ' మనుషులు-మమతలు ' ( 1965 ) చిత్రం గురించి గత తరం ప్రేక్షకులకు ఎక్కువగా చెప్పనక్కర్లేదనుకుంటాను. అక్కినేని, సావిత్రి, జయలలిత నటించిన ఈ చిత్రంలో జయలలిత ధరించిన దుస్తులు అప్పట్లో సంచలనం కలిగించాయి. ఆ చిత్రంలోని పాటలన్నీ దాదాపుగా ప్రజాదరణ పొందినవే ! ఓసారి వింటే గుర్తుకు రాక మానవు.
తాతినేని చలపతిరావు సంగీతంలో ఈ చిత్రంలోని పాటలు ఆత్రేయ, దాశరథి, సి. నారాయణరెడ్డి రాశారు.




3. అందాల నటుడు శోభన్ బాబు ఆడ వేషంలో కనిపించిన చిత్రమేది ? ఏ పాత్రలో ?

జవాబు : ' కలసిన మనసులు ' ( 1968 ). ఇందులో ఓ అంతర్నాటకంలో శోభన్ బాబు రాధ వేషంలో, హీరోయిన్ భారతి కృష్ణుడి వేషంలో కనిపిస్తారు. మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన ఈ పాట
ఘంటసాల, సుశీల పాడారు.
గత తరం తెలుగు సినీ సంగీత ప్రియులు ఈ పాటను మరిచిపోవడం సాధ్యం కాదేమో !



Vol. No. 02 Pub. No. 020b

ముచ్చటగా మూడు ....? - జవాబులు

   కనుక్కోండి చూద్దాం - 26 

జవాబులు


1. ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి ( ప్రముఖ రచయత ఆరుద్ర గారి
సతీమణి ) సంభాషణలు రాసిన ఒకే ఒక చిత్రం ఏది ?

జవాబు : అభిమానవతి ( 1975 ) ; కృష్ణ హీరో 





2. తెలుగులో తొలి ' పెద్దలకు మాత్రమే '           
( A సర్టిఫికేట్ ) చిత్రమేది ?

జవాబు : అక్కినేని నటించిన ' మనుషులు-మమతలు ' ( 1965 ) 




3. అందాల నటుడు శోభన్ బాబు ఆడ వేషంలో కనిపించిన చిత్రమేది ?
ఏ పాత్రలో ?


జవాబు : ' కలసిన మనసులు ' ( 1968 ). ఇందులో ఓ అంతర్నాటకంలో శోభన్ బాబు రాధ వేషంలో, హీరోయిన్ భారతి కృష్ణుడి వేషంలో కనిపిస్తారు.


Vol. No. 02 Pub. No. 020a

Monday, September 6, 2010

జనంలోంచి వచ్చిన పాట


సంగీతం పండిత జనుల్ని రంజింపజేయ్యడానికి ఉద్భవిస్తే పామర జనపదుల్లోంచి సంగీతం అలవోకగా ప్రవహిస్తుంది.
కొన్ని పాటలు జనం కోసం పుడితే మరికొన్ని పాటలు జనంలోంచి పుడతాయి.
అలా పామర జనంలోంచి వచ్చిన పాట గురించిన ఓ ఉదంతం.


ఓసారి ఘంటసాల మాస్టారు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో మిత్రునితో కలసి విజయనగరంలో ఓ వీధిలోంచి నడిచి వెడుతుండగా ఆ అర్థరాత్రి వేళ ఎక్కడినుండో ఓ పాట వినబడింది. ఎక్కడా అని చూస్తే రోడ్డు ప్రక్కన గుడ్డి వెలుగులో కూర్చుని చెప్పులు కుట్టుకుంటున్న కార్మికుడు తీస్తున్న కూనిరాగమని అర్థమయింది. ఘంటసాల గారిని ఆ కూనిరాగం ఆకర్షించింది. ఆగి శ్రద్ధగా విన్నారు.

ఆయన మద్రాసు వచ్చాక కూడా ఆయన్ని ఆ కూనిరాగం వెంటాడుతూనే వుంది.  ఆయనలోని సంగీత కళాకారుడు ఊరుకోలేకపోయాడు. ఆ కూనిరాగంలోని బాణీని పట్టుకున్నాడు. ఫలితంగా కొత్త పాటకు బాణీ దొరికింది. తర్వాత కాలంలో ఘంటసాల విజయనగరం వెళ్ళినపుడు ఆ బాణీనందించిన కార్మికుణ్ణి గుర్తుపెట్టుకుని అతని దగ్గరకు వెళ్ళి మంచి బహుమానమిచ్చి గౌరవించారు.

ఆ బాణీతో ఘంటసాలగారు 1954 లో స్వీయ సంగీత దర్శకత్వంలో పాడిన ' చంద్రహారం ' చిత్రంలోని పాట ......................   



Vol. No. 02 Pub. No. 021

Saturday, September 4, 2010

ముచ్చటగా మూడు........ ?

  కనుక్కోండి చూద్దాం - 26 

ఈ క్రింద ముచ్చటగా మూడు ప్రశ్నలున్నాయి. జవాబులు చెప్పగలరేమో ప్రయత్నించండి.


1. ప్రముఖ రచయిత్రి కె. రామలక్ష్మి ( ప్రముఖ రచయత ఆరుద్ర గారి
సతీమణి ) సంభాషణలు రాసిన ఒకే ఒక చిత్రం ఏది ?





2. తెలుగులో తొలి ' పెద్దలకు మాత్రమే '
( A సర్టిఫికేట్ ) చిత్రమేది ?




3. అందాల నటుడు శోభన్ బాబు ఆడ వేషంలో కనిపించిన చిత్రమేది ?
ఏ పాత్రలో ?






Vol. No. 02 Pub. No. 020

Friday, September 3, 2010

సాంగుల గ్రంథం

చమత్కారాలు పలికించడంలో కవులు, రచయితలు సిద్ధహస్తులు. ఆ విషయంలో మనకి ఎలాంటి సందేహం లేదు. మరి కవిత్వంలో ఉద్ధండులైన ఇద్దరు మహానుభావులు కలిస్తే .....................



దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి గారు భావకవిత్వమెంత మధురంగా చెప్పగలరో సరస సంభాషణ కూడా అంతే మధురంగా చెయ్యగలరు.









కొసరాజు రాఘవయ్య చౌదరి తెలుగు సినీ కవిత్వాన్ని జానపదుల బాట పట్టించిన ఘనులు.


వీరిద్దరూ కలిస్తే ఆ సంభాషణ ఎంత సరసంగా వుంటుందో కదా ........ !

వాహినీ వారి ' బంగారు పంజరం ' చిత్రానికి పాటలు రాసే పనిలో వున్న దేవులపల్లి వారి దగ్గరకి కొసరాజు గారు వచ్చారు. ' పుస్తకం హస్త భూషణం ' అనే మాట కొసరాజు గారికి సరిగా సరిపోతుంది. ఆయన చేతిలో ఎల్లవేళలా ఒక పుస్తకం ఉండేది. దాంట్లో ఆయన రాసిన పాటలు, రాస్తున్న పాటలు ఉండేవి.

వస్తూనే దేవులపల్లి వారికి నమస్కారం చేశారు కొసరాజు గారు.  ప్రతి నమస్కారం చేస్తూ కృష్ణశాస్త్రి గారు కొసరాజు గారి చేతిలోని పుస్తకాన్ని ఏమిటన్నట్లు సైగ చేశారు.

విషయం గ్రహించిన కొసరాజు గారు ఆ పుస్తకాన్ని దేవులపల్లి వారికి చూపిస్తూ "  సాంగుల గ్రంథం " అన్నారు.
దానికి దేవులపల్లి వారు వెంటనే.......
 " సాంగుల గ్రంథం అంటున్నారు. మీరు గ్రంథ సాంగులు కారు కదా !  " .... అని చమత్కరించారు.

Vol. No. 02 Pub. No. 019

Thursday, September 2, 2010

చిన్ని చిన్ని కన్నయ్యా.....

 చిన్ని చిన్ని కన్నయ్యా.....
కన్నులలో నీవయ్యా....
నిన్ను చూసి మురిసేను......

చిన్నికృష్ణుని లీలలు అద్భుతం
చిన్న పిల్లల చిన్నెలు నయనానందం

శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా మా చిన్ని కృష్ణుడు.....



Vol. No. 02 Pub. No. 018