Showing posts with label సభలు - సమావేశాలు. Show all posts
Showing posts with label సభలు - సమావేశాలు. Show all posts

Sunday, July 18, 2010

Reunion - స్నేహమేరా జీవితం

 స్నేహమేరా జీవితం
స్నేహమేరా శాశ్వతం

ఆ స్నేహాన్ని నిజంగానే శాశ్వతం చేసుకున్నారు రైల్వే మిక్స్ డ్ హైస్కూల్ 1984 బ్యాచ్ విద్యార్థులు. నిన్న జరిగిన ఆ కలయికలో వారి ఆనందం, ఉత్సాహం, ఉద్వేగం చెప్పనలవికాదు. ఒక్కసారిగా అందరూ పాతిక సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయారు. మళ్ళీ చిన్న పిల్లలయిపోయారు. పదవతరగతి విద్యార్థులుగా మారిపోయారు. హాయిగా ఆడి పాడి తమ మిత్రుల్ని కలసిన ఆనందాన్ని పంచుకున్నారు. నిన్నటి వారి ఆనందం వర్ణనాతీతం.

వారి స్కూల్ జ్ఞాపకాలను పదిలం చేసుకోవడానికి నేను తయారు చేసిన డాక్యుమెంటరీలోని కొన్ని ఘట్టాలు.........



Vol. No. 01 Pub. No. 348a

Friday, July 16, 2010

స్నేహబంధమూ... ఎంత మధురమూ ...!!


స్నేహబంధము ఎంత మధురము 
చెరిగిపోదు తరగిపోదు జీవితాంతమూ ...

చిన్ననాటి జ్ఞాపకాలు తీయనైనవి
నూరేళ్ళు గడిచినా అవి మరపురానివి





...... అని నిరూపించారు విజయవాడ రైల్వే మిక్స్ డ్ హైస్కూల్ 1983-84 నాటి విద్యార్థులు....... ఇప్పటి బాధ్యతలు గలిగన పౌరులు.

ప్రపంచవ్యాప్తంగా వివిధ హోదాల్లో, వృత్తుల్లో స్థిరపడి ఆ భాధ్యతల్లో మునిగిపోయి తీరిక లేకుండా వున్న సుమారు 100 మంది ఈరోజు  ( జూలై 17 వతేదీ శనివారం ) విజయవాడలో కలవబోతున్నారు.

తమ తమ స్థాయిలు, హోదాలు మరచిపోయి బాల్యమిత్రులను కలవాలనే అభిలాషతో ఉత్సాహంగా ఉరకలేస్తూ  దేశవిదేశాలలోని వివిధ ప్రాంతాలనుంచి వస్తున్నారు.

తమకు విద్యాబుద్ధులు చెప్పి తమ ఉన్నతికి కారకులైన అప్పటి ఉపాధ్యాయులను, ఆ అవకాశాన్ని కల్పించిన ఆ పాఠశాలను స్మరించుకోవడానికి, సత్కరించుకోవడానికి సిద్ధంగా వున్నారు.

ఎప్పుడో పాతికేళ్ళక్రితం నాటి సహాధ్యాయుల వివరాలు సేకరించడం అంత సులభం కాదు.  ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. వారందరి వివరాలు, చిరునామాలు సేకరించడం కష్టం. ఒకరకంగా అది అసాధ్యం. కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు విజయవాడలో స్థానికంగా వున్న మిత్రులు. ముఖ్యంగా ఏక్సిస్ బ్యాంకు లో ఉన్నత స్థానంలో వున్న శరత్ చంద్ర, విజయవాడ రైల్వే లో పనిచేస్తున్న మరికొందరు మిత్రులు, ఇంకా ఇతర రంగాలలో వున్న మిత్రులు కలసి సుమారు నాలుగు నెలలుగా ఈ బృహత్ కార్యక్రమం చేపట్టి ఇంటర్నెట్ ద్వారా, ఇతర మార్గాల ద్వారా అందరి వివరాలు సేకరించగలిగారు. అందర్నీ ఒక త్రాటి మీదకు తీసుకురాగలిగారు. ఫలితంగా ఇంతమంది మిత్రులు పాతికేళ్ళ అనంతరం మళ్ళీ కలవబోతున్నారు.

ఆ అనుభూతి ఎంత మధురమో ముందరే నేను చవిచూసాను. మిత్రులు శరత్ చంద్ర గారికి ఈ సందర్భంలో కేవలం కలవడం, చిన్నప్పటి కబుర్లు చెప్పుకోవడం, విడిపోవడం మాత్రమే కాకుండా తమ చిన్నప్పటి మధుర స్మృతుల్ని శాశ్వతంగా పదిలపరచాలనే ఆలోచన వచ్చింది. వెంటనే నన్ను సంప్రదించారు. అప్పటి ఉపాధ్యాయుల,  మిత్రుల జ్ఞాపకాలను వారి చేతనే చెప్పించి రికార్డు చేసి డీవీడీలుగా తయారుచేసి మిత్రులందరికీ అందించడానికి ప్రణాళిక రూపొందించాం. ఆ మిత్రుల పట్టుదల  నాకు ఉత్సాహాన్నిచ్చింది. క్రిందటి నెలలో షూటింగ్ అనుకున్న రోజున విజయవాడ పరిసరాలు, హైదరాబాద్, చెన్నై లాంటి చోట్లనుండి సుమారు 30 మంది హాజరయ్యారు. అప్పటి ఉపాధ్యాయులు సుమారు 10 మంది హాజరయ్యారు. ఈనాటి కార్యక్రమానికి నాంది పలికిన ఆనాటి కార్యక్రమానికి హాజరయిన మిత్రుల ఆనందం వర్ణనాతీతం. అందులోను వారు చదువుకున్న పాఠశాలలో కలవడం వారి ఆనందాన్ని అవధులు దాటించింది. వాళ్ళు వయసు, హోదాలు అన్నీ మరచిపోయి మళ్ళీ ఆనాటి విద్యార్థి దశకు వెళ్ళిపోయారు. వారి సంతోషం చూసి తీరాల్సిందే ! వారికంటే ఎక్కువ అనుభూతి పొందినవారు, ఆనందించినవారు అప్పట్లో వారికి విద్యనందించిన ఉపాధ్యాయులు. 

మళ్ళీ వాళ్ళూ, ఇంకా మిగిలిన మిత్రులు తమ కుటుంబాలతో సహా ఈరోజు కలుస్తున్నారు. వారి చిన్ననాటి జ్ఞాపకాలను, అనుభూతుల్ని, అనుభవాల్ని, ముచ్చట్లను చిత్రీకరించే అవకాశం నాకిచ్చారు. అవన్నీ డాక్యుమెంటరీ లాగ పేర్చి, కూర్చి పదిలపరిచాను. ఈరోజు వారందరూ ఆ జ్ఞాపకాలమాలికను అందుకోబోతున్నారు. వారి జీవితకాలంలో ఆ జ్ఞాపకాల్ని  కేవలం మనసులో తలుచుకోవడంతో సరిబెట్టక తమ బాల్య మిత్రుల్నీ, తాము చదివిన పాఠశాలను కళ్ళెదుట నిలుపుకోవాలని మిత్రులు శరత్ చంద్ర ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నేను కార్యరూపంలో పెట్టాను.

భవిష్యత్తులో వాళ్ళే కాదు.... వారి పిల్లలు.... వారి మనుమలు కూడా ఈ జ్ఞాపకాల్ని పంచుకుంటారు. స్నేహబంధం లోని మాధుర్యాన్ని చవి చూస్తారు.  ఇదొక విచిత్రమైన, మధురమైన అనుభూతి. పాతికేళ్ళ తర్వాత ఒకే వేదిక పైకి రానున్న ఆ మిత్రులందరికీ శుభాకాంక్షలు.

Vol. No. 01 Pub. No. 348

Wednesday, April 28, 2010

మేడే కవిత్వోత్సవం

2010 మేడే రోజున విజయవాడలో కవిత్యోత్సవం జరుగబోతోంది. కవిత - 2009 సంకలనం కూడా ఆవిష్కృతమవుతోంది. ఆ వివరాలు ఇక్కడ.....................




ఇంకా స్పష్తర కావాలంటే ఇమేజ్ పైన క్లిక్ చెయ్యండి.

Vol. No. 01 Pub. No. 273a

Friday, February 26, 2010

అమెరికాలో ' రంగుటద్దాల కిటికీ '

ఆమధ్య ఆంధ్రాలో ' రంగుటద్దాల కిటికీ ' తెరుచుకుంది.
ఈమధ్య అమెరికాలో మళ్ళీ అదే ' రంగుటద్దాల కిటికీ ' తెరుచుకుంది.
మన బ్లాగు మిత్రులు కొత్తపాళీ నారాయణ స్వామి గారు రాసిన ఆ పుస్తకం అమెరికాలో ఆవిష్కృతమైంది.
ఆ విశేషాలు ప్రసారమైన TV9 దృశ్య శకలం మీరు కూడా ఒకసారి చూడండి.




Vol. No. 01 Pub. No. 209

Wednesday, February 24, 2010

సృజనాత్మక చిత్రాలు

మనలో చెలరేగే భావవ్యక్తీకరణకు మార్గాలెన్నో ! ఒక కవి తన భావాల్ని తన కవిత్వం ద్వారా, రచయిత కథలలాంటి రచనా ప్రక్రియల ద్వారా, సంగీతజ్ఞుడు తన సంగీతం ద్వారా, నటుడు తన నటన ద్వారా, శిల్పి తన శిల్పాల ద్వారా, చిత్రకారుడు తన చిత్రాల ద్వారా తెలియజేస్తారు. ఇందులో చిత్రలేఖన కళ విశిష్టమైనది. ఎందుకంటే పది పేజీలలో ఇమడ్చలేని భావాన్ని చిత్రకారుడు ఒక చిత్రంలో ఇమడ్చగలుగుతాడు. ఈ చిత్రలేఖనంలో నుంచి పుట్టుకొచ్చినదే చాయాచిత్ర కళ అదే ఫోటోగ్రఫి. ప్రస్తుతం ఈ కళ అత్యంత శక్తివంతమైన సమాచార సాధనం. సాంకేతికంగా అతి వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం డిజిటల్ ఫోటోగ్రఫి రాజ్యమేలుతోంది. అయితే డిజిటల్ గా ఎంత అభివృద్ధి చెందినా ఫిలింపై వచ్చే నాణ్యతను అధిగమించలేక పోతోంది.
ఆటో ఫోకస్ కెమెరాతోనో, డిజిటల్ కెమెరాతోనో ఏ విధమైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా కేవలం ఎయిమ్ అండ్ షూట్ అన్న పద్ధతిలో పుంఖాన పుంఖాలుగా ఫోటోలు తీసిపడెయ్యడం మనకు తెలుసు. అలాంటి మనకు హఠాత్తుగా ఒక ఎస్.ఎల్.ఆర్. కెమెరా ఇచ్చి ఏదో ఒక విషయం మీద ఫోటోలు తీసుకురమ్మంటే అవి సాగరసంగమం సినిమాను గుర్తుకుతెస్తాయేమో ! అలాంటి దశ నుండి ఇప్పుడిప్పుడే సాంకేతికాంశాలు నేర్చుకుంటున్నవారికి ఓ కెమెరా ఇచ్చి ఫోటోలు తీసుకుని రమ్మంటే..... వాళ్ళు తీసిన ఫోటోలకు వాళ్ళ చేతనే వ్యాఖ్యలను రాయించి, అవి ప్రదర్శనకు పెడితే...............
అదే జరిగింది నిన్న ( ఫిబ్రవరి 23 ), మొన్న ( ఫిబ్రవరి 24 ) విజయవాడ లో .............
ఆంధ్ర లయోలా కళాశాల విజువల్ కమ్యూనికేషన్స్ విభాగం వారు స్పార్క్స్ ' 10 పేరిట ఫోటోగ్రఫి ప్రదర్శన నిర్వహించారు. అందులో పాల్గొన్న వారు నిష్ణాతులైన ఫోటోగ్రాఫర్లేమీ కాదు. సాంకేతికాంశాలను ఔపోసన పట్టేసిన వారూ కాదు. ఇప్పుడిప్పుడే ఫోటోగ్రఫిలో ఓనమాలు దిద్దుతున్న విద్యార్థులు. ఆంధ్ర లయోలా కళాశాల లో విజువల్ కమ్యునికేషన్స్ విభాగంలో బి.ఎస్సీ. మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు. ఇప్పుడిప్పుడే ఈ రంగంలో అడుగుపెట్టిన విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసే ప్రయత్నంలో కళాశాల... వాళ్లకు కెమెరా ఇచ్చి ఫోటోలు తీసుకురమ్మని పంపించింది. అలా తీసిన వాటిల్లో మంచివి ఎన్నుకుని వాటికి సరిపడే వ్యాఖ్యలు వారిచేతనే రాయించి ప్రదర్శనకు ఉంచింది. ఎన్నుకున్న విషయానికి సంబంధించిన సబ్జెక్టు వెతుక్కోవడం ఒక ఎత్తైతే, వాటికి సరిపడే వ్యాఖ్య రాయడం మరో ఎత్తు. ఒక్కోసారి ఫోటో కంటే వ్యాఖ్యే మనల్ని ఎక్కువ ఆకర్షిస్తుంది. ఆలోచింపజేస్తుంది.
అవేమీ కళాఖండాలు కాకపోవచ్చు. కానీ ఇప్పుడే వికసిస్తున్న మొగ్గలు తీసినవి. వాళ్ళ లేత మేధకు అందిన అంశాలవి. దృశ్య మాధ్యమం ద్వారా సమాచార వ్యాప్తి చేసే క్రమంలో ఇది ఆ విద్యార్థుల తొలి అడుగు. వారిని ప్రోత్సహిస్తున్న కళాశాల యాజమాన్యానికి, వారికి నిర్దుష్టమైన మార్గాన్ని చూపుతున్న అధ్యాపక వర్గానికీ అభినందనలు. ఆ విద్యార్థుల కృషిని మీరు కూడా చూడండి........


కొసమెరుపు : ఈ విద్యార్థులలో మా అబ్బాయి కూడా ఒకడు.
Vol. No. 01 Pub. No. 207

Wednesday, January 13, 2010

సంక్రాంతికి బ్లాగు మిత్రుల కలయిక

ఈ రోజు సంక్రాంతి... పెద్ద పండుగ
వారం క్రితమే నాకు ఒక బ్లాగ్మిత్రుని నుండి మెయిల్ వచ్చింది సంక్రాంతికి వస్తున్నట్లు.
ఆయన ఎవరో కాదు ' సాహిత్య అభిమాని ' శివరామ ప్రసాద్ గారు.
అప్పటినుండి ఎదురు చూస్తున్నాను. చివరికి ఆరోజు రానే వచ్చింది.
ఈ రోజు సాయింత్రం గం. 4-00 లకు రాఘవయ్య పార్కులో కలుద్దామని శివ గారు నిన్ననే ఫోన్ చేసారు.
అలాగే పార్కుకి చేరుకున్నాను. మరోమిత్రుడు 'నవ్వులాట' శ్రీకాంత్ గారు తన వృత్తి పరమైన ఒత్తిడిలవల్ల కొంచెం ఆలస్యమవుతుందని ముందే చెప్పారు. కానీ ఆయన కంటే ముందు పిలవని అతిథిగా వర్షం వచ్చింది. దాంతో మిగిలిన మిత్రులు రాలేకపోయారు.
అయితే కొత్త విషయం ఏమిటంటే అక్కడ శివ గారిలో కొత్త కోణం చూసాను. ఆయన హామ్ రేడియో ఆపరేటర్. ఆయననే కాక ఆయన తోటి ఆపరేటర్లను కలుసుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం. అందులో మంచి మంచి హోదాలో రిటైరయిన వ్యక్తుల దగ్గర్నుంచి మంచి వృత్తి, వ్యాపారాల్లో ఉన్న వారి వరకూ చాలామంది ఉన్నారు.
హామ్ రేడియోకి సంబంధించి నా అనుభవం. సమాచార వ్యవస్థ ఇంతగా విస్తరించని రోజుల్ల్లో హామ్ రేడియోకి చాలా ప్రాధాన్యం ఉండేది. ముఖ్యంగా తుఫానులు, వరదలు, భూకంపాలు లాంటి ప్రకృతి భీభత్సాలు సంభవించినప్పుడు సమాచార వ్యవస్థ చిన్నాభిన్నం అయినపుడు అనేకమంది హామ్ రేడియో ఆపరేటర్లు అందించిన సేవలు నిరుపమానం. ముఖ్యంగా 1977 దివిసీమ ఉప్పెన, 1986 లో గోదావరికి భారీ వరదలు వచ్చి మా కోనసీమ ఒక దీవిగా మారిపోయినపుడు వారందించిన సేవలు నేను మరచిపోలేను. అలాంటి వారి పరిచయం కలగడం మన తోటి బ్లాగరు శివ గారి వల్ల సాధ్యమైంది. అందుకు ఆయనకు ధన్యవాదాలు. సమాచార సాంకేతిక అభివృద్ధిని వారు అంది పుచ్చుకుని పురోగమిస్తున్నారని వారి సంభాషణల వలన నాకర్థమైన విషయం.
కొంచెం వర్షం తగ్గాక అప్పటికే కాలాతీతం కావడం వలన, శ్రీకాంత్ గారి కోరిక మేరకు అక్కడికి దగ్గరలోనే ఉన్న ఆయన ఆఫీసులో కలిసాం. కాసేపు మన బ్లాగుల విషయాలు మాట్లాడుకున్నాక ఈ రోజు కార్యక్రమానికి వర్షం ఆడ్డంకిగా మారి కలిగించిన నిరాశ నుంచి బయిటపడిన హృదయాలతో సంతృప్తిగా విడిపోయాం.
ఈ రోజు మా చర్చల్లోకి వచ్చిన ఒక అంశం గూగుల్ అనువాద పరికరం గురించి. అది త్వరలోనే తెలుగులో రాబోతున్నట్లు నెట్ లో చదివిన విషయాన్ని నేను చెప్పాను. రెండురోజుల క్రితం అనుకుంటా ! బ్లాగరు.కామ్ లో కొత్త పోస్టు బాక్స్ లో అకస్మాత్తుగా మార్పు కనిపించింది. పని ఒత్తిడిల కారణంగా సమయాభావం వలన, మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలందించాలనే కంగారులో నేను గమనించలేదు గానీ మిత్రులు కొందరైనా గమనించే ఉంటారు. కొత్త పోస్టు బాక్స్ కొత్త లేఔటు లో ఒక కొత్త బటన్ కలిపాడు. అదే అనువాద బొత్తాము. కాకతాళీయంగా ఈ రోజు మామధ్య చర్చలో వచ్చిన అంశం గూగుల్ వాడు నిజం చేసేసాడు......
అన్నీ నేనే చెప్పెయ్యడం బాగుండదేమో ! మిగిలిన వివరాలు బహుశా శివగారు సచిత్రంగా అందిస్తారనుకుంటా ! వేచి చూద్దాం !
బ్లాగు మిత్రుల ముఖాముఖి కలయిక ఒక తీయని అనుభూతి. ఆ అనుభూతి మాకు తరచుగా దక్కడం మా అదృష్టం. మొన్న కొత్తపాళీ గారు. నిన్న ఇ-తెలుగు కార్యవర్గ సభ్యులు. ఈరోజు శివ గారు.
ఉత్తర, దక్షిణ భారతాల ప్రధాన కూడలి విజయవాడ. బ్లాగర్లకు కూడా కూడలిగా మారుతుందేమో ! ఇదొక మంచి పరిణామం అని నేననుకుంటున్నాను.

Vol. No. 01 Pub. No. 157

Sunday, January 3, 2010

విజయవాడలో e-తెలుగు


విజయవాడకు, తెలుగు పుస్తకానికి అవినాభావ సంబంధముంది. పుస్తక ప్రియులకు ఎంతో ఇష్టమైన ప్రదేశం విజయవాడ. తెలుగు ప్రచురణల రాజధాని. తెలుగు భాషలో ఎన్నో పుస్తకాలు ఇక్కడ ప్రచురించబడ్డాయి. ఎందరో రచయితల్ని పాఠకులకు పరిచయంచేసిన, దగ్గర చేసిన నగరం విజయవాడ.





అలాగే అనేక విషయాల మీద, అనేక అంశాల మీద దేశ విదేశీ ప్రచురణలను పరిచయం చేసే ఉద్దేశ్యంతో ఇరవై సంవత్సరాల క్రితం విజయవాడలో పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది.








21 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన ఈ పుస్తక ప్రదర్శనలోని ప్రతిభా వేదికపై 03-01-2010 ఆదివారం రోజున 'e- తెలుగు ' ఆధ్వర్యంలో కంప్యూటర్లో తెలుగు వాడకం గురించిన అవగాహనా సదస్సు నిర్వహించింది.







e- తెలుగు నిర్వాహకులు శ్రీ కశ్యప్ ( కబుర్లు ) కంప్యూటర్లో తెలుగు ఆవశ్యకతను వివరించారు. శ్రీ చక్రవర్తి ( భవదీయుడు ), శ్రీ సతీష్ కుమార్ ( సనాతన సారధి ) తెలుగు ఉపకరణాలు, వాటి వినియోగం, తెలుగులో బ్లాగ్ నిర్వహించడం గురించి సోదాహరణంగా వివరించారు.







ఈ సందర్భంగా ఇప్పటివరకూ ఆంగ్లంలో బ్లాగు నిర్వహిస్తున్న శివ అనే బ్లాగర్ తెలుగు రాయటం మీద తన సందేహాలను తీర్చుకుని తెలుగులో బ్లాగ్ ప్రారంభించడానికి చాలా ఆసక్తి కనబరిచారు.







ఆయ
నలాగే కంప్యూటర్ తెలుగుపై తమ సందేహాలను తీర్చుకున్న అనేకమంది ఆ వివరాలను పొందుబరచిన సి.డీ.లను, కరపత్రాలను అడిగి మరీ తీసుకోవడం కనిపించింది. అలాగే ఈ అంశంపైన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది.










ఈ కార్యక్రమములో e- తెలుగు నిర్వాహకులు శ్రీ కాశ్యప్, శ్రీ చక్రవర్తి, శ్రీ సతీష్, ఇంకా కొందరు e- తెలుగు సభ్యులతో బాటు విజయవాడ నుంచి నవ్వులాట శ్రీకాంత్, శిరాకదంబం, తెలుగుకళ పద్మకళ, జాగృతి ప్రసాద్ మొదలైన బ్లాగర్లు కూడా పాల్గొన్నారు.

కొస మెరుపు : ఈ అవగాహనా సదస్సు విజయవంతం అయిందనడానికి ఋజువు -
ఈ సభలో పాల్గొన్న వారిలో ఇంతకు ముందు బ్లాగ్ ల గురించి, కంప్యూటర్లో తెలుగు గురించి తెలియని సుమారు 12 మంది వరకు తెలుగులో బ్లాగ్ లను ప్రారంభించడానికి నిర్ణయం తీసుకోవడమే !

Vol. No. 01 Pub. No. 149