Showing posts with label వందన కదంబం. Show all posts
Showing posts with label వందన కదంబం. Show all posts

Friday, August 13, 2010

బ్లాగు లోకంలో తొలి అడుగు

బుడి బుడి నడకలు నేర్చుకున్నాకే పరుగెత్తడం నేర్చుకుంటారు
తప్పటడుగులు వేయడం వచ్చాకే తప్పుటడుగుల మర్మం తెలుసుకుంటారు
సుదీర్ఘ జీవన యానంలో ఒక సంవత్సర కాలం తక్కువేమీ కాదు
వెనుదిరిగి చూసుకుంటే సాధించినదేమిటో, సాధించాల్సింది ఏమిటో తెలుస్తుంది



ఈరోజు ఆగష్టు 14 వ తారీఖు
సరిగా సంవత్సరం క్రితం అనుకోకుండా ' శిరాకదంబం ' ప్రారంభమైంది
అందులో చెప్పడానికి, రాయడానికి చాలా కనిపించింది
నచ్చినవి, మెచ్చినవి, భద్రంగా దాచుకున్నవి బయిట పెట్టడం ప్రారంభించాను
ఎంత రాసినా తరగడం లేదు.. ఎంత రాసినా తృప్తి కలగడం లేదు
ఇంకా రాయాలి.. నా దగ్గరున్నవి, నాకు తెలిసినవి అన్నీ అందరికీ పంచాలి
అనుకుంటుండగానే సంవత్సరం గడిచిపోయింది

ఇంకెంతకాలం రాయగలనో... ఇంకెన్ని విషయాలు రాయగలనో...!
  
చదివేవాళ్ళు, మెచ్చుకునేవాళ్ళు, విమర్శించేవాళ్ళు, మొట్టికాయలు వేసే వాళ్ళు
............ ఇలా ఎంతోమంది కనిపించారు ఈ బ్లాగులోకంలో
అవును ఇదో లోకం
ఇందులో పడితే బయిట ప్రపంచం కనబడదు
కష్టాల, బాధల, అశాంతుల కేకలు వినిపించవు
మన లోకం మనది.... మన రాతలు మనవి
మనకి తెలిసింది రాస్తాం !..... మనకనిపించింది రాస్తాం !!

శిరాకదంబం గణాంకాలు -
సంవత్సర కాలంలో రాసిన మొత్తం టపాలు ( అనుబంధాలతో కూడా కలిపి ) - 376
సంవత్సర కాలంలో వచ్చిన వ్యాఖ్యలు
( టపాలతో సంబంధం లేనివి, నా జవాబులు, రిపీట్ అయినవి కాక )          - 761
శిరాకదంబం అభిమాన మిత్రులుగా చేరినవారు
( చేరకపోయినా అభిమానం కురిపిస్తున్నవారు అనేకమంది )                   -   20
శిరాకదంబం సందర్శకులు 
( బ్లాగులో ఉంచిన విడ్జెట్ ద్వారా మాత్రమే !  ఆది కూడా ప్రారంభించిన
నెల తర్వాత పెట్టినది. మిగిలిన లింక్ లలో విషయం తెలీదు )                   - 20928


' కళాకారులకు బలం ప్రేక్షకుల చప్పట్లే ' అన్నారు ఒక రచయిత
బ్లాగర్లకు వ్యాఖ్యలే బలం అంటున్నారు బ్లాగు మిత్రులు
ఆ వ్యాఖ్య మెచ్చుకోలైనా, విమర్శైనా, తిట్లయినా ఏవైనా
టపా రాసాక చకోర పక్షిలా బ్లాగరు ఎదురుచూసేది వ్యాఖ్యలకోసమే !

శిరాకదంబం లో తొలిసారి వ్యాఖ్యలు రాసినవారు
rayraj  గారు , నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి) గారు, భావన గారు
ఆది ఏడవ టపా - తెలుగు భాషను మనం పరిరక్షించుకోగలమా ? 
తొలి వ్యాఖ్యలు రాసిన ఈ ముగ్గురికీ ప్రత్యేక ధన్యవాదాలు. నిజానికి అప్పుడు వారు కొన్ని ప్రశ్నలేసారు. వాటికి అప్పుడు సరిగా సమాధానం చెప్పగలిగానో.. లేదో గానీ తెలుగు సంప్రదాయాల్ని, సంస్కృతినీ భావితరాలకు అందించే కార్యక్రమం చేపట్టాలనేది నా చిరకాల వాంఛ . అన్నీ వ్యాపారాత్మకమైపోయిన ఈ రోజుల్లో ఇది కష్ట సాధ్యమైన విషయమే ! అయినా ఏటికి ఎదురీదడం విశేషం గానీ వాలుకి కొట్టుకుపోవడం విశేషం కాదేమో ! అందుకే చాలాకాలంగా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. దానికి బ్లాగుల ద్వారా మిత్రులైన కొందరు ప్రోత్సాహం, సహకారం అందించడానికి ముందుకు వచ్చారు. అలాగే కొంతమంది చిన్ననాటి మిత్రులు సహకారం అందించడానికి ముందుకు వస్తున్నారు.  పూర్తిగా కార్యరూపం దాల్చాక వివరాలు ఇస్తాను. 

ఈ బ్లాగుల వల్ల కొత్తగా ఎంతోమంది మిత్రులను పొందగలిగాను. ఎన్నో భావాలు, ఉల్లాసాలు, ఉద్వేగాలు, ఉద్రేకాలు...మరికొన్ని విషాదాలు కూడా బ్లాగుల్లో చూసాను. అయితే నా అదృష్టం నాకు మంచి సలహాలు, సూచనలు ఇస్తూ ప్రోత్సహించే మిత్రులు ఈ బ్లాగులోకంలో లభించారు.... లభిస్తున్నారు. 

ఈ సంవత్సరంలో కొన్ని మధుర జ్ఞాపకాలు  -
1 . ' కొత్తపాళీ ' నారాయణస్వామి గారి ' రంగుటద్దాల కిటికీ ' పుస్తకావిష్కరణ సభలో పాల్గోవడం, అక్కడ ' తెలుగు పద్యం ' భైరవభట్ల కామేశ్వరరావు గారు, ' నవ్వులాట ' శ్రీకాంత్ గారు, ' తెలుగు కళ ' పద్మకళ గారు, తెలుగు భాషా వికాసానికి అవిరళ కృషి చేస్తున్న డిప్యూటీ కలెక్టర్  నూర్ రహమతుల్లా గారు మొదలైన వారి పరిచయ భాగ్యం లభించింది.
2 . జనవరిలో విజయవాడ పుస్తక ప్రదర్శనలో ఈ - తెలుగు డెమో నిర్వహణలో పాల్గోవడం, ఆ సందర్భంగా డి.ఎస్.కె. చక్రవర్తి గారు, కశ్యప గారు, సతీష్ గారు, ప్రసాద్ గారు మొదలైన బ్లాగర్లను కలవడం జరిగింది.
3 . సంక్రాంతికి ' సాహిత్య అభిమాని ' శివరామ ప్రసాద్ గారు విజయవాడ వచ్చిన సందర్భంలో కొంతమంది విజయవాడ బ్లాగర్లు కలవడం జరిగింది.

శిరాకదంబం అనే ఒక బ్లాగు వుందని అంతర్జాలంలో అందరికీ తెలియపరిచి తద్వారా కొంతమంది చదువరులను సంపాదించేందుకు దోహదపదడంలో కూడలి, హారం, మాలిక లాంటి బ్లాగు అగ్రిగేటర్లు, తెలుగు పీపుల్ డాట్ కామ్, ఇండ్యా రాక్స్, వెబ్ దునియా - తెలుగు లాంటి సైట్స్, పేస్ బుక్, ట్విట్టర్, గూగుల్ బజ్ లాంటి సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ పాత్ర మరువలేనిది.   

సంవత్సరం గడిచిందంటే బుడి బుడి నడకల స్థాయి నుంచి ధీమాగా తొలి అడుగు వేసే స్థితికి చేరుకున్నామనుకుంటాను. ఇన్నాళ్ళూ చేయి పట్టుకు నడిపించిన వారెందరో పేరు పేరునా చెప్పడం  కష్టమైనా సీనియర్ లూ, జూనియర్ లూ అనే తేడాలేకుండా బ్లాగు మిత్రులందరూ తమ సలహాలు, సూచనలతో శిరాకదంబం ను ప్రోత్సహిస్తూనే వున్నారు. ఇందులో కొంతమంది ఎక్కువ, కొంతమంది తక్కువ అని లెఖ్ఖలు చెప్పడం ఉచితం కాదనుకుంటాను. బ్లాగర్లే కాదు ఇతర మార్గాల ద్వారా చదవరులు కూడా శిరాకదంబం చూసి తమ అభిప్రాయాల్ని తెలుపుతూనే వున్నారు. ప్రోత్సహిస్తూనే వున్నారు. ఇలా శిరాకదంబం బలోపేతం కావడానికి దోహదపడుతున్న వారెందరో ................ అందరికీ శతకోటి వందనాలు. ముందు ముందు కూడా ఇలాగే మిత్రులందరూ తమ సలహాలు, సూచనలు, విమర్శలతో శిరాకదంబం ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ.............


Vol. No. 01 Pub. No. 374

Saturday, February 27, 2010

పదివేల వందనాలు

బ్లాగు మిత్రులు, వీక్షకులు అయిన శ్రేయోభిలాషులందరికీ పదివేల వందనకదంబాలు
ఈ నెల 14 వ తేదీతో బ్లాగు ప్రారంభించి ఆరునెలలు అయితే మరో పద్నాలుగు రోజులకు
అంటే నేటితో పదివేల హిట్లు పూర్తయ్యాయి. ఇందుకు కారణమైన అందరికీ పదివేల కృతజ్ఞతలు.







Vol. No. 01 Pub. No. 210

Monday, February 15, 2010

ఆరుమాసాల సహవాసం


శిరాకదంబం ప్రారంభించి నిన్నటికి ( 14 వతేదీ ) ఆరునెలలు గడచిపోయాయి. తెలుగులో బ్లాగులనేవి ప్రారంభమై చాలాకాలమైనా ఏడున్నర నెలల క్రితం వరకూ నేను అజ్ఞానంలోనే ఉండిపోయాను. నెలన్నర అధ్యయనం చేసి గత సంవత్సరం ( 2009 ) ఆగస్టు 14 వతేదీన నేను కూడా బ్లాగు ప్రారంభిస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చి, ప్రారంభించడం ఎలా అనేది పెద్దగా ఆలో్చన లేకుండా ప్రారంభించేసాను. తర్వాత ప్రశ్న ఏం రాయాలి ? మొదట్లో నా భావాలు రాసాను. తర్వాత నా పుస్తకాల ఖజానాలోని విశేషాలను అందించడం మొదలు పెట్టాను.

నా బ్లాగుకి మొదటి వ్యాఖ్య 7 వ టపాకు వచ్చింది. మొదటి వ్యాఖ్యాతలు రాయరాజ్ గారు, నరసింహ గారు, భావన గారు . తర్వాత నా రాతలు చదువుతూ వ్యాఖ్యానం చేసిన మిత్రులు చిలమకూరు విజయమోహన్ గారు, ధరణీ రాయ్ గారు, వినయ్ చక్రవర్తి గారు, కొత్తపాళీ గారు, రవిచంద్ర గారు, బోనగిరి గారు, శివ గారు, జయ గారు , సృజన గారు , మంచుపల్లకీ గారు, సుభద్ర గారు, తృష్ణ గారు, పద్మార్పిత గారు, బుజ్జి గారు, తెలుగు తూలిక మాలతి గారు, వెంకటరమణ గారు, శేఖర్ పెద్దగోపు గారు, మాలాకుమార్ గారు, అమ్మఒడి ఆదిలక్ష్మి గారు, భాస్కర రామిరెడ్డి గారు, వైద్య భూషణ్ గారు, వరూధిని గారు, హరేకృష్ణ గారు, చిన్ని గారు, శ్రీనిక గారు, నేదునూరి గారు, జ్యోతి గారు, ఆచార్య ఫణీంద్ర గారు, మురళీమోహన్ గారు, అప్పారావు శాస్త్రిగారు, సూర్యుడు గారు, ఉష గారు, ఫణి గారు, శిశిర గారు, వాసు గారు, కంది శంకరయ్య గారు, మాడీ గారు, కొత్త రవికిరణ్ ( పూలవాన ) గారు, జలసూత్రం గారు, పరిమళం గారు, నా యిష్టం గారు, వేణు శ్రీకాంత్ గారు, కార్తీక్ గారు, సంతోష్ గారు, నిషిగంధ గారు, సి.బి.రావు గారు, సునీత గారు, సందీప్ గారు, ఆదిత్య గారు, గిరిధర్ గారు, గొర్తి బ్రహ్మానందం గారు, గీతాచార్య గారు, రాజన్ గారు, కెక్యూబ్ వర్మ గారు, రావు గారు, ఊకదంపుడు గారు, సురేష్ బాబు గారు, నాయని ఆదిత్యమాధవ్ గారు, కె.కె. గారు, చెర్రీస్ వరల్డ్ గారు, మహీ గ్రాఫిక్స్ వారికి, సిరిసిరిమువ్వ గారు, రాజన్ గారు, రవి గారు, నాగప్రసాద్ గారు, చదువరి గారు, నాగబ్రహ్మారెడ్డి గారు, అశ్వినిశ్రీ గారు, భైరవభట్ల కామేశ్వర రావు గారు, నెలబాలుడు గారు, ప్రేరణ గారు, ఫణి యలమంచలి గారు, వినయ్ చాగంటి గారు, చంద్రలేఖ 45 గారు, రాజేంద్రకుమార్ దేవరపల్లి గారు, రావు ఎస్. లక్కరాజు, హర్ష గారు, రాంగోపాల్ గారు, ఆమ్రపాలి గారు, నిరంజన్ గారు, చెప్పుదెబ్బలు పూలదండలు గారు, మధురవాణి గారు, థింకర్ గారు, సురేష్ మ్యూజింగ్స్ గారు ఇంకా అనేకమంది అజ్ఞాతలు. వీరే కాకుండా నా బ్లాగులో వ్యాఖ్యానించకపోయినా స్వయంగా ఫోన్ లో వ్యాఖ్యలు అందించే నవ్వులాట శ్రీకాంత్ గారు, కొత్త రవికిరణ్ గారు....... ఇంతమంది ఇస్తున్న ప్రోత్సాహమనే టానిక్ తాగి నా బ్లాగు బలం పెరిగింది. నాకు తెలుసు. నా బ్లాగులో వ్యాఖ్యలు తక్కువే ! నేను కూడా టపా రాసాక దాని మీద మిత్రుల స్పందనకు ఎదురు చూస్తాను, కానీ ఏ వ్యాఖ్య రాకపోయినా నిరుత్సాహపడను. ఆ రకమైన టపా మిత్రులకు ఎందుకు నచ్చలేదని విశ్లేషించుకుంటాను. దానికి తార్కాణం. చిత్రవైభవం పేరుతో తెలుగు చిత్ర చరిత్రకు సంబంధించిన విశేషాలు ఒక వరుసలో సచిత్రంగా అందించటం ప్రారంభించాను. కానీ వాటికి అంతగా స్పందన రాలేదు. మరి అలా వరుసగా సీరియల్ లాగ ఇవ్వడం మిత్రులకు నచ్చలేదో లేక అంతాకానీ, కొంతకానీ అయ్యాక టోకుగా వ్యాఖ్యానించాలని ఆగారో అర్థం కాలేదు. ఆ విశేషాలను వేరొక పద్ధతిలో ఇస్తే ఎలాగుంటుందనిపించింది. ఏమైనా ఒక అర్థవంతమైన వ్యాఖ్య మనకి సరైన దిశా నిర్దే్శం చేస్తుందని నమ్ముతాను. నా రాతలకు మిత్రులిచ్చిన వ్యాఖ్యలన్నీ నా అదృష్టవశాత్తూ అర్థవంతమయినవే అనుకుంటున్నాను. ' మీ టపా బాగుంది ' అని రాసారని కాదు. మొహమాటానికో, మరో ప్రయోజనానికో కాకుండా హృదయ పూర్వకంగా చేసే మెచ్చుకోలు వ్యాఖ్య కూడా అర్థవంతమైనదే ! నా రాతలకు వచ్చిన కొద్ది మెచ్చుకోలు వ్యాఖ్యలు అలాంటివే అని నమ్ముతాను. అలాగే చాలా వ్యాఖ్యలలో విశ్లేషణలు కూడా ఉన్నాయి. నా రాతలు చదివిన వాళ్ళందరూ వ్యాఖ్యలు రాయాలని లేదు కదా ! రాత నచ్చినా వ్యాఖ్య రాయలేక పోవడానికి అనేక కారణాలుంటాయి. అయితే మన రాతలు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది మాత్రం వ్యాఖ్యలు తెలియజేస్తాయి. అవి తిరస్కారాలైనా, పురస్కారాలైనా !

ఈ సందర్భంగా మరోవిషయం. ఒక సోషల్ నెట్ వర్క్ లో పరిచయమైన ఒక మిత్రుడు సూటిగా నన్నో ప్రశ్న వేసాడు. మీరు బ్లాగెందుకు రాస్తున్నారు ? సమాజాని ఉద్ధరించడానికా లేక రచనల ద్వారా సమాజంలో మీకొక గుర్తింపు తెచ్చుకుందుకా ? అని. అతనికి నేనిచ్చిన సమాధానం. నా రాతల వల్ల సమాజాన్ని ఉద్ధరించగలననే అత్యాశ నాకు లేదు. నేను రచయితనో, కవినో, సంఘ సంస్కర్తనో కానని నాకు తెలుసు. నాకు తెలిసిన, నేను చదువుకున్న విషయాలు నా దగ్గరే దాచుకోకుండా పదిమందికీ చెబుదామని, ఏదైనా విషయం గురించో, సమస్య గురించో నాలో కలిగే భావాల్ని పదిమందితో పంచుకుందామని మాత్రమే రాస్తున్నాను. అవి కొంతమందికైనా నచ్చితే, ఆహ్లాదం కలిగిస్తే, ఉపయోగపడితే మంచిదే ! ఇక సమాజంలో గుర్తింపుకోసమైతే ఇప్పుడు దాని అవసరం నాకెంతవరకూ ఉందో నా ప్రొఫైల్ చూస్తే తెలుస్తుందన్నాను. పేరు తెచ్చుకునే అవకాశాలు నా చేతిలో పుష్కలంగా ఉన్న కాలంలోనే ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు అవసరమా ? అదీకాక పాపులర్ అవడానికి ప్లాట్ ఫాం ఇది కాదేమోననుకుంటాను. చాలా మార్గాలున్నాయి. ఆ మార్గాల్లో ప్రయత్నం చేస్తే పేరుతో బాటు, డబ్బు కూడా సంపాదించవచ్చేమో ! కానీ నాకా ఆశా, ఆసక్తి రెండూ లేవు. అందుకే పుస్తకాలు, మంచి స్నేహాలు తప్ప మరే ఆస్తి పాస్తులు లేవు.

బ్లాగ్లోకంలో ఆరునెలల సహవాసంలో ఎందరో కొత్త మిత్రులు పరిచయమయ్యారు. ఎన్నెన్నో భావాలు, అభిప్రాయాలు పరిచయమయ్యాయి. సహజంగా వివాదాలకు నేను దూరం. అందుకే వివాదాస్పద అంశాలకు కూడా దూరంగా ఉంటాను. వ్యక్తిగత దూషణలను, అభ్యంతకర వ్యాఖ్యాలను నేను సమర్థించలేను. అందుకే వాటికి దూరంగా ఉంటాను. అంతమాత్రం చేత ఆయా మిత్రులకు దూరమని కాదు. ఈ ఆరునెలలలోనే కొత్తపాళీ గారి పుస్తకావిష్కరణ సంబరంలోను, ఇ-తెలుగు వర్క్ షాప్ లోను పాల్గొనడం, సాహిత్య అభిమాని శివ గారితో కలయిక నాకెంతో ఆనందం కలిగించిన విషయం. రాబోయే కాలంలో బ్లాగు మిత్రులందరి భాగస్వామ్యం ఉండే శీర్షికలు నడపడానికి ప్రయత్నిస్తున్నాను. వాటికి మీ అందరి ప్రోత్సాహం మరింతగా ఉంటుందని, అలాగే తప్పుటడుగులు వేస్తే హెచ్చరికలు చేస్తుంటారని ఆశిస్తున్నాను.

మిత్రులందరికీ ' శిరాకదంబం ' అర్థవార్షికోత్సవం ( ఫిబ్రవరి 14 ) సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు.

Vol. No. 01 Pub. No. 198

Tuesday, November 10, 2009

వందన కదంబం

శతమంటే వంద. వంద పూర్తయ్యాక వందనం చెయ్యడం సాంప్రదాయం ! అందుకే మీకోసం..........

Tuesday, October 13, 2009

వందన కదంబం 2

బ్లాగు మిత్రులందరికీ మరో మారు వందనాలు
బ్లాగు అనే ప్రక్రియ ప్రారంభమయి చాలాకాలమైనా వృత్తి పరమైన కారణాలవలన ఇప్పటివరకూ ఇందులోకి తొంగి చూడలేక పోయాను. ఈ మధ్య ఖాళీగా ఉండే సమయం పెరిగి కొత్త ప్రాజెక్ట్ తయారీ పని ఈసారి కంప్యూటర్ మీద చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఎక్కువ సమయం దీంతో గడపడం వలన బ్లాగులని సందర్శించడం జరిగింది. పుస్తకాల మీద ముఖ్యంగా పత్రికల మీద ఉన్న మక్కువతో గత ముఫ్ఫై ఏళ్ళుగా దాచుకున్న ఎంతో విలువైన సమాచారాన్ని క్రోడీకరించే పని ఇంతకాలంగా చెయ్యలేక పోయాను. ఇటీవలే ఆ పని ప్రారంభించాను. నేను సేకరించిన సమాచారాన్ని అందరికీ పంచాలనే ఉద్దేశ్యంతో తొందరపడి బ్లాగు ప్రారంభించేసాను . తొందరపడి అని ఎందుకంటున్నానంటే సమాచారాన్ని క్రోదీకరించటం పూర్తయ్యాక మొదలుపెట్టి ఉంటే సమగ్రంగా, క్రమ పద్ధతిలో పెట్టి అందించేవాడిని . కానీ బండెడు పుస్తకాలంటారే అది నిజంగా నిజం. అతిశయోక్తి కాకుండా బండెడు పైనే ఉంటాయి నా దగ్గర . ఇంతకాలం తోచిన, లేదా అవసరమైన పుస్తకాలు వెతుక్కుని తీసుకోవడమే జరుగుతోంది. కానీ ఈ పని అనుకున్నంత సులువుగా అయ్యేటట్లు లేదు. అందుకే ఇంకా క్రమ పద్ధైతిలో అందించలేకపోయినా ప్రస్తుతం కొంతవరకే అందిస్తున్నాను . త్వరలో సమగ్రంగా అందిస్తాను అనడం అహంకారం అవుతుంది. అందుకని వీలైనంత సమగ్రంగా అందించే ప్రయత్నం చేస్తాను. ఒక్క విషయం. నేనందించే సమాచారం ఇదివరకే తెలిసున్న వాళ్లు మన బ్లాగర్లలో చాలా మంది ఉండవచ్చు నా రాతల్లో ఏమైనా లోపాలు, దిద్దుబాట్లు ఉంటే దయజేసి తెలియజెయ్యండి. వీలైనంతవరకూ సరైన సమాచారాన్ని తెలియని వారికి అందివ్వడానికి వీలవుతుంది.

                   రేపటితో నేను బ్లాగు ప్రారంభించి రెండు నెలలు పూర్తవుతాయి. ఈ రోజు వీక్షకుల సంఖ్య 1000 దాటింది.  రాశి పెరిగినందుకు సంతోషమే ! కానీ వాసి పెంచుకుని మరింతమంది వీక్షకుల్ని సంపాదించాలని నా చిన్న కోరిక. ఎంతవరకూ సఫలీకృతమవుతుందో ? నా బ్లాగు దర్శిస్తున్న మిత్రులందరికీ మరోసారి వందన కదంబం.

Friday, August 14, 2009

వందన కదంబం

అందరికీ వందనాలు !
తెలుగు బ్లాగ్ ప్రపంచంలో విభిన్న విషయాల సమాహారంగా ఈ కదంబాన్ని కూర్చాలనే సదుద్దేశ్యంతో ఈ బ్లాగ్ ప్రారంభిస్తున్నాను. సహ్రుదయులందరు తమ సూచనలు, సలహాలతో కదంబానికి మరింత సుగంధాన్ని అద్దుతారని అశిస్తూ ....
మీ
శిరా