Showing posts with label సాహిత్యం. Show all posts
Showing posts with label సాహిత్యం. Show all posts

Friday, July 30, 2010

జరీ అంచు తెల్లచీర


 జరీ అంచు తెల్లచీర, సామాన్యులకది అందని పండే ! అందులోను విశాలాక్షి లాంటి దిగువ మధ్య తరగతి అమ్మాయిలకైతే మరీను. ఎప్పుడో పదేళ్ళ క్రితం తనకు ఆరేళ్ళప్పుడు   సినిమా హాల్లో చూసింది, జరీ అంచు తెల్లచీరని. అప్పట్నుంచి ఆమె కలల్లో తళుక్కుమని ఆ చీర మెరవడం ప్రారంభమైంది.  ఆ కోరిక ఆమెతో బాటు పెరిగి పెద్దదయింది. అడిగితే నాన్న " చూద్దాంలే " అంటాడు. అమ్మ కష్టాలన్నీ ఏకరువు పెట్టి ఎలాగూ పెళ్లి చెయ్యాలి కదా అప్పుడు కొనుక్కోవచ్చులే అని ముగిస్తుంది.



.........................................................................................

"  ఎవ్వర్నీ ఏమీ అడగను " 
అని ఎన్నోసార్లు నిశ్చయించుకుంది విశాలాక్షి. 
ఫలానాది కావాలని ఎవర్నడిగినా వాళ్ళకుండే బాధలన్నీ వెళ్ళబుచ్చక తప్పదు.
వాళ్ళలా చెపుతుంటే ఇంకా బాధగా వుంటుంది విశాలాక్షికి. 

..........................................................................................

ఆడపిల్లకు పెళ్లి అవసరం దేనికి ?

..........................................................................................

కట్టుకుందికి గుడ్డముక్కా ! రెండు పూటలా ఇంత తిండీ, వీటికోసం ఆడపిల్ల పెళ్లి చేసుకోక తప్పదు.
తప్పదా !
-- తప్పకపోయినా సరే ! ముష్టయినా ఎత్తి బతుకుతాను గానీ పెళ్లి మాత్రం చేసుకోను.
పెళ్ళాడకపోతే నువ్వు ముష్టి ఎత్తవలసి వుంటుంది. నీకు డబ్బూ లేదు  ; చదువూ లేదు 
---- హావు న్నిజం !! 
ఈమెకి పాటయినా రాదు. ఈమె గుడ్డిదయినా కాదు. ఈమేకి శక్తయినా లేదు, మరి, లోకానికి దయన్నది లేదు.

.........................................................................................

ఆన్నయ్య ఫ్రెండ్ కనకారావు. వాడంటే విశాలాక్షికి చిరాకు. పిల్లను పెళ్లాడితే బాగుంటుందని తల్లి ఆశ.

........................................................................................

----- కనకారావునా నే పెళ్ళాడేది !!

.........................................................................................

ఇది విశాలాక్షి అభిప్రాయం.

........................................................................................


ఒక్క తెల్ల చీర .... నేతదే..... నూలుదే...... కానీ..... జరీ అంచుది ! 


........................................................................................


అది కూడా కొనుక్కోలేని, అన్నాతమ్ముడు చదువుకోవడానికి మంచి దీపం, పడుకోవడానికి మంచి మంచం, నాన్నకి అగ్గిపెట్టెలు  కొనుక్కోలేని తమ దీన పరిస్థితికి విశాలాక్షికి ఏడుపు వస్తోంది.

ఆరోజు విశాలాక్షి తండ్రి చీర కొనడానికి బజారుకెడదాం అన్నప్పుడు సహజంగానైతే ఎగిరి గెంతాలి విశాలాక్షి. కానీ ఆమెకు ఆస్పత్రి, రోగాలు గుర్తుకు వచ్చాయి.

.........................................................................................

.... ఈ రోజు సాయంకాలం ----
గోడవైపు తిరిగి కంటినీరు పెట్టడానికి కారణం అవన్నీ జ్ఞప్తికి రావడం కాదు.
ఇంకోటి కూడా వుంది.
అది ఉండబట్టే అవన్నీ స్పురణకు వచ్చాయి. 
అది......
రక్తం !
బజారుకి వెళ్దామన్న మనిషి బజార్లో ఇవ్వబోయేది డబ్బుకాదు. నెత్తురు.
అతని ముఖం చూస్తేనే తెలుస్తుందా విషయం.
రక్తం ధారపోస్తేనేగానీ తీరని కోరికలు నా కక్కరలేదు. 


.........................................................................................
 

.... అనుకుంది విశాలాక్షి. ఆమె చీర వద్దన్నా తండ్రి వినలేదు. బయిల్డేరదీసాడు.

........................................................................................

అతని దగ్గరున్నది పన్నెండు కాబోలు అంతకంటే ఎక్కువ మాత్రం కాదు. 
ఏ దుకాణంలో అడిగినా, కావలసిన, చీర కనీసపు ఖరీదు ఇరవై. 
షాపులు ఎక్కేరు, దిగేరు. 
అందులోను ఆఖరి షాపువాడు !
మరొక కనకారావు !
ఆ షాపు మొఖం చూస్తేనే వెళ్లాలనిపించలేదు. 
"  ఒద్దు నాన్నా ! అది గొప్ప షాపు " 
"  ఇంతదూరం వచ్చేం కదా ! పోయి చూద్దాం రా " 
షాపు వాడేకాదు కనకారావు, వాడి నౌఖర్లందరూ కూడా కనకారావులే !  

..........................................................................................

.... షాపు వాడి పలకరింపులో, మాటల్లో వెటకారం స్పష్టంగా కనిపించింది విశాలాక్షికి. చాలా ఇబ్బందిగా ఫీలయ్యింది.

.........................................................................................

...... ఇంతలో వాడు చీరలమేటిలోంచి పైకి.   
జరీ ! జరీ ! జరీ అంచు తెల్లచీర  
తాచుపాముని చూసినట్లు జడుసుకుంది విశాలాక్షి.
దూరంగా, దూరంగా, ఈ విషాన్ని దూరంగా తీసేయండి. 
"  ఎంతండీ ?  "
"  ఇరవై రెండు "
అతను జంకి జంకి, భయపడి భయపడి,
"  కొంచెం.....కొంచెం అయినా....తగ్గదంటారా ? "  అనేసరికి
"  ఇదేం శుక్రవారం సంత కాదు బేరాలాడ్డానికి "  అనే మాటలతో కొట్టాడు వాడు .   

..........................................................................................

 .... తండ్రి తక్కువ ఖరీదులో చూపించమన్నప్పుడు షాపులో వాళ్ళు కనీసం వెటకారంగానైనా నవ్వలేదు.

........................................................................................

"  నేవద్దంటే ఎందుకు విన్నావు కాదు నాయినా ! "

" అంత ఖరీదుంటాయనుకోలేదే "

నెత్తురే ఖరీదుగా ఇచ్చినా దొరకని వస్తువులు !

..........................................................................................
 
.... విశాలాక్షి నిరాశతో కొట్టుకుపోతోంది. ఏడుపు వస్తోంది.

..........................................................................................

అన్నయ్యకి ఫిజిక్స్ పాఠం అర్థం కాదు. తమ్ముడికి పదమూడో ఎక్కం చస్తే రాదు. అమ్మకి నిద్దర పట్టడం అనేది వుండదు. నాన్న అగ్గికోసం వెతుకుతూనే ఉంటాడు. చిన్నతమ్ముడు ఏడవక తప్పదు. ఈ వెలగలేని దీపం ఎంతోసేపు వెలగదు. 
---- నే నేడ్వను,
అనుకున్న విశాలాక్షికి మరింక ఆగకుండా ఏడుపు వస్తోంది.

.........................................................................................

ఇది మెరుపులేని మబ్బు. ఇది తెరిపిలేని ముసురు. ఇది ఎంతకీ తగ్గని ఎండ. ఇది ఎప్పటికీ తెల్లవారని చీకటి రాత్రి. ఇది గ్రీష్మం. ఇది శిశిరం. ఇది దగ్ధం చేసే దవాలనం. ఇది చుక్కల్ని రాల్చేసే నైరాశ్యం.----


ఒక్కటి ! ఒక్కటే సుమండీ ! ఒక్క జరీ అంచు తెల్లచీర !!


..........................................................................................

..... మధ్య తరగతి మిథ్యా ప్రపంచంలో కొట్టుమిట్టాడుతున్న సగటు ఆడపిల్ల మనస్తత్వం ఇది. అందరికీ కలలుంటాయి. కొందరికి అవి తీర్చుకునే అవకాశం, అదృష్టం వుంటాయి. కానీ మన సమాజంలో చాలామంది పరిస్థితి తమ కలల్ని నిజం చేసుకునే దారి లేక, వాటికోసం కన్నవారిని ఇబ్బంది పెట్టలేక నలిగిపోవడమే !

ఈ సత్యాన్ని ఆవిష్కరించిన ఈ ' జరీ అంచు తెల్లచీర ' రచయిత రావిశాస్త్రి గారు.  ఆయన జన్మదినం సందర్భంగా ఈ కథాపరిచయం.   

Vol. No. 01 Pub. No. 358

Thursday, March 18, 2010

కిలుం

" ఆడదాన్ని నలభైఏళ్ళు వచ్చేవరకూ శృంగారానికి పనికివచ్చే ఒక వస్తువుగా బాధించటమేకాదు. ఆ తర్వాత ఆమె పెట్టే బంగారు గుడ్డు కోసం కాపువాడిలా, సంఘంలో ప్రతి మగాడు కాపువేస్తాడు. కనీసం ఆ సంస్కృతి మన భారతదేశంలో లేదనుకుంటున్నాను. వయసు మళ్ళిన కొద్దీ, డబ్బు సంపాదిస్తున్న కొద్దీ అక్కడసలు రక్షణ లేదనిపిస్తుంది. అలాంటి నైతికమైన ఆలోచనకి మన సంస్కృతి, మన మతం, మన ఆచారాలు సహకరిస్తాయని నేననుకుంటున్నాను " అంది విమల.


కమల నోరు వెళ్ళబెట్టి చూస్తూండిపోయింది. అమెరికాలో స్త్రీ సంపూర్ణ స్వేఛ్ఛ అనుభవిస్తోందనీ, విడాకులు సులభంగా పొందుతోందనీ, పునర్వివాహం సులువుగా చేసుకోగలుగుతోందనీ, మరి ఇవన్నీ ఏమిటీ......అసలు సంస్కృతి అంటే ఏమిటీ ?

............................................................

దూరపు కొండలు నునుపు అనేది మనకు తెలిసిన విషయమే ! నాగరికత పెరిగింది. ప్రపంచమంతా మన ముంగిట్లోకి వచ్చేసింది. మనకి కావల్సిన దేశం యొక్క సంస్కృతి, ప్రజల జీవన విధానం, ఆచార వ్యవహారాలు ఏమిటో తెలుసుకోవడానికి గతంలోలాగ కష్టపడాల్సిన అవసరం లేదు. బ్రతుకుతెరువు కోసమని ఇతరదేశాలకు వలస పోతున్నా మన సంస్కృతి గొప్పదనాన్ని కాదనలేకపోవడానికి కారణాలు పాశ్చాత్య దేశాల్లో మృగ్యమైపోతున్న మానవత్వ విలువలు, విలువల్లేని మానవ సంబంధాలు; మన దేశంలో ఇంకా కొంతో గొప్పో అవి నిలిచి వుండటం. దశాబ్దం క్రితంనాటి పరిస్థితికి అద్దం పట్టే కథ అయినా ఇప్పటికి కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు లేదేమో l

కథా సంగ్రహానికి వస్తే............

కమల, విమల కవలపిల్లలు. విమలకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్న రాజాతో పెళ్ళి జరిగి అమెరికా వెళ్లిపోతుంది. అక్కడికి తీసుకెళ్ళాక ఆమెను హింసించి విడాకులిచ్చి మరొకామెను పెళ్లిచేసుకుంటాడు. అయినా విమల తిరిగి ఇండియా రాకుండా అక్కడే వుండిపోయి ఇరవై సంవత్సరాల తర్వాత వస్తుంది. ఈ ఇరవై సంవత్సరాలలో అమె ఆలోచనా సరళిలో వచ్చిన మార్పులు కమలను ఆశ్చర్య పరుస్తాయి.
నాస్తికురాలైన కమలకు విమలలో పెరిగిన భక్తి విస్మయం కలిగిస్తుంది గైనకాలజిస్టుగా ఇరవై ఏళ్ళు అమెరికాలాంటి అగ్రదేశంలో నిపుణత సంపాదించిన విమల ఇలా మాట్లాడటమే దీనికి కారణం.
" జీవితంలో దెబ్బ తిన్నప్పుడే కొన్ని విషయాలు అర్థమవుతాయి " అని చెబుతూ " రాజాతో దేశం కాని దేశంలో, మనుషులు కాని మనుషుల మథ్య నరకం అనుభవించే సమయంలో నన్నీ దేవుళ్ళే రక్షించారు. విష్ణుసహస్ర నామాలే ధైర్యాన్నిచ్చింది " అంటుంది విమల.
" అంతా నీ భ్రమ. నీకు మనుషులెవ్వరూ సాయం చెయ్యలేదా ? " అని అడిగిన కమలతో
" చేశారు. భౌతికంగా చేయూతనిచ్చి, ఆశ్రయం యిచ్చి ఆదుకున్నారు. కానీ మానసికంగా నేను కృంగిపోకుండా నన్ను ఈ దే్వుళ్ళే, నా యీ భారతీయ సంస్కృతే రక్షించింది " అంటింది విమల.
..................................................
" నిన్ను ఇన్ని బాధలు పెట్టిన రాజా ఈ సంస్కృతిలోంచి వచ్చిన వాడేనని మర్చిపోతున్నావా ? " అంటుంది కసిగా కమల.
" లేదు. ఎప్పుడూ మర్చిపోను. కానీ మగవాడు అనే మృగం, జాతి, మత, దేశ, కాలాలకి అతీతమని నాకు బాగా తెలుసు. కానీ నేను నేనుగా నిలద్రొక్కుకోడానికి నాకు దేవుడు అనే ఊహ ఆసరా అయింది. నాకు దేవుడున్నాడు " అని స్పష్టం చేస్తుంది.
................................................
" మతం పేరుతో ఎంత వ్యాపారం, ఎంత అత్యాచారం జరుగుతోందో తెలుసా ? " అని అడిగిన కమలతో
" దాన్ని నేను సమర్థించను. కానీ మానవత్వం పేరుతో అంతకంటే తక్కువేం జరగటంలేదు " అని విమల అనడంటో కమల వులిక్కిపడుతుంది.

నీళ్లకాగులో నానబెట్టిన విగ్రహాలను చూసిన కమల ' చెల్లాయి నమ్మిన దేవుళ్లకి కిలుం పడితే చింతపండు పులుసులో నానబెట్టింది తోమడానికి. తను నమ్మిన మనుష్యులకి పట్టిన కిలుం వదిలించాలంటే ఈ విశ్వమంత గంగాళంలో ఏమి వేసి తోమాలి ? ' అని గందరగోళంలో పడిపోతుంది.

క్లుప్తంగా కథా సంగ్రహమిదే !
కమల కనబడని దేవుళ్లకంటే కనబడే మనుష్యులే నిజమని నమ్మింది. విమల తన పరిస్థితుల ప్రభావం నుంచి బయిటపడటానికి దేవుణ్ణి ఆసరాగా చేసుకుంది. నిజమే విగ్రహాలరూపంలో వున్న దేవుళ్ళకు పట్టిన కిలుం వదిలించడం తేలికే ! కానీ మనుష్యుల మనసులకు పట్టిన కిలుం వదిలించడం తేలికైన పనేనా ?

1996 లో ఈ కథను ఓ ప్రముఖ రచయిత్రి రాసారు. ఉదహరించిన సంభాషణలలో శైలి ద్వారా ఆమె ఎవరో కనుక్కోవడం సులువేననుకుంటాను. ప్రయత్నించండి.

నేనే చెబుతాను. రచయిత్రి శ్రీమతి ఇంద్రగంటి జానకీబాల

Vol. No. 01 Pub. No. 229

Sunday, February 21, 2010

కృష్ణదేవరాయని కరుణ కృత్యం - 2

( 201 టపా తరువాయి )........  అంతే స్వరూపిణి తెర తొలగించుకుని బయిటకు వస్తుంది.  అతను తన తలపాగా తొలగిస్తాడు. అతన్ని చూసి ఖంగారు పడుతుంది.......
అతణ్ణి గతంలో నదీతీరాన కనబడే తన ఆరాధకుడు షామరాజుగా గుర్తిస్తుంది. అతడ్ని చూసి బాధపడుతుంది. తానొక బానిసగా అక్కడ ఉన్నానంటుంది. కాదు రాయలవారితో సహా మేమందరం నీ సౌందర్యానికి బానిసలమంటాడతను. తన చుట్టూ శిలలున్నాయని, అసలు తానే ఒక శిలనైపోయానని అన్న ఆమెతో.....

ఆ శిలలలోని ప్రాచీనం నువ్వు సంపాదించుకున్నావు. సంధ్యాసమయాల సుకుమారమైన ఎరుపు నీది, వెన్నెల బరువుని మొయ్యలేక భయపడి పరుగులెత్తే కెరటాల నురుగు చాంచల్యం నీ కళ్ళది. చీకటి అడవుల పవిత్ర ప్రశాంతం నీలో వుంది. అనిశ్చలత్వ, వక్షోభారం మొయ్యలేక ముక్కలుగా విరిగిపడే ఆ నడుం- అన్నీ శిలాకారంగా ఏనాడో మార్చాను.

అంటాడతను. అంతటి ప్రేమను ఇంతకాలం దాచుకుని ఇప్పుడు చెబుతున్నావు, అప్పుడే ఎందుకు చెప్పలేదని అడుగుతుంది.

నాది వాంఛ కాదు. నోరులేని ప్రేమ. నాకేమీ అక్కర్లేకపోయింది. నువ్వు యీ మేఘాల మాదిరి, ఆ నదిలో కెరటాల మాదిరి మార్పులేక, ఆ కొండల మాదిరి, నక్షత్రాల మాదిరి మార్పులేక నశింపులేక, శాశ్వతంగా యీ లోకంలోనే వుంటావనుకునేవాణ్ణి. తరువాత అది ' భ్రమ ' అని తెలుసుకున్నా. ఏదో వెర్రి నమ్మకం. నువ్వెక్కడున్నా, ఎట్లా వున్నా నాదానవనేననుకుని తృప్తి పడేవాణ్ణి. ఈ గాలి మనిద్దరికోసం, సూర్యచంద్రాదులు మనకోసం - అదీ భ్రమే. 
అంటాడతను. మరి అంతగా సుఖపెట్టే ఆ భ్రమను వదులుకుని ఇప్పుడిలా వచ్చి తననెందుకు బాధపెడతావని ప్రశ్నిస్తుంది. ఆమె కోరిక మీద తన గాథ వివరిస్తాడు. విలువిద్యనేర్చుకుని రాయల సైన్యంలో చేరిన అతను ఉదయగిరి ముట్టడిలో పాల్గొంటాడు. ఆ దుర్గాధ్యక్షుడితో బాటు అతని మేనత్తను కూడా చెరబడతాడు కృష్ణదేవరాయలు. ఆమెను ఆ చెరనుండి విడిపించడం కోసం తిరుగుతుంటే స్వరూపిణి కళ్ళబడిందని చెబుతాడు. ఆమెని విడిపించాలనే పట్టుదల నీకెందుకని ప్రశ్నిస్తుంది స్వరూపిణి. దానికతను....

ఆమె సుశీల. చాలా అందమైనది. అందమైన యే వస్తువు ఖైదులో వున్నా నా ప్రాణం జిల్లార్చుకుపోతుంది. సూర్యచంద్రాదులనూ, గాలినీ సముద్ర కెరటాలనీ ఎవరు బంధించగలరు ? వాటినేనా అందరూ సమంగా అనుభవించేటట్లు చెయ్యడం దేవుడు చేసిన వొక మంచికార్యం. 

అని వివరిస్తాడు. అంతేకాదు. మూడు ఆలయాల్లో స్వరూపిణి ప్రతిమలను చెక్కినట్లు చెబుతాడు. ఆమె భయపడుతుంది. రాయలవారు గుర్తుపడితే ప్రమాదమంటుంది.   ఏమీ కాదు అంత అందమైన స్త్రీ తన స్వంతమని రాయలవారు గర్విస్తాడంటాడతను. అతనిక్కడికి వచ్చినట్లు తెలిస్తే రాయలవారు ప్రాణాలు తీస్తారని వెంటనే వెళ్ళిపొమ్మని బ్రతిమాలుతుంది. దానికతను..............

నువ్వు నాకు మల్లే తెగించి, యివన్నీ వొదులుకుని వొచ్చేస్తావని నేను కలలో కూడా అనుకోలేదు. నిన్ను కోరిన పురుషులు యీ నగరంలొనే బోలెడుమంది వుండొచ్చు. కానీ వాళ్ళు నాకుమల్లే వారి గౌరవాలనూ, ప్రాణాలనూ త్యాగం చెయ్యడానికి సిద్ధంగా వుండలేరు. నేను నిన్ను కోరి సఫలీకృతం చేసుకోవడంలో నా మృత్యువు వుందని నాకు తెలుసు. నూరేండ్ల ముసలి వృథా బ్రతుకుకంటే వొక క్షణం మహత్తర ఆశాజ్వాలలో మండి బూడిదవడం వెయ్యిరెట్లు మేలని నా అనుభవం శాసిస్తూనే వుంది. నన్ను పొమ్మంటావు. ఎక్కడికి పోనూ ? 
ఇలా ఇద్దరిమధ్యా చాలాసేపు వాగ్వివాదం సాగుతుంది. ఆమె ఎంత బ్రతిమాలినా షామరాజు వినడు. ఆనందంగా మరణాన్ని ఆహ్వానిస్తానని, చివరగా తనకోసం ఒక్కసారి నాట్యం చెయ్యమనీ కోరుతాడు. అతని అభ్యర్థన కాదనలేక నాట్యం మొదలుపెడుతుంది స్వరూపిణి. ఇంతలో రాయలవారు అక్కడికి వేంచేస్తున్నట్లు సమాచారం తెస్తుంది చిట్టి. ఊహించని యీ పరిణామానికి బిత్తరపోతుంది స్వరూపిణి. షామరాజుని పారిపొ్మ్మని తొందరబెడుతుంది.

నిన్ను చూసి విప్పుకున్న కళ్ళని మళ్ళా యీ పాడులోకంమీద ఎట్లా వాల్చను ?
అని అడుగుతాడతను. ఆ పని చెయ్యలేకపోతే విషం తాగడమొకటే మార్గమంటుంది. ఆనందంగా విషం తీసుకుంటాడు. అతనికి తుది వీడ్కోలు చెబుతూ స్వరూప ముందుగదిలోకి వెడుతుంది. రాయలవారు వస్తారు. విఠలాలయంలో చూసిన ప్రతిమ స్వరూపిణి రూపాన్ని పోలియుండడం రామలింగడు గుర్తించి చెప్పినట్లు చెబుతారు. ఆ విషయం నిర్థారించుకోవడానికే అక్కడికి ఆమెను తీసుకెళ్ళాలని నిర్ణయించినట్లు తెలియజేస్తారు. బయిల్దేరమంటారు. రాయలవారి ధోరణిని బట్టి ఇక తప్పదని అర్థం చేసుకుంటుంది స్వరూపిణి. బయిల్దేరుతుంది. రాణీవాస అలంకరణలేమీ లేకుండా రావడానికి రాయలవారు వప్పుకోరు. అలంకరణ కోసం ఆమెను బలవంతంగా లోపలకు తీసుకెడతారు.
ఆయనకు అక్కడ పడివున్న షామరాజు దేహం కనబడుతుంది. ఎవరని అడుగుతారు. ఏం చెప్పాలో తెలియక ఒక ఖైదీ అని చెబుతుంది. ఆమెకు ఎప్పుడూ అత్తరులు పంపించే ఫెరిస్టాఖాన్ పంపిన విషాన్ని పరీక్షించడానికి ఆ ఖైదీని తెప్పించినట్లు, అతనిచేత తాగించగానే మరణించినట్లు చెబుతుంది. రాయలవారు అతన్ని చూసి జాలిపడతారు. స్వరూపిణి తట్టుకోలేకపోతుంది. ఎంతోసేపు నిజాన్ని దాచలేకపోతుంది. అతను తన స్నేహితుడని, తనని చూడడానికి వచ్చి సాహసం చేసాడని, మీరొస్తున్నారని తెలిసి వెళ్ళిపొమ్మంటే వెళ్లలేదని, అందుకే విషం ఇచ్చినట్లు చెబుతుంది. అంతేకాదు. అతను తనని ప్రేమించిన విషయం కూడా చెప్పేస్తుంది. దానికి రాయలవారు

పిచ్చివాడు ! నాతో చెబితే నిన్ను అతని వెంట పంపి వుందునుగా. నీది కఠిన హృదయం.
అనగానే స్వరూపిణి

మీదీ అంతే. ఇన్ని సంవత్సరాల నుంచి నన్నిక్కడ బంధించారు. దాస్యమే స్వర్గమనుకున్నాను. మీకు హృదయం లేదు.

అంటుంది.
ప్రేమించిన వాణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపిన నీకే హృదయం లేదని నిందిస్తారు రాయలవారు. వాదనలో ఆయన పుట్టుకను గురించి నిలదీస్తుంది. అంతే. రాయలవారికి ఆగ్రహమొస్తుంది. తన తల్లి దాసీది కాదని, సాగివారి ఆడపడుచని అంటారు. రాజుకి కొందరు భార్యలు, స్త్రీలు ఉండటం సాంప్రదాయమని, అయితే వారందరూ మహాపతివ్రతలనుకునేంత మూర్ఖుణ్ణి కాననీ అంటారు. తన ప్రతిమల్ని స్థంభాలకెక్కించినది కూడా అతనేనని చెబుతుంది స్వరూపిణి. రాయలవారు ఆశ్చర్యపోతారు. అంత గొప్ప శిల్పినీ, అతనిలోని అద్భుతమైన కళని ఆమె అందం బలిగోరిందని బాధపడతారు. అంతేకాదు. ఆమె అంత:పురంలో బందీకాదని అక్కడ వుండడానికీ, వెళ్ళిపోవడానికీ అమెకు స్వేచ్చ వుందంటూ....

ఇది బందిఖానా అంటూ ఏదో గొణిగావు మొదట్లో. నీకొక్కదానికే కాదు యీ సంకెళ్ళు. మనందరినీ యీ ప్రపంచం బంధించింది. కిరీటం నన్ను, స్వార్థం నిన్ను, కళ అతన్ని, ఆకృతి రాళ్ళనీ, చీకటి వెలుగునీ, సంస్థలు సంఘాన్నీ, ప్రేమ మానవ హృదయాన్నీ సంకెళ్ళతో సాకుతాయి. ఇదుగో ఈ సంకెళ్ళు చప్పుడు కాకుండా చూసే బాధ్యత మనదీ - బాధ్యత నాదీ...
అంటూ బయిటకు వెళ్ళిపోతారు. రాయలవారి వ్యక్తిత్వం ముందు తన ప్రేమ వెలవెలబోవడం గమనించి తన జీవితం వ్యర్థమనుకుంటుంది స్వరూపిణీదేవి. అక్కడేవున్న విషకలశం తీసుకుని నిర్జీవంగావున్న షామరాజు దగ్గరకు వెడుతుంది. కలశం ఎత్తి త్రాగబోతుండగా అతను దిగ్గున లేచి ఆమె చేతిలోని కలశాన్ని లాక్కుంటాడు. స్వరూపిణి ఆశ్చర్యపోతుంది. తాను నిజంగా విషం త్రాగలేదని, నటించానని చెబుతాడు. రాయలవారి ఔదార్యాన్ని, ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని మెచ్చుకుంటాడు. ఎందుకీ సాహసం చేసావని అడుగుతుంది స్వరూపిణి.

నేను ప్రాణాలమీద ఆశ ఎల్లానూ వొదులుకున్నా. కానీ, చూద్దాం ఏం జరుగుతుందోనని విషం పారబోసి - చిట్టికి తెలుసు - చచ్చినవాడికిమల్లే పరున్నాను. రాయలకి ఎంత దయ ? ఎంత ఆదరణ ? మనం బైటికి పోదాం. పద గ్రహణ స్నానం చేద్దాం. ఆమట్టున మావూరు...

అని బయిల్దేరదీస్తాడు. చిట్టి కూడా వారిని అనుసరిస్తుంది.
**********************




క్రీ.శ. 1512 వ సంవత్సరంలో జరిగినట్లుగా చెప్పబడే యీ కథను నాటికగా అద్భుతమైన శిల్పంతో, పదునైన సంభాషణలతో తీర్చిదిద్దారు బుచ్చిబాబు. 1944 లో ' భారతి ' లో ప్రచురణ తర్వాత కొన్నాళ్ళకు మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుంచి ప్రసారమైంది.

 

                          మిత్రులకు విన్నపం

' మల్లీశ్వరి ' చిత్రకథకూ, యీ కథకూ పూర్తి స్వామ్యం లేకపోయినా కొన్ని పోలికలు మాత్రం స్పష్టంగా కనబడతాయి. అందుకే ఆ కథ రూపకల్పనకు యీ నాటికే బీజమయినట్లు చెబుతారేమో ! ఏమైనా బుచ్చిబాబు రచనా పటిమకు యీ నాటికలోని సంభాషణలే సాక్ష్యం.

ఇది కేవలం పరిచయం మాత్రమే ! ఆ క్రమంలోనే నాటికలోని ముఖ్యమైన సంభాషణలను ఇవ్వడం జరిగింది. ఇవి బుచ్చిబాబు గారి రచనా వైశిస్ట్యాన్ని తెలియజేసేందుకు ఉపయోగిస్తాయనుకుంటాను. ఈ రచన ఇదివరలో చదివిన వారు గానీ, ఆకాశవాణి నాటికను విన్నవారు గానీ బ్లాగు మిత్రులలో గానీ, వారి పరిచయస్థులలో గానీ, ఇతర చదవరులలో గానీ ఎవరైనా ఉంటే వారి స్పందననూ, అనుభూతిని తెలియజేస్తే బాగుంటుంది. అలాగే యీ పరిచయాన్ని చదివాక 'మల్లీశ్వరి' కథకూ, యీ కథకూ గల పోలికల్ని గురించి మిత్రులు తమ విశ్లేషణలను, స్పందనను తెలియజేయగలరు. ఈ టపాలోనే వ్యాఖ్యలరూపంలోగానీ, విడిగా నా ఇ-మెయిల్ కు గానీ పంపండి.
నా e-mail : srcrao@hotmail.com  

Vol. No. 01 Pub. No. 205

Wednesday, February 17, 2010

కృష్ణదేవరాయని కరుణ కృత్యం - 1

శ్రీకృష్ణదేవరాయుల కాలం స్వర్ణయుగంగా మన చరిత్ర అభివర్ణిస్తోంది. వజ్రాలు, రత్నాలు మొదలైనవి రాశులుగా పోసి అమ్మేవారని అంటారు. వాటిమాటెలావున్నా రాయలవారి కాలంనాటివని చెప్పుకునే కథలెన్నో ప్రచారంలో వున్నాయి. వాటిలో నిజమైనవి ఏవో, ఊహాజనితమైనవి ఏవో చెప్పటం చాలా కష్టం. అలాంటి ఒక కథే మన  తెలుగు చలనచిత్ర చరిత్రలో మరుపురాని మధుర కావ్యంగా నిలిచిపోయిన స్వర్గీయ బి.ఎన్. రెడ్డిగారి ' మల్లీశ్వరి ' . ఆ చిత్రకథ రూపకల్పనకు బీజంగా చెప్పుకునే నాటిక ' కృష్ణదేవరాయని కరుణకృత్యం ' . తెలుగు సాహిత్యంలో బుచ్చిబాబుగా ప్రసిద్ధికెక్కిన శివరాజు వేంకట సుబ్బారావు గారు రాసిన ఈ నాటిక 1944 మే నెల ' భారతి ' మాస పత్రికలో ప్రచురించబడింది. ఆ నాటిక పరిచయం...........................

ఆ నాటిక ముందుమాటలో బుచ్చిబాబు ఇలా అంటారు.
విజయనగర సామ్రాజ్యాన్ని గురించి చాలా గ్రంథాలు చదివినా, గ్రంథకర్తలు ఆనాటి శిల్పాన్ని గురించి చరిత్రాత్మకంగా, మిగతా దేశాలలోని శిల్పాలతో పోల్చి వ్రాయడం తప్ప ఆ శిల్పులను గురించి వొక్క విషయం కూడా చెప్పరు. వాళ్ళు ఎట్ల్లాంటి వ్యక్తులు, ఎక్కడ నేర్చుకున్నారు, వాళ్ళ వేతనాలెంత మొదలైన జీవితాలకి సంబంధించిన విషయాలేవీ కనిపించలేదు.  సామ్రాజ్యం పోయింది. కొన్ని శిల్పాలు మాత్రం మిగిలాయి. ఆనాటి వాతావరణాన్ని సృష్టించి, వొక శిల్పి ఆంతరంగిక జీవితాన్ని ప్రదర్శించి చూపుదామన్న సంకల్పానికి యీ నాటిక ఫలితం. 
ఆంధ్రోత్పత్తి, కర్ణాటకవాదాలతో దీనికి నిమిత్తం లేదు. ఈ నాటికలో జరిగిన విషయాలకి చరిత్రలో ఆధారం లేదు. కాని అవి అసంభవం కాదు. మొదట కృష్ణ్దదేవరాయలని  వివాహమాడటానికి అంగీకరించని ముదుగల్లు కన్య ' నేహాల్ ' కథ ఫెరిష్టా వ్రాశాడు. ఆమెలాంటి స్త్రీ, తిమ్మరసు లాంటి పురుషుడు వున్నకాలాలలో యిట్లాంటి వ్యక్తులుండటం అసహజం కాదు.        

ఇక కథాక్రమంలోకి వస్తే శ్రీకృష్ణదేవరాయుల జనానాలో స్వరూపిణీదేవి కూడా ఒక రాణి. ఆవిడకొక చెలికత్తె చిట్టి. స్వరూపిణి రాణివాసంలో చేరిన అయిదు సంవత్సరాల కాలంలో రాయలవారు ఆమె వద్దకొచ్చింది కేవలం ఒక్కసారే !
ఈ అయిదు సంవత్సరాలలో ఆమె అడుగు బయిట పెట్టలేదు. అందుకే అంటుంది................

నేను చిన్నప్పుడు చిలకల్ని పంజరంలో బంధించి పెంచుకున్నాను. నా పాపం వూరికే పోతుందా ! హజారి రాముడు నన్నిందులో బంధించాడు.

తన అందం అడవిగాచిన వెన్నెల అయిపోతోందని ఆమె ఆవేదన.  తన చెలి చిట్టితో అంటుంది..................

నా సౌందర్యానికి విలువ లేదే ! ఏకాకిగా అరణ్యంలో వుండే యోగి మంచితనానికి ఎంత విలువ వుందో నా అందానికీ అంతే ! ఒసే, ఒక విశేషం చెబుతా విను. జీవితం అంటే కంబళి మీద శయ్య కాదు. కత్తి మీద సాము. రాజుగారి కిరీటంలో మణిగా వెలిగినప్పుడే నా అందం మెరిసిపోతుంది. 

ఆ రోజు చంద్రగ్రహణం. తన భర్తతో కలసి నదీస్నానానికి వెళ్ళాలని స్త్రీ సహజమైన కోరిక ఆమెది. ఆయన ఉనికిని గురించి వాకబు చేసిన చిట్టి ఆయన విఠలాలయాన్ని చూడటానికి వెళ్ళారని చెబుతూ ఆ ఆలయంలోని శిల్ప సౌందర్యాన్ని వర్ణిస్తుంది. 

రాజుగారు కటకాధిపతిగార్ని జయించి వొచ్చింతర్వాత విజయసౌధాన్ని కట్టించారు. చూశారూ ? ........ నేను మొన్న అల్లా వెడ్తుంటే - అందరూ దాన్ని చూస్తో నిలబడ్డారు. నేనూ వెళ్ళాను. అందులో వెనుక రెండు ఆడబొమ్మలు రాళ్లమీద చెక్కి వున్నాయండి. నమ్మండి. నమ్మకపొండి - అచ్చం మీలాగే వున్నాయండి. ఆ సన్నటి నడుం. గుండ్రటి భుజాలు. ఆ ముక్కు అంతా మీరే. 

వారి సంభాషణ క్రమంగా చిన్ననాటి తీపి జ్ఞాపకాలమీదకు వెడుతుంది. తన అనుభవాన్ని వర్ణిస్తూ స్వరూపిణీదేవి...  

మా వీధి చివర వీరపాంచాలుల గుడిసెలుండేవి. ఓ గొర్రెల కాపరి వుండేవాడే. నేను నదికి నీళ్ళకి వెళ్ళే సమయానికే వాడూ మందలతో చక్కా వొచ్చేవాడు. ఆ గట్టున కూర్చుని నన్నే చూస్తూ వుండేవాడు. ఇల్లా రెండు నెలలు. ఏమీ మాట్లాడేవాడు కాడు సుమా. నాకన్నీ జ్ఞాపకం వొస్తున్నాయి. నల్లగా వుండేవాడు. నల్లగా అంటే ఎట్లాగనుకున్నావు ? వెన్నెల తాలూకు మెత్తని, పల్చని నలుపు. భుజాలూ - అవీ కండలు తిరిగి వుండేవాడు....................
నేనిక్కడికి వొచ్చేస్తున్నానని వాడుకెట్లా తెలిసిందో - రోజూ మా యింటిముందు అరుగు కింద నిలబడి, కిటికీలోంచి నేను నాట్యం నేర్చుకుంటూంటే చూస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో మందేశ్వర శర్మ నాకు నాట్యం నేర్పేవాడులే. నాకు వాణ్ణి చూడగానే సిగ్గువచ్చి పాట నిలిపి ఆగిపొయ్యేదాన్ని. 

స్వరూపిణి నాట్యం గురించి విన్న చిట్టి అడుగుతుంది అమాయకంగా ఇక్కడ ఎప్పుడూ నాట్యమెందుకు చెయ్యలేదని. అంతే స్వరూపిణిని నిస్పృహ ఆవహిస్తుంది. 

నన్ను చెయ్యమని అడిగేవాడు లేందే ? నే నీ నాట్యంతో రాయలని ఆకర్షించాలట. రాణీవాసం వొచ్చింతర్వాత నాట్యం నాగలోకానికి వెళ్ళింది. శుద్ధాంతంలో పడ్దతర్వాత నా శక్తులన్నీ శిలలుగా మారిపొయ్యాయి. 

ఇలా ముచ్చట్లాడుకుంటున్న సమయంలో కిటికీలోంచి ఒక బాణమొచ్చి వారిముందు పడుతుంది. దానికో కాగితం గుచ్చి ఉంటుంది. అందులో................................

 " నువ్వు రాణివని నాకు తెలుసు. నేను సాధారణ మనిషిని. నిన్ను దూరం నుంచి చాలాకాలం ఆరాధించాను - కీటకం నక్షత్రాన్ని ఆశించినట్లు. ఈ జీవితంలో నేను చెయ్యగల పని చేశాను. ఇప్పుడు నాకు నీతో వొక గంటసేపు ఆంతరంగిక స్నేహం కావాలి. ఆ తర్వాత చచ్చినా బ్రతికినా నాకు లెక్కలేదు. జవాబు పంపేవరకూ నేనిక్కడనుంచి కదలను. తూర్పున 13 వ ద్వారం వద్ద తెల్లదుప్పటీ పాగా చుట్టుకున్న వ్యక్తి. ఇట్లు అనామకుడు. " 

ఆ లేఖ రాసే సాహసం ఎవరు చేసారో ఇద్దరికీ అర్థం కాదు. ఏం చెయ్యాలో తెలియక తర్జన భర్జనలు పడతారు. ఒక దశలో తనని పరీక్షించడానికి రాయలవారే ఆ పని చేసారేమోననే అనుమానం కూడా వస్తుంది..............

 అబ్బే ! నాకు నమ్మకం కుదరడం లేదే. ఆలయానికి వెళ్ళిన మహారాజు చంద్రగ్రహణం నాడు ఎన్నో కృత్యాలు నెరవేర్చవలసి వుండగా నాతో పరాచికాలాడుతూ కూర్చుంటాడటే - నా వెర్రి కాక ? ఐదు సంవత్సరాల నుంచి లేని ప్రేమ యీనాడు బైలుదేరిందా - నేను నమ్మనే. వీడేవడో దుండగీడు. పొగరుబోతు. నేనంటే అసూయతో కుళ్ళిపోతున్న నా సవతుల ప్రేరేపణల వల్ల ఎవడో తుంటరి బహుమానాలకు ఆశపడి పన్నిన పన్నాగం ఇది.

అంటుంది స్వరూపిణి.   ఇలాగ రకరకాలుగా మధనపడి చివరకు ఆ లేఖ వ్రాసిన వాడ్ని తుదముట్టించాలని నిర్ణయించుకుంటుంది. చిట్టిని పంపి అతన్ని పిలిపించుకుంటుంది. అతడు వచ్చాక తెర వెనుకనే వుండి వివరాలడుగుతుంది. పేరడిగితే అనామకుడనే చెబుతాడు. అంతేకాదు....................

 పేర్లతో సంబంధమేముంది రాణీ. మిమ్మల్ని స్వరూపిణీ దేవి అనికాక కురూపిణీ దేవి అని పిలిస్తే మీ సౌందర్యం మారుతుందా ? నేనది చూడటానికే వచ్చాను.......
నేను నియమాలని, సంప్రదాయాలని, కట్టుబాట్లని, సంఘనీతిని లక్ష్యం చెయ్యను. అసలు మీ వ్యక్తితో, మీ హోదాతో నాకు నిమిత్తం లేదు. మీ సౌందర్యం చూడాలి.

అంటాడు.  స్వరూపిణికి ఒక సందేహం వస్తుంది. ఆ అనామకుడికి భార్య వున్నదాయని. అదే విషయం అతన్ని అడుగుతుంది. అతని సమాధానం..............

లేదు. నా దగ్గర నౌకరీ చెయ్యడానికి ఏ స్త్రీ అంగీకరించలే. నాకు అన్నం పెట్టే శక్తి లేదు గనుక.  

అంటాడు. ఆమెకర్థంకాదు. వివరణ అడుగుతుంది........

వాళ్ళనీ, వాళ్ళ కుటుంబాలనీ అన్నం, బట్టా పెట్టి పోషించగలడు గనక యీ జనానాలో స్త్రీలందరూ రాయలవారికి భార్యలుగా అమ్ముడు పోయారు. అంతకంటే వేరే గూడార్థం లేదు. 

అంటాడు. అతని వృత్తిని గురించి అడుగుతుంది...........

నా వృత్తి సౌందర్యం సృష్టించడం

అంటూ తన హృదయాన్ని ఆమె ముందు పరుస్తాడు.

నాకు బాంధవ్యాలూ, స్నేహాలూ, చుట్టరికాలూ లేవు. ప్రపంచం నాకు పరలోకం. మిగతా మానవులు ఏమీ చేతకాక వొఠి శుంఠలై యీలోకానికి లొంగిపోయి - ఖజానా గుమాస్తాల కింద అమ్ముడుపోయి, అందమైన వొస్తువును అనుభవించడానికి ధైర్యం, తెగింపూ లేక, గౌరవనీయులైన నీతిపరులక్రింద యీ ప్రపంచ రథచక్రాలని పట్టుకు కూర్చున్నారు. వీళ్ళలా నేనూ వుంటే యీ సాహసం యెల్లా చేస్తా. మీరే చెప్పండి. నాకు యథార్థమైన శరీరం వుంటే యిక్కడికి వొచ్చే వుండను. శరీరాన్ని శ్మశానంలోనూ, వ్యక్తిత్వాన్ని విబూదిలోనూ గిరవాటెట్టి, నాయథార్థమైన హృదయాన్ని మీముందు పారేసుకుంటున్నాను. దాన్ని తృణీకరించొచ్చు. హింసించొచ్చు. తన్నొచ్చు. త్యజించొచ్చు - కానీ దాన్ని చంపలేరు. 
స్వరూపిణి : దాన్ని చంపడమే నా సంకల్పం 

అంటుంది. వెంటనే అతను................

ఈ చీరలకోసం, ఈ నగలకోసం, ఈ హోదా కోసం అన్యులు మిమ్మల్ని చూసి అసూయపడాలన్న మీ గుడ్ది కోరిక - యివే యథార్థాలనుకుని నమ్మి, మాతృత్వ, స్త్రీత్వం మొగ్గలోనే తుంచిన మీ మలిన శరీరంలో హృదయం ఎక్కడేడిసింది. ఉంటే రాయలకి యింతమంది స్త్రీలెందుకు ? 

అని నిందిస్తాడు. గడువైపోతోందని హెచ్చరించిన ఆమెతో రాణీగా కాక స్త్రీగా తనకు కనబడాలంటాడు. ఆలోచించిన స్వరూపిణి అలాగే కనబడతానని, అయితే కనబడిన మరుక్షణం తాను సిద్ధం చేసిన విషం తాగాలంటుంది. దానికి సిద్ధమేనన్న అతనితో మరి నీకోసం ఏడ్చేవాళ్ళెవరూ లేరా యని అడుగుతుంది. నా కోసం ఏడ్చేది నువ్వేనంటాడు అతను. ఆమెకతని ధోరణి అర్థం కాదు. ఆగ్రహిస్తుంది. అతను మరింత వివరంగా......................

అవును. నాకోసం ఏడ్చేది మీరే. సృష్టికర్తను నేను. మీకు మాతృత్వం అర్పించే శిల్పం కోసం మీరు ఏడుస్తూ వుంటారు. మా యింటి ఎదురుగా చెరువొకటి వుండేది. అందులో కెరటాలు గట్టున పడి చేసే చప్పుడు ఎదురుతిరగడం చేతకాక, పైకి చెప్పుకోలేక కుళ్ళి కుళ్ళి ఏడ్చే ప్రాచీన స్త్రీల ఏడ్పు చప్పుడులా వుంటుంది. సరస్సులో కెరటాలు గట్టున వయ్యారంగా పడనట్లు మా కన్నీరు మీ రొమ్ము వొంకర్ల మధ్య జారతాయి - శక్తికోసం తపించే పల్చని, మధురమైన కన్నీరు. ఏకాంతసౌధంలో బంధింపబడ్డామని తెలుసుకున్నపుడు మనమందరం అల్లానే నిశ్శబ్దంగా ఏడుస్తూ వుంటాము. పురుషుడి ఘనమైన, నిండైన కలలని మీ కన్నీరు నీరుగా, శూన్యంగా మారుస్తుంది. స్త్రీ కన్నీరులో మునిగి చావడం తప్పనే నేను మీ సౌందర్యమైన కన్నీటిలో మునిగి, రెండు మధురమైన గుటకలేసి చావడానికి సిద్ధంగా వున్నాను

అంటాడు. అంతే స్వరూపిణి తెర తొలగించుకుని బయిటకు వస్తుంది.  అతను తన తలపాగా తొలగిస్తాడు. అతన్ని చూసి ఖంగారు పడుతుంది.

                                                                                                       .....................ఇంకా వుంది. 


Vol. No. 01 Pub. No. 201

Friday, January 15, 2010

ధుమాలమ్మ ఓఘాయిత్యం

నేను : ఆవిడ నూతులో పడాలని అదుగో ఇదుగో అని ఆర్నేల్లనుంచి పట్టుట. వెనుక వీళ్ళింట్లో నుయ్యి పడడానికి ఎంతమాత్రం వీలైంది కాకపోబట్టి అది పూడిపించేసి, ఆవిడ ఇప్పుడున్న నుయ్యి దింపించిందని పుకారు. నుయ్యి ఇరుకైపోయి మనిషి ప్రాణాలు మధ్యదార్లోనే పోతే, జల మరణ పుణ్యం ప్రాప్తించదని ఆవిడ మతం.


అతను : వెనకటికి పూర్వసువాసిని తన ఆడ పడుచు మీద తట్టుగా లేసుగోచ్చి తమరి దొడ్లో ఉన్న వరల నూతిలో దూకపోయి పైనే చిక్కడి రుకుంది, ఒట్టి పొడుం బిరడాలాగ. అప్పుడు, ఎండు కొబ్బరి కాయ పెంకు బద్దలు కొట్టినట్టు పై వరలన్నీ బద్దలు కొట్టి ఆవిణ్ణి విడిపించారట.


నేను : వెనుక, ఈవిడ చలి అని కొన్నాళ్ళూ, ట్టుబండలని కొన్నాళ్ళూ, కాలు బెణికిందని కొంతకాలం, మొగుడు ళ్లో లేడని కొన్నిరోజులూ జాప్యం చేసిందటగానీ, మధ్య చాలామంది పరిచయులతో రూడిగా పడతానని చేబుతోందట. పైగా, ఎక్కడా చెప్పద్దని ప్రతివాళ్ళచేతా కేటాయింపుగా చేతులో చెయ్యి వేయించుగుని, ఊరందరితోనూ తనే చెప్పిందట.


అతను : అంతమంది పెద్దల దగ్గిర తనే చేసిన శపథం తను నిలబెట్టుగో లేకపోతే, మళ్ళీవెళ్లి వాళ్ళమొహం ఎల్లా చూడడం అని ఆవిడ భయం అయి ఉంటుంది. అదీ గాక, వాళ్ళంతా తనని ఎంతమాత్రం స్త్రీత్వం గానీ, మాట నిజాయితీ గాని లేని వ్యక్తి కిందగట్టి తేలిక చేస్తారని ఆవిడ సంకల్పం బహుశా.

నేను : ఏమో ! ఆవిడ ఎప్పుడో ఓఘాయిత్యం చేస్తుందనుకుంటాను మామా

అతను : నే అల్లా అనుకోను. ఆయన అల్లా వెనక్కి లాగుతున్నాకొద్దీ ఆవిడ అల్లా ముందుకి సాగుతూంటుంది. లాగుడు లేని సాగుడు ఉండదు. తెగసాగుడు అంతకన్నా ఉండదు. కొందరు దెబ్బలాటల్లో మధ్యవర్తులు ఆపు చేస్తూన్నకొద్దీ, ఎదర పార్టీ మీద ఎగురుతుంటారు. అవతల్నించి తగిలే దెబ్బలు ఎల్లానూ ఉండవని వాళ్లకి తెలుసును గనుక, అయ్యా తీర్చిన కొద్దీ అములు ఎక్కువ !

నేను : నిజమేస్మీ. కొందరు రోగులు ఇంట్లో ఉరుకోమనే వాళ్ళు ఉంటున్న కొద్దీ మూలుగు అధికం చేస్తుంటారు. అంచేత, ఆవిణ్ణి ఎవరేనా నూతులోకి గెంటాలిగాని, ఆవిడ ఉరకదు, నాదీ పూచీ.

ఒక సగటు మధ్య తరగతి గృహిణి తన భర్త బాధ్యతా పట్టకుండా రికామీగా తిరుగుతూంటే భరించలేక తన కోపాన్నీ, ఆక్రోశాన్నీ వెళ్లగక్కే సందర్భమది. ఆవిడ పేరు ధుమాలమ్మ. ఆవిడ భర్త పేరు సరప్ప. ఇద్దరికీ ఒక్క నిముషం పడదు. వాళ్ళింట్లో నిత్యాగ్నిహోత్రమే !

అందుకే ఆవిడ ఓసారి నిజంగానే నూతిలోకి ఉరికి భర్తను తిడుతున్నపుడు ఆయనంటాడు....

' నువ్వు నీళ్ళలో మండే జ్యోతివే ! కానీ మొగుణ్ణి తిడుతున్నావ్, అనుభవిస్తావ్ లే ' అని.

అప్పుడావిడ ' అయ్యా వింటున్నారా ! మొగుడయేది, వారయేది, వీరయేది, నాది ఇంకోరి చేత మాట పడే ఘటం కాదు. మరేం చెప్పద్దూ ! మా వంశం మహా అభిమానం గల వంశం. అందులో నాకు మహా రోషం. మంచికి మంచిదాన్నేగానీ, ఆజ్ఞలు అధికారాలు నా దగ్గర సాగవ్ ' అని ఖరాఖండీగా చెప్పేస్తుంది.

భర్తతో ఆవిడెంత విసిగిపోయిందో అర్థమయింది కదా ! భర్త మీద కోపం వచ్చినపుడల్లా ఆవిడ ఉపయోగించే ఆయుధం ఆత్మహత్య. అది కూడా నూతిలో దూకడం. విధంగా భర్తని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చెయ్యగలుగుతున్నానని ఆవిడ భావన.

కానీ మానవుడు చలించడు. అందుకే ఆవిడ నూతిలో దూకినపుడు ఆవిణ్ణి కాపాడడానికి ప్రయత్నిస్తున్న వారితో తాపీగా

' నిచ్చెన వెయ్యండి. మహా చక్కగా వస్తుందీ పెళ్లికూతుర్లాగా ! ' అంటాడు.

దాంతో ఆవిడ కోపం నసాళానికి అంటింది. చెడామడా తిట్టి పోసింది. చివరకు పెంపుడు కూతురు బాధ చూడలేక ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకుంటుంది.

ఆవిణ్ణి రక్షించడానికి నూతిలోకి దిగినతను ' ధుమాలమ్మ గారూ ! మీకు దణ్ణం. మీ సాటి ఏలోకంలోనూ లేరు. నే బాఘా ఎరుగుదును. దయచేసి నిచ్చెన ఎక్కండి ' అని బ్రతిమలాడ్తాడు.

కొంచెం బెట్టు చేస్తూ ' మీరంతగా పట్టుబడితే నేను ఏం జెప్పనూ ! అల్లాగే ! నిచ్చెన మెట్టు ఘట్టిదేనా నన్నూ, నిచ్చేన్నీ కూడా ఈడవాలేమో, తాడు కాస్త జమిలిగా ఉండేది తేకపోయారూ ! ' అంటుంది.

ఆయనకు ఒళ్ళుమండి ఆవిడ నూతిలోంచి బయిటకు వచ్చేదాకా ఊరుకుని ' ఇంత తాపత్రయంగల ఘటానివి ఎందుకు పడాలమ్మా అసలూ ' అంటాడు.

మొత్తానికి ఎలాగయితే అన్ని ఏళ్ళ ఆవిడ ఆత్మహత్యా ప్రయత్నం అర్థంతరంగా ముగుస్తుంది. భర్తను బెదిరించడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా నిజంగా అయితే ఆవిడ ఎప్పుడూ దూకలేదు.

ప్రతీసారి ఆవిడ దూకుతానని నూతి దగ్గరకు వెళ్ళడం, ఒక ప్రక్క భర్త, మరో ప్రక్క పెంపుడు కూతురు పట్టుకుని బ్రతిమాలి తీసుకు రావడం మామూలయిపోయింది. మరి ఇప్పుడు ఆవిడకి నూతిలో దూకేసేం ధైర్యం ఎలా వచ్చింది ?

ఎలాగంటే ...................

ఆరోజు కూడా ఆవిడ నూతిగోడ మీదనుంచి లోపలకు వంగుని యధావిధిగా తనను పట్టుకున్న భర్త, కూతురు చేతుల్లోంచి పెనుగులాడుతూ హంగామా సృష్టిస్తోంది.

భర్తకు విసుగొచ్చి " పోన్లేవే, ఇంతకంటే నన్ను చావమన్నవా ఏమిటీ " అంటూ చెయ్యి వదిలెయ్యడంతో పట్టుదప్పి నూతిలో పడిపోయింది.

అదీ ' ధుమాలమ్మ ఓఘాయిత్యం ' కథ.

హాస్య బ్రహ్మ భమిడిపాటి కామేశ్వర రావు గారు రాసిన కథలో అడుగడుగునా ఆయన మార్క్ హాస్యం తొణికిసలాడుతుంది. మధ్య తరగతి మనస్తత్వాలకు హాస్యపు తళుకులు అద్ది కథ ఇది. హద్దులు దాటని సున్నితమైన హాస్యం పాఠకుల్నిగిలిగింతలు పెడుతుంది.

భార్యాభర్తల మధ్య తగాదాలు రావడం, ఉద్రేకాలకు లోను కావడం, ఆత్మహత్యలకు పాల్పడడం కొత్త విషయం కాదు. కానీ ఎంత ఆవేశపడినా, ఎదుటి వారిని భయపెట్టడానికి ఇటువంటి హంగామాలను సృష్టించినా వారికి సాధారణంగా సంసార ఝంఝాటం, పిల్లల బాధ్యతలు అడ్డు పడతాయి. కానీ ప్రయత్నాలు శృతి మించితే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి.

విషయాన్ని సీరియస్ గా పాఠంలా కాకుండా ఆహ్లాదకరమైన శైలిలో రాసారు భమిడిపాటి కామేశ్వర రావు గారు.

Vol. No. 01 Pub. No. 159